– రాత్రికి రాత్రి ఇండ్ల నుంచి అపహరణ
– మహిళలను వెంటాడుతున్న భయం
– 13 వేల మంది యువకుల అరెస్టు
– కాశ్మీర్ పరిస్థితులపై నిజ నిర్ధారణ బృందం
– ఐదు రోజుల పాటు బృందం పర్యటన
– మహిళల అవస్థలపై ”ఉమెన్స్ వాయిస్” పేరుతో రిపోర్టు
న్యూఢిల్లీ : కాశ్మీర్లో చిన్నారులను చెరసాలల్లో నిర్బంధిస్తున్నారు. రాత్రికి రాత్రి చిన్న పిల్లలను ఇండ్ల నుంచి ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి దురాగతాలెన్నో ఉన్నాయని నిజ నిర్ధారణ బృందం వెల్లడించింది. మహిళలను భయం వెంటాడుతున్నదనీ, వారు మనోవేదనకు గురవుతున్నారని పేర్కొంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) రద్దు, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విభజన, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు వంటి ప్రభుత్వ ఏకపక్ష చర్యల అనంతరం అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అనీ రాజా, కవాలజిత్ కౌర్, పంకురి జహీర్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), పూనమ్ కౌశిక్ (ప్రగతిశీల మహిళ సమితి), సైదా హమీద్ (ముస్లిం ఉమెన్స్ ఫోరం)లతో కూడిన ఐదుగురు సభ్యుల మహిళా సామాజికవేత్తల నిజ నిర్ధారణ బృందం కాశ్మీర్ లోయలో పర్యటించింది. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు జమ్మూకాశ్మీర్లోని నాలుగు జిల్లాలోని 13 ప్రాంతాల్లో 17 గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్లో వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం చేసింది. సాధారణ ప్రజలతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, వైద్యులు, పోలీసులు, రైతులు, గృహిణులు, రోజువారీ కూలీలను కలుసుకొన్న ఈ బృందం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై విస్తృతంగా చర్చించింది. అనంతరం మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడించారు. జమ్మూకాశ్మీర్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నదనీ, కనీస మానవ హక్కులకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ మహిళలు పడుతున్న అవస్థలను వివరిస్తూ, ‘ఉమెన్స్ వాయిస్’ పేరుతో ఒక రిపోర్టును విడుదల చేశారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా మాట్లాడుతూ, కేంద్రం నిరంకుశ చర్యలతో తాము తీవ్ర భయాందోళనలకు, మనోవేదనకు గురౌతున్నామని ప్రతిఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. కాశ్మీర్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయనీ, చిన్న పిల్లలను సైతం అరెస్టు చేస్తున్నారనీ, వారిని కాశ్మీర్ జైలులో కాకుండా ఇతర రాష్ట్రాల జైళ్లలో బందిస్తున్నారని అక్కడి మహిళలు వాపోయారని వెల్లడించారు. తమ పిల్లలు అరెస్టు అయిన విషయం తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయనీ, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి రారేమోనని ఆందోళన కాశ్మీరీ మహిళల్లో నెలకొన్నదని చెప్పారు. కాశ్మీరీ మహిళలకు భూమి హక్కు కల్పించటానికే ఆర్టికల్ 370 రద్దు అన్న వాదనను, వారు తిరస్కరిస్తున్నారని అనీరాజా తెలిపారు. ఐదు రోజుల కాశ్మీర్ పర్యటనలో తాము గమనించిన విషయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
13 వేల మంది యువకులు అరెస్టు
కాశ్మీర్లో 13 వేల మంది యువకులను అరెస్టు చేశారని ప్రగతిశీల మహిళ సమితి నాయకురాలు పూనమ్ కౌశిక్ పేర్కొన్నారు. అక్కడి నుంచి సైనిక, పారా మిలటరీ బలగాలను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అరెస్టు చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. భద్రతా దళాలు జరిపిన దాడిలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందజేయాలనీ, అకారణంగా స్థానిక ప్రజలపై దాడి చేసిన ఆర్మీ అధికారులపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలనీ, మొబైల్, ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
భయంతో వణుకుతున్న మహిళలు
జమ్మూకాశ్మీర్లో మహిళలు చిత్ర హింసకు గురవుతు న్నారనీ, భయంతో వణికిపోతున్నారని ముస్లిం ఉమెన్స్ ఫోరం నాయకురాలు సైదా హమీద్ పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైట్లు ఆర్పివేయాలని ఆదేశిస్తున్నారనీ, బండిపోరా ప్రాంతంలో ఒక బాలిక దీపం వెలిగించుకొని చదువుకుంటుంటే, భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారనీ, అంతటితో ఆగకుండా ఆబాలిక తండ్రినీ, సోదరుడిని నిర్బం ధించి తీసుకుపోయారని వెల్లడించారు. చిన్నారులు, యువ తుల పట్ల భద్రతాదళాలు అనుచితంగా ప్రవర్తిస్తున్నాయనీ, కాశ్మీరీ యువత మొత్తం ఈచర్యలను తీవ్రంగా నిరసిస్తు న్నదని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా అక్కడి ప్రజలను, రాజకీయ పార్టీల నేతలను సంప్రదించాలని డిమాండ్ చేశారు. అక్కడి రైతులను కేంద్రం ఆదుకోవాలనీ, ఆర్మీ చేసిన అకృత్యాలపై కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Courtesy Navatelangana…