- జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీ
- పేరు ఇప్పటికే ఖరారు.. చురుగ్గా రిజిస్టర్ యత్నాలు
- మమత, హేమంత్ వంటి నేతలతో మంతనాలు
- బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకోవడానికే
- జమిలి ఎన్నికల తర్వాత అధ్యక్ష పాలనకు కమలం పావులు
- అదే జరిగితే లోక్సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలే
- అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం
- అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘జాతీయ’ అరంగేట్రం
- పార్టీపై న్యాయ కోవిదులు, నిపుణులతో మంతనాలు
- నేటి టీఆర్ఎస్ఎల్పీలోనూ దీనిపై చర్చ.. తీర్మానం?
దేశం గురించి మాట్లాడడానికి కేసీఆర్ వెనకాడడు. తెలంగాణను మంచిగా చేశా. ఇక దేశం సమస్యలు తేలుస్తా. అవసరమైతే నేనే లీడ్ తీసుకుంటా.
భారతీయ జీవిక, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే అత్యంత కీలకం. మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడి విధానం పాటించాలి.
జాతీయ నేతలుగా చెప్పుకునే వారిలో ఒకాయనేమో (రాహుల్ గాంధీ) ప్రధాని చోర్ అంటాడు. ప్రధానమంత్రేమో తల్లీకొడుకులు (సోనియా, రాహుల్) బెయిలుపై ఉన్నారని అంటాడు.
ప్రధానమంత్రి సడక్యోజన ఎవడిక్కావాలి. వీటిని నిర్మించేందుకు గ్రామ పరిపాలన వ్యవస్థలు లేవా?
దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 40 కోట్ల ఎకరాలు సాగవుతున్నాయని అనుకున్నా.. ఇంకా 30 వేల టీఎంసీల నీరు మిగులు ఉంటుంది. ఈ విషయాలు నేను చెప్పినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు.
– గతంలో వివిధ సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని నినదించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ప్రజల ఆకాంక్షలను ఆ రెండు పార్టీలూ నెరవేర్చలేకపోయాయని, కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన ఆయన.. ఇప్పుడు ‘నయా భారత్’ పేరిట జాతీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేసిన కేసీఆర్.. దానిని రిజిస్టర్ చేసే ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకునేందుకు ‘నయా భారత్’ పేరిట జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2022 చివర్లో కానీ, 2023లో కానీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా పావులు కూడా కదుపుతోంది. ఇందుకు ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఓ అంతర్గత కమిటీ వేసింది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ చురుగ్గా పరిశీలిస్తోంది. అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఈ ఎజెండానే ధ్యేయంగా బీజేపీ ఇప్పటికే ‘ఒకే దేశం.. ఒకే విధానం’ పేరిట అడుగులు వేస్తోంది. ఈ నినాదంతోనే జమిలి ఎన్నికలకు వెళ్లడానికి పావులు కదుపుతోంది. ఆ ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి.. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష తరహా పాలనకు తెరతీయాలని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్.. ముందుగానే అప్రమత్తమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ‘ఒకే దేశం.. ఒకే విధానం’ నినాదానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడానికి పావులు కదుపుతున్నారని వివరించాయి. అయితే, సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా? లేక కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొంటారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వంటి నేతలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజానికి, ‘నయా భారత్’ పేరిట ఇప్పటికే హరియాణా, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన పార్టీలు జాతీయ స్థాయిలో పేరును రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. దాంతో, ఆయా పార్టీల నేతలతో కూడా టీఆర్ఎస్ నేతలు చర్చలు సాగించినట్లు సమాచారం. పార్టీ విధి విధానాలు, ఇతర అంశాలపై మాడభూషి శ్రీధరాచార్యులు వంటి తెలంగాణకు చెందిన న్యాయ కోవిదులు, ప్రముఖులతో కూడా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఎజెండా కూడా జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తు అని పార్టీ వర్గాలు వివరించాయి.
లోక్సభ ఎన్నికల ముందు నుంచే..
‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తన జాతీయ ఆకాంక్షలను సీఎం కేసీఆర్ సుస్పష్టంగా వెల్లడించారు. పాకిస్థాన్ను నియంత్రించడంలో, జాతీయ భద్రతను కాపాడడంలో, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో విజయవంతంగా అమలు చేసిన విద్యుత్తు, సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. 2,21,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 1,80,000 మెగావాట్లను మాత్రమే దేశం వినియోగించుకుంటోందని, సగం దేశం చీకట్లో మగ్గుతోందని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ, సాగునీటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ విషయాలను ప్రధాని మోదీకి తాను చెప్పినా పట్టించుకోలేదని కూడా ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని అప్పట్లోనే వెల్లడించారు. చెన్నై వెళ్లి స్టాలిన్, కోల్కతా వెళ్లి మమతా బెనర్జీ వంటి వారితో మంతనాలు కూడా జరిపారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఉప ప్రధాని పదవి కోరాలంటూ యోచనలు సాగాయని అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కేసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి అంటూ ఆయన తనయ కవిత సహా టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేశారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారమూ జరిగింది. అయితే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం రావడంతో కేసీఆర్ అడుగులు ముందుకు పడలేదు.
ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జీఎస్టీ పరిహారం ఇచ్చేది లేదని, కావాలంటే రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై మండిపడుతున్నారు. కరోనాను సమర్థంగా నిలువరించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, జాతీయ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించడం జాతీయ స్థాయిలోనూ తమకు అనుకూలంగా మారుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయవచ్చన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించడం ఒకటైతే.. ముఖ్యమంత్రి హోదాలోనే కేంద్రంలో చక్రం తిప్పడం మరొకటని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లినా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినా పూర్తిస్థాయి గౌరవం లభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇదే జరిగితే, రాష్ట్రంలో కేటీఆర్కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పటించడమే కాకుండా పాలనకు సంబంధించిన పూర్తి పగ్గాలను అప్పగించవచ్చని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎ్సఎల్పీ సమావేశం సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ జాతీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీపై చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశంలో నేతలు ముక్త కంఠంతో సంఘీభావం తెలిపితే తీర్మానం చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని తెలిపాయి.
Courtesy Andhrajyothi