- రిజిస్ట్రేషన్ అధికారం తహసీల్దార్లకు
- వారం రోజుల్లో పాస్ పుస్తకం ఇంటికి
- రెవెన్యూ కోర్టులు ఇక చరిత్రలోకి
- నేడు సభలోకి తెలంగాణ భూహక్కులు
- పట్టాదార్ పాస్బుక్ బిల్లు-2020
- తెలంగాణ వీఆర్వోల రద్దు బిల్లు కూడా
- రైతులకు భూమిపై హక్కు కల్పనే లక్ష్యం
- పాస్బుక్ జారీలో అవినీతి నిర్మూలనా..
- మన చట్టాలు ఉండాలన్న సంకల్పమూ
- నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ఇక గ్రామాల్లో వీఆర్ఏలే కీలకం
గ్రామాల్లో 22 వేల మంది దాకా ఉన్న వీఆర్ఏలు, రద్దు కానున్న వీఆర్ఓలకు ప్రత్యామ్నాయంగా ఉండనున్నారు. వీరిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైనవారు అధికంగా ఉన్నారు. మిగిలిన వారంతా వారసత్వంగా వీఆర్ఏలున్నారు. వీరి సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్వోల రద్దు బిల్లు చట్టరూపం దాల్చగానే వీఆర్ఏలకు బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరగ్గానే రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ ఆటోమేటిక్గా జరిగేలా తెలంగాణ ప్రభుత్వం ‘‘తెలంగాణ భూ హక్కులు-పట్టాదార్ పాస్బుక్ బిల్లు-2020’’ ను రూపొందించింది. బుధవారం శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇది ఆమోదం పొందితే నోటీసులు లేకుండానే రైతులు/భూ యాజమానుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. ఆ తర్వాత ఎలకా్ట్రనిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్పుస్తకాల ముద్రణ నిమిత్తం డేటా.. ప్రింటర్కు చేరనుంది.
రెవెన్యూశాఖలో చోటుచేసుకునే అవినీతిలో 90 శాతం మ్యుటేషన్, పట్టాదార్ పాస్పుస్తకాల జారీతోనే ముడిపడి ఉండటంతో దీనికి అడ్డుకట్ట వేస్తూ ఆర్వోఆర్(రికార్డ్ ఆఫ్ రైట్) చట్టంలోని కీలకమైన క్లాజులను మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ జరగ్గానే.. ఆ భూముల లావాదేవీలు సరైనవేనా కాదా అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి, 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్ చేసేవారు. దీన్ని వారం రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆర్వోఆర్ యాక్ట్ను సవరించగా… తాజాగా బిల్లులో అసలు నోటీసుల విధానానికే ఉద్వాసన పలికారు. దీనికి ఆమోదం లభిస్తే… వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా తహసీల్దార్ చూడనున్నారు. ఇక గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను రద్దుచేస్తూ మరో బిల్లు ‘‘ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్లు-2020’’ను కూడా ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5600 దాకా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దుచేసి, వీరిని ఇతర శాఖల్లో విలీనం చేసేలా బిల్లును రూపొందించారు. దాంతో రెండంచెలుగా ఉన్న గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఒక అంచె కీలకంగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులను శాఖ నుంచి తొలగిస్తుండగా మరో అంచెలో ఉన్న 22 వేల మంది దాకా ఉన్న వీఆర్ఏలు కీలకం కానున్నారు.
ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే
ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్గా పేరు చేరనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొన్ని షరతులు విధించి… ఈ ప్రక్రియ చేపట్టేలా కొత్త యాక్ట్ను అనుసరించి, చర్యలు తీసుకోనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగి… మ్యుటేషన్ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరనుంది. ఆ తర్వాత నేరుగా భూముల యాజమాని/రైతు ఇంటికే పాస్పుస్తకం చేరుతుంది. దీనికోసం రైతుల నుంచి పోస్టల్ చార్జీల రూపేణా నిధులను ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఇక వారం రోజుల్లోపు పాస్పుస్తకం ఇంటికి రానుంది.
రెవెన్యూ కోర్టులు రద్దు
వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇక తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల అధికారాలకు కత్తెరపెడుతూ వీరు నిర్వహించే రెవెన్యూ కోర్టులను రద్దు చేయనుంది. ఈ మేరకు బుధవారం సభలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ భూహక్కులు పాస్పుస్తకాల బిల్లు-2020లో రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లను ప్రతిపాదించింది.
- తహసీల్దార్లు ఆర్వోఆర్, కౌలురక్షిత చట్టం, ఇనామ్ యాక్ట్, సీలింగ్చట్టాల ద్వారా తహసీల్దార్ ఆర్వోఆర్ ఆధారంగా రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తున్నారు. ఇక ముందు ఈ కోర్టులన్నీ రద్దు కానున్నాయి.
- తహసీల్దార్లు ఇచ్చిన ఆర్ వోఆర్ యాక్ట్ కింద ఇచ్చిన తీర్పులపై సంతృప్తిచెందని వారు ఆర్డీవోలు నిర్వహించే కోర్టుల్లో అప్పీళ్లకు వెళతారు. ఆర్డీవోలు నిర్వహించే కోర్టుల్లో 98 శాతం ఆర్వోఆర్ కేసుల్లోని అప్పీళ్లు కాగా.. సాదా బైనామాల క్రమబద్ధీకరణపై తహసీల్దార్లు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లు, తహసీల్దార్లు జారీ చేసిన అసైన్డ్భూముల నిషేధ చట్టానికి సంబంధించిన అప్పీళ్లు ఉంటాయి. ఇనామ్ రద్దు చట్టం కింద అక్యుపెన్సీరైట్ సర్టిఫికెట్లు జారీ అధికారం కూడా ఆర్డీవోలదే.
- ఇక అదనపు కలెక్టర్(రెవె న్యూ-జాయింట్ కలెక్టర్లు)కు వాస్తవికంగా అధికారాలేం లేకున్నా.. ఆర్వోఆర్, ఓఆర్సీ, ఇనామ్, టెనన్సీ, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ పై ఆర్డీవో కోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లపై విచారణ జరిపే అధికారం మాత్రమే ఉంటుంది. తాజా బిల్లులో రెవెన్యూకోర్టులు చూసే కేసులన్నీ ట్రైబ్యునళ్లు చూసుకునేలా క్లాజును చేర్చారు. తాజా నిర్ణయాలతో పలు జిల్లాల్లో రెవెన్యూ కోర్టులు దాదాపుగా ఆగిపోయాయి. ప్రతి శనివారం కోర్టు కేసులకే యంత్రాంగం సమయాన్ని కేటాయించేది. దాంతో కొత్త చట్టంతో జిల్లాకు ఒక భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. బిల్లు చట్టరూపం దాల్చితే జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ ట్రైబ్యునళ్లు భూకేసుల విచారణను చేపట్టనున్నాయి. ట్రైబ్యునల్లో ఇచ్చేతీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టులో తప్ప మరే కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
లాయర్ను పెట్టుకోవాల్సిందే
ట్రైబ్యునల్లో కేసు దాఖలు చేయాలంటే ప్రతి ఆర్జీదారుడు విధిగా లాయర్ను పెట్టుకొని కేసును వాదించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మండల స్థాయిలో తహసీల్దార్ వద్దకు కేసులకు వెళ్లేవారు. ఇక జిల్లా కేంద్రంలో ట్రైబ్యునల్కు వెళ్లాల్సిందే. ప్రజలకు చేరువగా ఉన్న వ్యవస్థలను రద్దు చేసి, ట్రైబ్యునళ్లు పెట్టడం వ్యయభారంతో కూడుకున్నదేనని అధికారులు చెబుతున్నారు.
వీఆర్ఏలే కీలకం
గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థ(వీఆర్ఏ)లను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం యోచించినప్పటికీ వీళ్లంతా గౌరవ వేతనాలపై ఆధారపడిన వారు. 22 వేల మంది దాకా ఉన్న వీఆర్ఏలు, రద్దు కానున్న వీఆర్ఓలకు ప్రత్యామ్నాయంగా ఉండనున్నారు. ఇప్పటికే వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. వీఆర్వోల రద్దు బిల్లు చట్టరూపం దాల్చగానే వీఆర్ఏలకు బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. అయితే వీఆర్ఏల వేతనాన్ని కూడా కొంచెం పెంచే అవకాశాలు లేకపోలేదు. మండల పరిధిలో ఏ భూములకు సంబంధించిన వివాదాలను తహసీల్దార్ ఇక ముట్టుకోవడానికి వీల్లేదు. కొత్త బిల్లుతో కేవలం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్తో పాటు కార్యనిర్వహక మెజిస్ట్రేట్ అధికారాలు, ప్రభుత్వ భూముల రక్షణతో పాటు సర్టిఫికెట్ల జారీ, పథకాల లబ్దిదారుల పేర్ల సిఫారసు అధికారాలు మాత్రమే ఉంటాయి.
Courtesy Andhrajyothi