– మన్ కీ బాత్కు డిస్లైక్ల వెల్లువ..
– మన్కీ నహీ.. స్టూడెంట్స్కీ బాత్ కావాలంటూ కామెంట్లు
– బీజేపీ యూట్యూబ్ ఛానల్కూ నిరసనల సెగ
ప్రధాని మోడీకి సామాజిక మాథ్యమాల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారంటూ ప్రచారాలపై అనుమానాలు లేకపోలేదు. అయితే కరోనా కన్నా ముందు తర్వాత మోడీ ఇమేజ్ తగ్గిందా..? ఇటు ఆర్థిక కష్టాలు.. దేశ రాజకీయాల నుంచి దృష్టి మరల్చాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయా..? బీజేపీ పెద్దలపై కామెంట్ చేస్తే దేశద్రోహం కేసులు పెట్టడానికి కేంద్రపాలకులు వెనకాడటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో అంత ధైర్యం ఎలా వచ్చింది..? తాజాగా మోడీకి ఎదురైన షాక్ ఏంటీ..?.
న్యూఢిల్లీ : ఎంతో ప్రతిష్టాత్మకమైన మోడీ ‘మన్ కీ బాత్’కు నిరసన సెగ తాకింది. తాజాగా ప్రసారమైన ‘మన్ కీ బాత్’కు డిస్లైక్ లు వెల్లువెత్తాయి. ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శ న్తోపాటు కొన్ని ప్రయివేటు ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి. అంతేకాదు పీఐబీ, పీఎంవో, బీజేపీ యూట్యూబ్ ఛానళ్ళలోనూ ఈ కార్యక్ర మం ప్రసారమైంది. కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ యూట్యూబ్ ఛానల్లోనే డిస్లైక్లు ఎక్కువరా వటం గమనార్హం. ఇప్పటివరకూ మన్ కీ బాత్కు వచ్చిన డిస్లైక్ల్లో ఇవే అత్యధికం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ‘మన్కీ నహీ స్టూడెంట్స్కి బాత్’ను విద్యార్థులు కోరుకుంటున్నారంటూ కామెంట్లు పెట్టారు. ‘ఇంకా సమయం ఉంది మోడీగారు పరీక్షలను వాయిదా వేయండి. కోవిడ్ విజృంభి స్తున్న సమయంలో పరీక్షల కంటే విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి’ అంటూ కామెంట్ బాక్స్లో పోస్టులు వెల్లువెత్తాయి.
బీజేపీ యూట్యూబ్ ఛానల్లో…
బీజేపీ యూట్యూబ్ ఛానల్లోనే ఈ కార్యక్రమానికి అత్యధికంగా డిస్లైక్లు వచ్చాయి. కార్యక్రమం ప్రసారమైన 24 గంటల తర్వాత… 79 వేల మంది ఈ కార్యక్రమానికి లైక్లు కొట్టగా, 5.34 లక్షల మంది వీక్షకులు డిస్లైక్ చేశారు. 35 లక్షల మంది ఈ ఛానల్కు సబ్స్కైబర్స్ ఉండగా… ఈ కార్యక్రమాన్ని 10 లక్షల మంది మాత్రమే చూడటం గమనార్హం. అలాగే పీఎంఓ యూట్యూబ్ ఛానల్లోనూ ఈ వీడియోకు నెగెటివ్ లైక్లే ఎక్కువ వచ్చాయి. 39 వేల మంది లైక్ చేయగా, 85వేలమంది డిస్లైస్ చేశారు. మరోవైపు మోడీ యూట్యూబ్ ఛానల్లోనూ ఈ వీడియోకు 23 వేల లైక్లు రాగా.. డిస్లైక్లు మాత్రం 48 వేలకు పైనే ఉన్నాయి. మరోవైపు పీఐబీ యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోకు 3.4 వేల లైక్లు రాగా.. డిస్లైక్లు 8 వేలకుపైనే ఉన్నాయి.
డిస్లైక్లు ఎందుకు?
కరోనా సంక్షోభం నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా ప్రధాని మోడీ మాత్రం తన ప్రసంగంలో దాని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభంపైనా కామెంట్ సెక్షన్లో యూజర్స్ కామెంట్లు పెట్టారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పలుమార్లు తమ నిరసనను వ్యక్తం చేసిన విద్యార్థులు.. తాజాగా మోడీ వీడియోకి డిస్లైక్స్ కొట్టి మరోసారి తమ నిరసన తెలియజేశారు. సెప్టెంబర్ 30 లోపు యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని యూజీసీ జులై 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు కోర్టుకు వెళ్ళగా… పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టూ సమర్థించింది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. ఎంట్రన్స్ పరీక్ష నీట్ ఈ నెల 13న జరగనుండగా, జేఈఈ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు.
మోడీ ఏం చెప్పారు?
విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, జీఎస్టీపై నడుస్త్ను చర్చ, నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్, ఆర్థిక సంక్షోభం వీటిపై ఎలాంటి ప్రస్తావనా చేయని ప్రధాని… దేశాన్ని బొమ్మల కేంద్రంగా (టాయిస్ హబ్)గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బొమ్మల వ్యాపారంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో బొమ్మల పరిశ్రమ విలువ ఏడు లక్షల కోట్లకుపైనే ఉందన్న ఆయన, దీనిలో మన దేశ వాటా మాత్రం చాలా తక్కువగా ఉందన్నారు. దేశీయంగా బొమ్మలు తయారుచేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ‘మన దేశంలో చాలా కాన్సెప్ట్లు, ఐడియాలు ఉన్నాయి. బొమ్మలు, వర్చువల్ గేమ్స్ను దేశీయంగా తయారుచేసే అంశాలపై దృష్టిసారించాలి’ అని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలనూ వదిలేసి… బొమ్మల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ మోడీ ప్రసంగంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Courtesy: NT