చల్లపల్లి స్వరూప రాణి
తలపోయం గులతత్వ దృష్టిగల వార్తా పత్రికల్ వ్రాయు వ్రాతలచే దేశ మసత్యమున్ మరిగి విలపించున్’- మహాకవి గుర్రం జాషువ సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆనాటి పత్రికల కుల, వర్గ తత్వాన్ని, అబద్దాలకోరుతనాన్ని యెత్తి చూపుతూ గుర్రం జాషువ రాసిన యీ పద్యం మీడియా పరంగా యీనాటి పరిస్థితికి కూడా బాగా వర్తిస్తుంది.
ఈ దేశంలో మిగిలిన మూడు యెస్టేట్స్ మాదిరిగానే నాలుగో యెస్టేట్ అయిన మీడియా కూడా కులతత్వపు బురదలో కూరుకుపోయి వుం దని చెప్పడానికి మన దగ్గర చాలా వుదాహరణలున్నాయి. మీడియా సంస్థలు, పత్రికలు సంఖ్యాపరంగా చూస్తే భారత దేశం చైనా తర్వాత రెండో స్థానంలో వుంది. అభివృద్ధి చెందినది అని భావించే అమెరికా కూడా యీ విషయంలో వెనకబడి వుందని చెప్పాలి. అయితే పత్రికా స్వేచ్చ విషయంలో భారత దేశం ప్రపంచదేశాలలో 133 వ స్థానంలో అత్యంత హీన స్థితిలో వుండడం గమనార్హం. మీడియా పరిస్థితిపైన 2016 లో జరిగిన వొక సర్వే ప్రకారం మీడియా రంగంలో నిర్ణయాలు తీసుకునే 315 మందిలో వొక్క షెడ్యూలు కులాలకు, తెగలకుు చెందిన వ్యక్తి లేకపోవడం మీడియాలో దళితుల వాటా యేమిటో చెప్పకనే చెబుతుంది. జనాభాలో 40 శాతంగా వున్న వెనుకబడిన కులాలు కేవలం నాలుగు శాతం మాత్రమే మీడియాలో వాటాదారులుగా వున్నారు. యిక ముస్లింల పరిస్థితీ అంతే. జనాభాలో పదిహేను శాతంగా వున్న ముస్లింలు మూడు శాతం మీడియాలో వాటా పొందుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా జనాభాలో కేవలం పదహారు శాతంగా వున్న పెత్తందారీ కులాలు మీడియాలో 86 శాతం వాటాను పొందుతూ మీడియా రంగాన్ని శాసిస్తున్నారు. మీడియా యే వర్గం చేతిలో వుంటుందో సహజంగానే అది ఆ వర్గపు ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. రేడియోల కాలం నుంచీ అన్ని సామాజిక వర్గాలకూ ప్రసార సాధనాలంటే గురి యెక్కువ. అవి అబద్దాలు చెబుతాయని ప్రజలు అనుకోరు. యెవరన్నా అది అబద్దమని చెప్పినా ‘పత్రికలకంటే మనకెక్కువ తెలుసా?’ అని అమాయకంగా అడిగే జనం యింకా వున్నారు కనుకనే పెత్తందారీ కులాల మీడియా పచ్చగా కళ కళ లాడుతుంది.
దళితులను సమాజంలో భాగంగా గుర్తించని వైదిక సాహిత్యం వారిని తమ యజ్ఞ యాగాలను పాడు చేసే రాక్షసులుగానూ, దుర్మార్గులుగానూ, హింసాత్మకమైన వారుగానూ పేర్కొంటే ప్రబంధ సాహిత్యం దళితులు యెదురైతే వారి మైల తగలకుండా యెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వారికి యెంత దూరంలో నడవాలో పేర్కొంటుంది. అలాగే వారిని నేరస్తులుగా పేర్కొంటుంది. యీ ధోరణిలో యిప్పటికీ పెద్ద మార్పు వున్నట్టు అనిపించదు. దళితులపై పెద్ద యెత్తున అత్యాచారాలు, మారణకాండలు జరిగినప్పుడు అక్కడ వారిపై యితరుల దాష్టీకం గురించి పై పైన రాసి అక్కడ ‘పెట్రేగి పోయిన దళితులు’, ‘రెచ్చిపోయిన దళితులు’, ‘కోపోద్రిక్తులైన దళితులు’, ‘ఆవేశపూరితులైన దళితులు’ అనే భాషతో ఆ దారుణాన్నంతా చిన్న విషయంగా కుదించి దళితుల ప్రతిస్పందనని పెద్దగా భూతద్దంలో చూపించడం చూస్తాం. దళితులు ఆత్మ హత్య చేసుకుంటేనో, హత్యలకు గురైతోనో, వారు నేరాలకు పాల్పడితేనో తప్ప దళితుల ప్రస్థావన పెత్తందారీ కులాల ప్రసార సాధనాలలో కనిపించడు. దళితుల పరంగా జరిగిన లోపాలను పెద్దవిగా చూపిస్తూ వాటిని ఆ సామాజిక వర్గానికంతటికీ ఆపాదించడం, వారి అభ్యుదయకరమైన అంశాలను చూసీ చూడనట్టు వ్యవహరించడం మీడియాలో సర్వ సాధారణం.
2016 లో అంబేడ్కర్ బౌద్ధ ధర్మ దీక్ష తీసుకుని అరవై ఏళ్లు అయిన సందర్భంగా నాగపూర్ దీక్షా భూమి దగ్గర దాదాపు ఐదు లక్షల మంది హాజరై పెద్ద యెత్తున బౌద్ధ సమ్మేళనం జరిగితే దాన్ని మీడియా బొత్తిగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారానే యీ విషయం బయటికి వచ్చింది. వెనక్కెళితే యిటువంటి ఘనకార్యాలు పెత్తందారీ కులాల చేతిలో వూరేగే మీడియా యెన్నో చేసినట్టు తెలుస్తుంది. 1968 లో దళిత యువకుడైన కోటేసును కృష్ణా జిల్లా కంచికచెర్ల లో అక్కడి కమ్మ కులస్తులు దారుణంగా సజీవ దహనం చేసినప్పుడు ఆ దారుణాన్ని వొకవైపు బీ.బీ.సీ ఖండిస్తే, లోకల్ కమ్మ మీడియా ‘ మరి రాగి చెంబు కాజెస్తే చంపక ముద్దు పెట్టుకుంటారా!’ అనే ధోరణిలో రాయడం యీ దేశంలోని మీడియా కులతత్వానికి మచ్చు తునక.
2006లో జరిగిన ఖైర్లాంజి దళిత కుటుంబం వూచకోత తాలూకు వార్త యిరవై నాలుగు గంటలు గడిచాక బయటకు వచ్చిన విషయం చాలమందికి గుర్తుండే వుంటుంది. చీమ చిటుక్కుమంటే క్షణాల్లో ప్రపంచానికి తెలిసి పోతున్న యీ రోజుల్లో గరగపర్రు దళితుల వెలి అంశం మూడునెలల తర్వాత వార్త అవ్వడం వెనుక యేముందో ఎవరైనా వూహించవచ్చు. ‘బాహుబలి’ సినిమాపైన ప్రతి అరగంటకొక కధననాన్ని టీవీలు ప్రసారం చేస్తున్న రోజుల్లో( April 2017) గరగపర్రులో దళితులను గ్రామం లోని సామూహిక జీవనం నుంచి అక్కడి రాజులు వెలి వెయ్యడం కనీసం వార్త కాకపోవడం యెంత విచిత్రం!
దళితుల వార్తలను మనువాద మీడియా కవర్ చేసిన సందర్భాలలో చాలా వరకు తప్పుడు వక్రీకరణలు గానీ లేక అబద్దాలు గానీ వుండడం జరుగుతుంది. 2016 లో గుజరాత్ రాష్ట్రంలో నలుగురు దళిత యువకులను గోరక్షా దళం వారు పెట్టిన చిత్ర హింసలకు వ్యతిరేకంగా అక్కడి దళిత యువకులు పెద్ద యెత్తున వుద్యమించడమే కాకుండా ‘అస్మిత’ యాత్ర పేరుతో అహ్మదాబాద్ నుంచి పది రోజుల పాటు ర్యాలీని నిర్వహించడం తెల్సిందే! అయితే యీ అంశాన్ని మొదట్లో బొత్తిగా కవర్ చెయ్యని మీడియా తర్వాత ఆ కార్యక్రమాన్ని కన్నయ్య కుమార్(కన్నయ్య అసలు ఆ యాత్రలో పాల్గొనలేదు)లాంటి అగ్రకుల యువకులు నిర్వహించినట్టు చెప్పుకు రావడం మనువాద మీడియా కురచదనం, కుళ్ళుబోతుతనం కళ్ళకు కట్టినట్టు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెల్సింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ సంస్థాగత హత్య విషయంలో వొకవైపు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున స్పందన వచ్చి అంతా రోహిత్ చివరి సారిగా రాసిన వుత్తరంలోని అంశాలను చర్చిస్తుంటే దుష్టకులాల మీడియా చర్చని రోహిత్ కులం వైపుకి చాకచక్యంగా మళ్ళించింది. రోహిత్ కుటుంబానికి యేమీ కాలేని అతని తండ్రి కోసం గాలం వేసి పట్టుకొచ్చింది. రోహిత్ సందర్భంగా వువ్వెత్తున యెగిసిన దళిత చైతన్యం రాజకీయ చైతన్యంగా మారకకుండా పెత్తందారీ కులాలు తమ పెంపుడు కుక్క మీడియాని కాపలా పెట్టి విజయం సాధించాయనవచ్చు. ఆ పెంపుడు కుక్కే రోహిత్ కేసు నీరు కారిపోయేదాకా వుండి చివరకు వీ.సీ. అప్పారావు చేత చేతులు కడిగించించడం చూశాం. దళితుల ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆశించినంతగా యెదగక పోవడం వెనుక పెత్తందారీ కులాల మీడియానే పరొక్షంగా కారణం. వారిలో వారికి తంపులు పెట్టి తమాషా చూసే కధనాలను అప్పుడప్పుడు ప్రసారం చేస్తాయి. మాల మాదిగలు తన్నుకు చచ్చే వార్తలంటే వీరికి చాలా యిష్టం. అలాగే ‘పరువు’ హత్యలను పై కులాలందరి ‘పరువు’ కు సంబంధించిన అంశాలుగా లేక పోతే రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రించడం జరుగుతుంది.
మీడియా తమకు కావల్సిన వాళ్ళను యెంత అందలమైనా యెక్కిస్తుంది అనే విషయాన్ని అంబేడ్కర్ ఆనాడే గుర్తించి తన భావాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళే ‘మూక్ నాయక్, ‘ బహిష్కృత భారత్’, ‘జనత’, ‘ ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలను ప్రారంభించి దళితులకు దిశానిర్దేశం చేశాడు. సోషల్ మీడియాను దళితులు శక్తివంతంగా వుపయోగించుకుని బయట వుండే పత్రికలు, టీవీలు చెప్పే అబద్దాలను, వాటి కులగజ్జిని బాగానే యెండ గడుతున్నారు. యిది యింకా పెద్ద యెత్తున జరగాలి దీనికి తోడు దళిత పత్రికలను అందరూ తమ రచనలతో బలపరచాలి. తమదైన మీడియా ద్వారానే దళితుల ఆకాంక్షలు ప్రతిఫలించి నెరవేరతాయి. మీడియా యెవరి చేతిలో వుంటుందో వారి భావజాలమే అందరి భావజాలంగా ప్రచారమౌతుంది కనుక దళితులకు తమదైన మీడియా అవసరం.
(పోయినేడు సెప్టెంబర్ 19 న సామాజిక పరివర్తన కేంద్రం ‘ బహుజనులు-మీడియా’ అనే అంశం పై విజయవాడలో సభను యేర్పాటు చెయ్యడం అందరూ ఆహ్వానించాల్సిన పరిణామం. కార్యక్రమ నిర్వాహకుడు వున్నవ వినయ్ కుమార్ గారికి అభినందనలు !)