తనపరిధిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ తలలో నాలుకలా ప్రతి ఇంటి పెద్దలా వ్యవహరించేది ఒక్క అంగన్వాడీ కార్యకర్త మాత్రమేనని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈ ఉదయం కైకలూరు ICDS ప్రాజెక్టు CDPO ఆధ్వర్యంలో జరిగిన వర్క్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా DNR మాట్లాడుతూ స్త్రీ వివాహం మొదలుకొని బిడ్డలు పుట్టి వారిని ప్రీ స్కూల్ లో ఆటపాటలు నేర్పి ప్రాథమిక పాఠశాల కు పంపేవారకు అంగన్వాడీ వ్యవస్థ కీలక భూమిక వహిస్తుందని అన్నారు. తన పరిధిలోని గర్భవతులకు, ప్రసూతి మహిళలకు చిన్నారి బాలబాలికలకు మానవతా విలువలతో కూడిన సేవలు అందించే నేస్తం అంగన్వాడీ కార్యకర్త అన్నారు. ఒక ఆడబిడ్డ తనలాంటి ఎందరో ఆడబిడ్డలకు సాయపడే సంస్కారవంతమైన ఉద్యోగం చేస్తున్న మీరు అదృష్టవంతులని అన్నారు. మంచి మనసున్న మారాజు జగనన్న తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ, బాలామృతం వంటి మంచి పథకాలతో పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. మీ ప్రాంతాల్లో తల్లులకు చదువు యొక్క ఆవశ్యకతను తెలిపి వారి బిడ్డలకు విద్యావంతుల్ని చేసేవిధంగా మంచి సలహాలతో ముందుకు నడపాలని మీ అందర్నీ కోరుతున్నానన్నారు.
సభకు అధ్యక్షత వహించిన CDPO ప్రసన్న విశ్వనాథ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు నూటికి నూరుశాతం అమలు చేసి మంచిపేరు తెచ్చుకుంటామని ప్రాజెక్టు తరపున హామీ ఇస్తున్నాం అని అన్నారు. తహశీల్దార్ సాయి కృష్ణ కుమారి, ఎంపీడీఓ వెంకటరత్నం, ఎంపిపి అభ్యర్థి అడివి కృష్ణ, మైనారిటీ నాయకులు మహమ్మద్ జహీర్, అబ్దుల్ హమీద్, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ బి.వి.ఆర్ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు పుస్తకాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో దండే రవిప్రకాష్, నిమ్మల సాయిబాబు, బోడిచర్ల సురేష్, తోట మహేష్, మూడెడ్ల గౌరీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.