రాజ్యాంగమే సర్వోన్నతం అని చాటిన చారిత్రక కేసులో కీలక వ్యక్తి
కాసర్గోడ్, దిల్లీ: రాజ్యాంగ పరిరక్షణ కేసులో కీలక వ్యక్తి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాసర్గోడ్(కేరళ)లోని ఎడ్నీర్ మఠం స్వామీజీ కేశవానంద భారతి(79) ఆదివారం కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఇక్కడ కన్నుమూశారు. రాజ్యాంగం సర్వోన్నతను ధ్రువపరిచిన కేసు ద్వారా కేశవానంద భారతి ఈ దేశానికి సుపరిచితులు. ఆయన 19వ ఏట సన్యాసం స్వీకరించి 1961లో ఎడ్నీర్ మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, సామాజిక సేవలోనూ పాల్గొన్నారు. కన్నడ, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాసంస్థలు, వేద పాఠశాలనూ నెలకొల్పారు. కర్ణాటకలో ప్రాచీన కళ అయిన యజ్ఞగానాన్ని పునరుద్ధరించారు. కర్ణాటక, హిందూస్థానీ సంగీతాల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన రచయిత కూడా.
రాజ్యాంగం సర్వోన్నతను ధ్రువపరిచిన కేసు
ప్రాథమిక హక్కుల రక్షణ విషయంలో కేశవానంద భారతి దాఖలుచేసిన కేసు దేశ న్యాయచరిత్రలో మైలు రాయివంటింది. దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతం, ప్రభుత్వ అధికారాలు పరిమితమన్న భారత ప్రజాస్వామ్య అంతఃసూత్రాన్ని అది బలపరిచింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని(బేసిక్ స్ట్రక్చర్) మార్చే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టంచేసింది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే.. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్న ఎడ్నీర్ మఠం భూముల్లో కొన్నింటిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసంస్కరణల చట్టాల ప్రకారం ఆంక్షలు విధించింది. దాంతో కేరళ భూసంస్కరణల సవరణ చట్టాలు-1969, 1971లను; కోర్టులు సమీక్షించడానికి వీలు లేకుండా వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రభుత్వ జోక్యం లేకుండా ధార్మిక సంస్థల ఆస్తులను నిర్వహించే హక్కు తమ మఠానికి ఉందంటూ ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు. మతస్వేచ్ఛను ప్రసాదిస్తున్న రాజ్యాంగంలోని 26వ అధికరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని అందులో పేర్కొన్నారు. దీంట్లో ప్రాథమిక హక్కులకు సంబంధించిన పలు రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండడంతో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సర్వమిత్ర సిక్రీ నేతృత్వంలో తొలిసారిగా ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయింది. 1972 అక్టోబర్ 31 నుంచి ఏకబిగిన 68 రోజుల పాటు విచారణ కొనసాగించింది. 1973 ఏప్రిల్ 24న 703 పేజీల తీర్పును వెలువరించింది. ఏడుగురు న్యాయమూర్తులు అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పు ద్వారా ఆయనకు పెద్దగా ప్రయోజనం కలగకపోయినా, రాజ్యాంగానికి మాత్రం విశేషమైన మేలు కలిగింది. ఆస్తులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని అంగీకరిస్తూనే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో రాజ్యాంగ సవరణలు చేసే అధికారం మాత్రం లేదని కోర్టు స్పష్టంచేసింది. ఆ తీర్పులో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వ్యక్తంచేసిన అభిప్రాయాలు రాజ్యాంగ రక్షణకు లక్ష్మణ రేఖలుగా నిలిచిపోయాయి. ‘‘పార్లమెంటుకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ మూల స్వరూపాన్ని దెబ్బతీసే అధికారం మాత్రం దానికి లేదు’’ అని విస్పష్టంగా చెప్పారు. తదనంతరం రాజ్యాంగాన్ని సవరించేందుకు పూర్తి అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణను తీసుకురాగా, ఇది మౌలిక స్వరూపానికి విరుద్ధమంటూ కోర్టు కొట్టివేసింది. అనంతరం వచ్చిన ఎన్నో తీర్పులకు ఇదే మార్గదర్శకమయింది. ఈ తీర్పే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కూడా కాపాడింది.
ప్రధాని, ఉపరాష్ట్రపతిల సంతాపం
కేశవానంద భారతి మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. దేశ సంస్కృతి, రాజ్యాంగంతో ఆయనకు గాఢమైన అనుబంధం ఉందని తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలుపుతూ ‘‘రాజ్యాంగమూలస్వరూపాన్ని సవరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కేశవానంద పోషించిన పాత్ర జగద్విదితం’’ అని పేర్కొన్నారు.
Courtesy Eenadu