కాన్షిరాం బిఎస్పిని మిలిటరీ పద్ధతిలో నడపగా, మాయావతితో సమస్య ఏమిటంటే ఆమె సదరు పార్టీని బ్యూరోక్రసి (ఉద్యోగస్వామ్యం) పద్దతిలో నడుపుతూ, తన నాయకత్వ పద్దతి వల్ల పార్టీ సభ్యులను, తద్వారా తన మద్దతుదారులను చేజేతులా దూరం చేసుకున్నారు.
కాన్షిరాం ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ, మిలిటరీ వ్యవస్థలా నడిచింది. ఆయన డిఫెన్స్ శాఖ ఉద్యోగి అయినందువల్ల పార్టీ స్థాపనలో, నడపడంలో మిలిటరీ పని పద్దతి కన్పిస్తుంది. ఆయన స్థాపించిన బ్యాంసెఫ్, డి ఎస్ 4, బి ఎస్ పి లకు ఆయనే అధ్యక్షుడుగా ఉండి సమర్ధుడైన సేనానిలా నడిపారు. అంబేద్కర్ను లెఫ్టినెంట్ అని వివరించే వారు. తన అనుచరులను సంభోదించే పధ్ధతి నుంచి, తన వ్యతిరేకులను, విమర్శకులను ఎంతో ధైర్యంతో ఎదుర్కొనే పద్ధతివరకు అన్నింటిలోనూ ఆయన మిలిటరీ శైలి ఉట్టిపడేది. తన బహుజన ఉద్యమం ఆధ్వర్యంలో కొన్ని జిల్లాలను దోపిడీ నుంచి విముక్తి చేయడానికి దత్తత చేసుకోవడం, శత్రువులు స్వాధీనం చేసుకున్నప్రాంతాలను ఆర్మీ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవడాన్నిగుర్తుకు తెస్తుంది. కార్యకర్తల శిబిరాలు, సమాచార సేవలు, ఇంటెలిజెన్స్ యూనిట్లు, ఉన్నత విద్యావంతులయిన యువకులతో నిండిన వ్యూహకర్తల బృందాలు, బి ఎస్ పి అంతర్గత రెవిన్యూ వసూళ్లు లాంటి వివిధ వ్యవస్థలన్నింటిని ఆయన ఆర్మీ నుంచి స్వీకరించినట్టుగానే కన్పిస్తుంది.
ఆయన సంస్థ బయటనుంచి చూడటానికి అధికారాన్ని కేంద్రీకృతం చేసుసుకున్న వ్యవస్థలా కన్పించేది. కానీ ఆయన ఢిల్లీ కార్యాలయంలో తమ తమ శక్తిసామర్ధ్యాలను బట్టి, ఉప నాయకుల మధ్య పనివిభజన జరిగేది. కొన్ని ముఖ్యమైన భాద్యతలు నిర్వహించిన వారి వివరాలు: తాను నిర్మించిన సంఘాల్లో కోశాధికారిగాపనిచేసిన అంబెత్ రాజన్ బి ఎస్ పి ఆర్ధిక వ్యవహారాలు చూసేవారు. బలిరాం – శిక్షణ, వ్యూహాలను, సురేష్ మానే- లీగల్ వ్యవహారాలను, ప్రమోద్ కురిల్- సమాచార వ్యవస్థను పర్యవేక్షించేవారు.
క్షేత్ర స్థాయిలో- మాయావతి, సోనెలాల్ పటేల్,ఆర్కే చౌదరి, బార్ఖు రామ్ వర్మ, గాంధీ ఆజాద్, ఫ్యూల్సింగ్ బరియా, సుఖదేవ్ రాజభర్ మొదలైనవారు నియమించబడ్డారు. బి ఎస్ పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నియమిస్తానని అనేకమందికి నాయకులకు ఆయన వాగ్దానం చేసారు. ఆయన మిలిటరీ వ్యవహార శైలిని 1989 లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా వి పి సింగ్ పైన పోటీ చేసినప్పుడు శేఖర్ గుప్త గమనించి, తన “ది ప్రింట్’ పత్రికలో రాసారు.
ఆయన పని పద్దతి ప్రజాస్వామ్య విరుద్ధమని కొందరు విమర్శించేవారు. కానీ తన సామాజిక దృక్పధంతో కాన్షిరాం ఈ విమర్శను అధిగమించగలిగారు. ఉదాహరణకు తన సహచరులు, బ్యాండ్ మేళం బృందంతో సహా అందరు భోజనం చేసిన తర్వాతే ఆయన భోజనానికి వెళ్లేవారు. కాన్షిరాం-ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, తన పేరుమీద ఆస్తి ఉంచుకోనని దీక్ష పూనారు. ఈ విధమైన చర్యలు ఆయన వ్యక్తిత్వానికి, సమ్మోహన శక్తిని జోడించి, ఆయన్ను ఆధునిక, సాంప్రదాయ పద్ధతులు మేళవించిన ఒక యోగిలా భారత దేశ రాజకీయాలకు అనువైన నాయకుడిగా నిలిపాయని మోరిస్జాన్స్ అనే రాజకీయ శాస్త్రవేత్త అభిప్రాయం.
కాన్షిరాం – అంబేద్కర్ అనుచరుడు ఐనప్పటికిని, ఉద్దేశపూర్వకంగానే- అంబేద్కర్ వస్త్రధారణ, మాట్లాడే పద్ధతికి భిన్నంగా, తనదైన పద్దతిలో వ్యవహరించినందువల్ల, స్వతంత్ర నాయకుడిగా ఎదిగారు.
మాయావతి ఆధ్వర్యంలో బిఎస్పి : మాయావతి కాన్షిరాం శిష్యురాలు, తన గురువు మరణం తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టినా గురువును అధిగమించలేకపోయింది. కారణం తన గురువు మిలిటరీ పని పద్ధతికి పూర్తి వ్యతిరేకమైన హైరార్కీకల్ (క్రమానుగత) బ్యూరోక్రాటిక్ (ఉద్యోగస్వామ్య) పనిపద్ధతిని అవలంబించడమే. రాజకీయాల్లోకి రాకముందు మాయావతి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తయారౌతుండేవారు. ఏ విధమైన పూర్వపరిపాలన అనుభవం లేకుండా ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయినందువల్ల, అత్యున్నతస్థాయి బ్యూరోక్రాట్ల పయిన ఆధారపడి వారిశైలిలో పార్టీ నడపడం నేర్చుకున్నారు.
బ్యూరోక్రాట్స్ ఆధ్వర్యంలో అధికారం కేంద్రీకృతం అవుతుంది, గుత్తాధిపత్యంగా మారి, రెండవ స్థాయి అధికారుల సంఖ్య పెరుగుతుంది, వారి బదిలీలు ఇష్టానుసారంగా జరుగుతాయి. ఆర్ధిక వనరులపయిన నియంత్రణ బ్యూరోక్రాట్స్ చేతుల్లోకి వెళ్తుంది. మాయావతి -నియోజకవర్గ, డివిజన్, రాష్ట్ర స్థాయిలో పెద్ద సంఖ్యలో అనుసంధానకర్తలను (కోఆర్డినేటర్లను) సృష్టించారు. వారు సంతృప్తికరమయిన ఫలితాలు సాధించటంలేదని భావిస్తే, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులను బదిలీ చేసిన తరహాలోనే బదిలీ చేసారు.
పార్టీలో నియామకాలు జరిపే సందర్బంగా, సీనియారిటీని లేదా పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, సెక్రటరి లాంటి కీలక పదవులకు అభ్యర్థుల నియామకాలు యాదృచ్చికంగా జరిపారు. 2004నుంచి మాయావతి- లోక్సభ, విధానసభ ఎన్నికల్లో పోటీచేయలేదు,తన పార్టీలోని సీనియర్లు పోటీ చెయ్యడానికి అనుమతించలేదు.
2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అప్పటివరకు పార్టీ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న రాజారామ్ ను ఏ కారణం లేకుండా తొలిగించి, ఆ పదవిలో తన సోదరుడిని నియమించి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించి, మద్దతుదారులకు తన వారసుడిగా పరిచయంచేస్తున్నట్టుగా కనిపించారు.
వ్యతిరేక ప్రతిస్పన్దన చూసిన మాయావతి తన సోదరుడిని తొలిగించి, ఇంకో ముక్కు మొఖం తెలియని జయప్రకాశ్ సింగును పార్టీ ఉపాధ్యక్షుడుగా నియమించారు. ఎప్పడైతే ఈ సింగ్ అనేకవివాదాల్లో చిక్కుకున్నాడో, అతన్ని తొలిగించి ఇంకో అనామకుడైన రాంజీగౌతంను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. కాన్షిరాంలా కాకుండా, మాయావతికి ఎవరిని పడితే వాళ్ళను చప్రాసీలతో సహా, తనకిష్టమొచ్చిన వారిని పార్టీ జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పదవుల్లో నియమించిన పూర్వ చరిత్ర ఉన్నది.
తన సోదరుడైన ఆనందకుమార్నుపార్టీ ఉపాధ్యక్షుడిగా తొలిగించినా, అతన్ని దొడ్డిదారిన పార్టీ వ్యవహారాల్లోకి ప్రవేశపెట్టి తాను అధ్యక్షురాలిగా 2007లో స్థాపించిన బహుజన ప్రేమట్రస్ట్ కి, ఆనంద్కుమార్ను ఒకట్రస్టీగా నియమించారు. అప్పటి నుంచి, వివిధ ప్రధాన మహా నగరాలయిన ఢిల్లీ, లక్నౌ, నోయిడాల్లో పార్టీకి ఉన్న రియలెస్టేట్ ఆస్తులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేయబడ్డాయి. మాయవతి, ఆనంద్కుమార్ తప్ప మిగిలిన ట్రస్టీల పేర్లు తెలియవు.
వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించిన స్తలాలన్నీ మాయావతి పేరుమీదే ఉన్నాయి. తదనంతర కాలంలో వివిధ నగరాల్లో ఉన్న ప్రధాన ఆస్తులన్నీ బహుజన ప్రేమట్రస్ట్ పేరున మార్చడం వల్ల, పార్టీలో తమకు ఏవిధమైన అధికారంలేదని భావించిన వెనుకబడిన తరగతుల నాయకులు పార్టీకి క్రమేణా దూరమయ్యారు. ఈ కారణాల వల్ల అనేక వెనుకబడిన తరగతుల మధ్య బి ఎస్ పి మద్దతుదారుల సంఖ్య క్రమేపి తగ్గిపోయింది. ఫలితంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బి ఎస్ పి వరసగా ఓడిపోతోంది.
రచయిత అరవింద్ కుమార్ లండన్ హలొవె విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం పరిశోధక విద్యార్థి.
ది ప్రింట్ -ఆన్లైన్ పత్రిక సౌజన్యంతో…
తెలుగు అనువాదం: మల్లి సుబ్బారావు : 9346654375
(Please mention the source of article www.kaikaluru.info in your shares)