-లాక్డౌన్తో సర్వం కోల్పోయిన కార్మికులు
– 78 శాతం మందిది ఇదే అభిప్రాయం
– నగరాల్లోనూ చాలీచాలని బతుకులు..
– ఉపాధి దొరక్క రెండు పూటలూ పస్తులే..
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే పేరిట నిర్దిష్ట ప్రణాళిక లేకుండా మోడీ సర్కారు విధించిన లాక్డౌన్ అసంఘటితరంగ కార్మికులను నిండా ముంచింది. లాక్డౌన్ ప్రారంభంలో నగరాల నుంచి ఎర్రటెండలు సైతం లెక్కజేయకుండా కాలినడకన వెళ్లిన వాళ్ల బాధలు వర్ణణాతీతం. లాక్డౌన్తో జీవనోపాధి కోల్పోవడంతో వారి బతుకులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. నగరాల్లో అసలే చాలీచాలని జీవితాలతో నెట్టుకొస్తున్న వారంతా.. కేంద్ర సర్కారు దెబ్బకు రెక్కలు తెగిన పక్షులయ్యారు. లాక్డౌన్ కారణంగా అసంఘటితరంగంలో పనిచేస్తున్న 78 శాతం మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని యాక్షన్ ఎయిడ్ అనే సంస్థ తెలిపింది. ఈ మేరకు ‘కోవిడ్-19 కాలంలో కార్మికులు’ అనే పేరు మీద ఆ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.
20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలితప్రాంతంలో సుమారు 12 వేల మందిని ఇంటర్వ్యూచేసి దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు. మూడో దశ లాక్డౌన్ ప్రారంభమయ్యాక ఈ సర్వేను చేపట్టారు. సర్వేలో పేర్కొన్నదాని ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తాము ఉపాధి కోల్పోయామని 78 శాతం మంది కార్మికులు తెలిపారు. అంతకుముందు వారానికి 50 గంటల దాకా పనిదొరికితే.. ఇప్పుడు ఒక్క రోజు పనిదొరకడమే కష్టంగా ఉందని వాపోయారు. అంతోఇంతో పనిచేస్తున్న వారిలో కూడా 48 శాతం మంది తమకు వేతనాలు రావడం లేదని చెప్పారు. కేవలం 17 శాతం మంది మాత్రమే కొద్దిగా వేతనాలు పొందుతున్నామని అన్నారు.
సర్వేలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది తాము ఏడాదికి ఒక్కసారి వలసవెళ్తామని తెలపగా.. 43 శాతం మంది ఏడాదిలో రెండుసార్లు వెళ్తామని అన్నారు. ఇక వలసవెళ్తున్న కార్మికుల్లో 15 శాతం మంది ఎస్టీలు ఉండగా.. 39 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. అయితే నగరాలు, పట్టణాలకు పనులకు వెళ్తున్న వీరంతా అక్కడ దుర్బర జీవితాలనే గడుపుతున్నారు. సాధారణంగా నగరాల్లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉంటాయి. పని దొరికిన రోజే పూట గడిచే స్థితిలో ఉండే ఈ కార్మికులకు.. అంతంత ఖర్చు చేసి అద్దెకుండే పరిస్థితుల్లేవ్. దీంతో మురికివాడల్లోనో, పట్టణాలకు బయట ఉండే కాలనీల్లో నివాసం ఉంటారు. వలసవచ్చే కార్మికుల్లో 13 శాతం మందికి మాత్రమే అద్దె ఒప్పందాలు (రెంటల్ అగ్రిమెంట్స్) ఉన్నాయి. తొమ్మిది శాతం మందికి వారికి పనిచ్చే సంస్థలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే ఇందులో ఒక గదిలో ఆరుగురు నుంచి పదిమంది దాకా ఉండటం.. అందరికీ ఒకే టాయిలెట్ ఉన్న గదులే అధికం.
లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోవడంతో ఇంటి అద్దెలు కట్టలేక వెళ్లిపోయామని 44 శాతం మంది తెలిపారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో 18 శాతం మంది కార్మికులను బలవంతంగా తాము గెంటివేయబడ్డామని అన్నారు. ఇక లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారి రుణాలు తీసుకుని (ఇప్పటికే ఉండి కూడా) కాలం వెల్లదీస్తున్నామని 55 శాతం మంది తెలిపారు. ఇన్నాళ్లు దాచుకున్న నగదంతా అయిపోయి అప్పులు తీసుకుంటున్నామని 95 శాతం మంది కార్మికులు చెప్పడం గమనార్హం.
లాక్డౌన్ కష్టాలు చుట్టుముట్టడంతో కార్మికులకు రెండు పూటల తిండి కూడా కరువైంది. ఉపాధి లేక వారంతా బతుకు జీవుడా అంటూ గ్రామాలకు వెళ్లినా.. అక్కడా పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది రోజులో ఒకపూట భోజనాన్ని మానేశామని తెలపగా.. 34 శాతం మంది రోజుకొకసారే తింటున్నామని చెప్పారు. ఇక తాము రెండ్రోజులకొకసారి భోజనం చేస్తున్నామని 3 శాతం మంది తెలిపారు. ఇక అసంఘటితరంగ కార్మికులకు ఉచిత రేషన్, నగదు సాయం చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటుండగా.. అదీ వాస్తవం కాదని తేలుతున్నది. 79 శాతం మంది కార్మికులు తమకెలాంటి నగదు, రవాణా, రేషన్ సాయం అందలేదని కుండబద్దలు కొట్టారు.
Courtesy: NT