- బాలీవుడ్ నటిపై శివసేన ప్రతీకారం!
- ముంబైలోని ఆమె కార్యాలయం అక్రమ నిర్మాణమని ఆరోపణ
- నిర్మాణ పనులు జరగకున్నా మంగళవారం ‘స్టాప్ వర్క్’ నోటీసు
- బుధవారం జేసీబీలతో ధ్వంసం
- హైకోర్టుకు నటి.. కూల్చివేతపై స్టే
- ఉద్ధవ్ సర్కారుపై బీజేపీ ఆగ్రహం
- పవార్దీ అదే మాట.. ఠాక్రేతో భేటీ
ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్రలో పాలక శివసేన మధ్య పోరాటం బుధవారం కొత్త మలుపు తిరిగింది. కంగన ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేసింది. ఈ కార్పొరేషన్ శివసేన పాలనలోనే ఉంది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే) అన్నందుకు కంగనపై శివసేన గుర్రు గా ఉంది. ముంబైలోని ఆమె ఇంటికి అనుబంధంగా ఉన్న ఆఫీసు అక్రమ నిర్మాణమని కార్పొరేషన్ అధికారులు మంగళవారం నోటీసు అంటించారు. ఆమె సమాధానం ఇవ్వకముందే బుధవారం కూల్చివేతకు నోటీసిచ్చారు. వెంటనే జేసీబీలతో అక్కడకు చేరుకుని కూల్చివేయడం మొదలుపెట్టారు. కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించా రు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే విధించింది. ఇంటి యజమాని లేనప్పుడు ఇంటోక్లి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అనంతరం న్యాయవాది విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ అబద్ధమాడుతోందని, కంగన ఇంట్లో నిర్మాణమేదీ జరగకున్నా ‘స్టాప్ వర్క్’ నోటీసు జారీ చేశారని ఆక్షేపించారు. కాగా.. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి కంగన బుధవారమే ముంబై చేరుకున్నారు.
మాటల యుద్ధం..
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ఆ నగరం పీవోకేలా మారిందన్న కంగన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ముంబైలో భద్రత లేదనుకుంటే తిరిగి రావద్దని ఆమెను బెదిరించారు. దీంతో కేంద్రం ఆమెకు సీఆర్పీఎఫ్ బలగాలతో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది. దీనిపై శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మండిపడింది. ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆమెపై విరుచుకుపడ్డారు. ‘బతుకుదెరువుకు ముంబై వచ్చిన అమ్మాయి ఇక్కడి పోలీసులను అవమానించడం విచారకరం. మహారాష్ట్రను అవమానిస్తే ప్రజలు సహించరు’ అన్నారు. కంగన మాదక ద్రవ్యాలు వాడుతోందని, ఆమెపై దర్యాప్తు జరపాలని శివసేన ఎమ్మెల్యేలు కొందరు డిమాండ్ చేశారు. దీంతో బుధవారం తాను వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కంగన ట్విటర్లో సవాల్ విసిరారు. కంగన ఇంటిని కూల్చడం నిరంకుశత్వమని బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ విరుచుకుపడ్డారు. కంగన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. బీఎంసీ అధికారులతో సమావేశమైన ఉద్ధవ్ ఠాక్రే.. పవార్ను కూడా కలిశారు.
రేపు మీ అహంకారం కూలుతుంది
ఉద్ధవ్పై కంగన ఫైర్
‘ఉద్ధవ్ ఠాక్రే.. మీరేం అనుకుంటున్నారు? సినీ మాఫియాతో జట్టుకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా నాపై మీ ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? ఇవాళ నా ఇంటిని కూల్చినట్లే .. మీ అహంకారం కూడా కూలిపోతుంది. ఇది జీవితచక్రమని మరచిపోవద్దు. 1990ల్లో కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు ఎంత బాధపడి ఉంటారో ఇవాళ నాకు అర్థమైంది. నేను అయోధ్యతోపాటు కశ్మీరుపైనా సినిమా తీస్తాను’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగన ట్వీట్ చేశారు. ఉదయం నుంచి తన ఇల్లు కూల్చివేతపై ట్విటర్లో రకరకాల పోస్టింగులు పెట్టిన ఆమె ముంబై రాగానే ట్విటర్లో తన వ్యాఖ్యల వీడియో పోస్టు చేశారు. అలాగే ముంబై రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ.. ‘ఇదీ ముంబై రహదారుల తీరు. కానీ ఓ నటి ఇల్లు ఎలా కూల్చుదామా అనేదానిపైనే మీ దృష్టంతా. మీకు ప్రశంసలు. నా ముంబై ఇప్పుడు పీవోకే అయింది. ప్రజాస్వామ్యం మరణించింది’ అని మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు.
Courtesy Andhrajyothi