– మెజారిటేరియనిజంతోనే భిన్నాభిప్రాయాలకు కష్టకాలం
– ఎన్నికలు గెలిచినంత మాత్రానా బహుళత్వాన్ని రూపుమాపే అధికారం ఉండదు : అమర్త్య సేన్
కోల్కతా: ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని తుడి చిపెట్టే అధికారాన్ని పొందినట్టు కాదని స్పష్టం చేశారు. బెంగాల్లో సీపీఐ(ఎం) ప్రాబల్యం తగ్గిపోవడంతో మత వైషమ్యాలు పెరుగుతున్నా యని అన్నారు. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమర్త్యసేన్ ‘ఆన్ బీయింగ్ ఎ బెంగాలీ’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న మెజారిటేరియన్ విధానాల వల్లే భిన్నాభిప్రాయాలు కలిగి ఉండే స్వేచ్ఛ కుచించుకుపోతున్నదని చెప్పారు. అయితే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై జరుగుతున్న దాడులకు గట్టి ప్రతిఘటన వస్తున్నదని, ప్రతిఘటించేందుకు ప్రాణాలను త్యాగం చేసేందుకైనా సిద్ధమయ్యే ప్రజలున్నారని తెలిపారు. హేతువు (రీజన్) బలంగా లేకుంటే ఫాసిస్టు భావజాలం వేగంగా వ్యాపిస్తుందని అన్నారు.
1940వ దశకంలో బెంగాల్లో మత అల్లర్లు వ్యాప్తి చెందేందు కు హేతువు లోపించడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శాంతినికేతన్ విద్యార్థి ఆనంద్ పట్వర్దన్ నిర్మించిన ‘రీజన్’ సినిమాను ప్రస్తావించారు. తన తాతయ్య క్షితిమోహన్ సేన్ సంభాషణను అమర్త్య సేన్ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఢాకా బిక్రంపూర్లోని సోనాగావ్లో కొన్నేండ్ల క్రితం ఓ మౌల్వీ ఓ హిందు నివాసిని తేనీటి విందుకు ఆహ్వానించాడని చెప్పారు. తేనీటిని స్వీకరిస్తున్నప్పుడు వారి ముందు నుంచి వెళ్తున్న ఓ హిందూ పూజారినీ తేనీటికి ఆహ్వానించగా.. ఆయన తాను పవిత్రమైన హిందువుడని చెబుతూ తిరస్కరించాడని వివరించారు. వెంటనే ఆ మౌల్వీ నవ్వుతూ నీవు నేను ఒకటేనంటూ వివరించాడని చెప్పారు. పూజారివైన నీవు హిందువుల మేలు కోరి పూజలు చేస్తే..నేను ముస్లింల కోసం ప్రార్థిస్తానని చెప్పాడని తెలిపారు. బెంగాల్లో ఎంత బహుళత్వమున్నా తామంతా ఒకటేనన్న భావన ఉండేదని అన్నారు. బ్రిటీషర్లు వారి అవసరం కోసం మత వైషమ్యాన్ని రేకెత్తించారని చెప్పారు. బ్రిటీషర్ల కాలంలోనే భూములను జమీందార్లకు అప్పజెప్పారనీ, సుల్తాన్లు లేదా నవాబ్ల కాలంలో పాలకులు వారి సొంత మతస్తులకూ భూములను కట్టబెట్టలేదని గుర్తుచేశారు.
అసలు రామాయణ, మహాభారతాలను బెంగాలీలోకి అనువదించే పనిని ముస్లింపాలకులే పురమాయించారన్న సత్యాన్ని మరువరాదని తెలిపారు. బెంగాల్ స్వతంత్ర నవాబ్ సిరాజుద్దౌలా కీలక బృందంలో నలుగురు హిందువులుండగా.. ఇద్దరే తన మతస్తులుండేవారని చెప్పారు. బెంగాలీలో ఠాగూర్ తర్వాత ఖాజీ నజ్రుల్ పద్యాలే ఎక్కువ ప్రాచుర్యమున్నవని అన్నారు. ఆయన సామ్యవాద ఆలోచనలు కలిగి ఉండేవాడని, బెంగాలీ భాషలోకి కారల్ మార్క్స్ జీవిత చరిత్రను అందించినది ఆయనే అని చెప్పారు.
(Courtacy Nava Telangana)