- దిశ కేసుపై వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టు
- ఆసిఫాబాద్లో దళిత మహిళ రేప్, హత్య
- అంతగా స్పందించని ప్రభుత్వం, పార్టీలు
- ఎస్సీ కేసుల్లో పౌర సమాజం తీరూ అంతంతే!
- దళిత, బహుజన సంఘాల ఆవేదన, ఆగ్రహం
- గవర్నర్ను కలిసి వివరిస్తాం: మంద కృష్ణ
- దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం: రాములు
ఆసిఫాబాద్, కేయూ క్యాంపస్, నిర్మల్, డిసెంబరు : ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో బెలూన్లు, ఇతర ఆటవస్తువులను అమ్ముకొనే ఓ సంచారజాతి దళిత వివాహిత దారుణ హత్యాచారానికి గురైంది. ఆమెను ముగ్గురు దుండగలు దారిలో అడ్డగించి, కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మెడ కోసి చంపేశారు. ఇరవై రోజుల క్రితం.. దిశ హత్యాచారం ఘటనకు ముందే ఈ దారుణం జరిగింది. దళిత వివాహిత పట్ల జరిగిన ఈ దమనకాండను ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురించింది. అయితే దళిత వివాహిత హత్యాచారం ఘటన విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం సరిగా స్పందించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసును వేగంగా విచారించి.. నలుగురు నిందితులకు కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. అయితే, దళిత మహిళ హత్యాచారం విషయంలో ఈ చొరవ ఏమైందని దళిత, బహుజన, ప్రజాసంఘాలు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
2015 మార్చి 22న మంచిర్యాల జిల్లాలో నాలుగేళ్ల దళిత బాలిక కూడా దుండగుల చేతిలో దారుణ హత్యాచారానికి గురైంది. దిశ ఘటనకు ఒక రోజు ముందు వరంగల్లో 19ఏళ్ల యువతి హత్యాచారానికి గురైంది. ఆసిఫాబాద్, వరంగల్, శంషాబాద్ ఘటనలు కేవలం వారం వ్యవధిలోనే జరిగాయి! ఈ మూడు ఘటనల్లో ఇద్దరు దళిత, బీసీ వర్గాలకు చెందిన వారు. శంషాబాద్లో దిశ అత్యాచారం ఘటనపై పార్టీలకు అతీతంగా నేతలు ఆందోళన నిర్వహించారు. నిందితులను ఉరి తీయాలంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించి, త్వరితగతిన విచారణ జరిగేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని కోరింది. హైకోర్టు నుంచి అనుమతి కూడా లభించడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. అయితే హత్యాచార ఘటనల్లో అన్ని కేసులనూ సమానంగా చూడాలని దళిత సంఘాల భావన. సామాజిక వివక్ష కారణంగానే అటు ప్రజాప్రతినిధులు, పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఒక ఘటన విషయంలోనే ప్రధానంగా స్పందిస్తుండటంతో అట్టడుగు వర్గాలకు చెందిన బాఽధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఉన్నత వర్గాల మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో పౌరసమాజం, పార్టీలు, ప్రభుత్వ నేతల్లో వ్యక్తమవుతున్న ఆవేదన, ఆగ్రహం దళిత మహిళల విషయంలో ఎందుకు వ్యక్తం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. నగరాల్లో జరుగుతున్న నేరాల విషయంలో ఒకతీరు, పల్లెల్లో జరుగుతున్న నేరాల విషయంలో మరోతీరుగా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందనే విమర్శలూ ఉన్నాయి!
ఢిల్లీలో ఒక న్యాయం.. గల్లీలో మరో న్యాయమా?
దేశంలో, రాష్ట్రంలో దళిత మహిళల హత్యాచారం, హత్య ఘటనలు ఖండించడంలో పౌరసమాజం, పార్టీలు, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. హత్యచారాలు ఢిల్లీలో జరిగితే ఒక తీరు గల్లీలో జరిగితే మరోక తీరుగా న్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనల్లో దళిత వర్గాలపై సమాజం స్పందిస్తున్న తీరు సరిగా లేదని ఆరోపించారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఘటనపై ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారని, ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన దళిత వివాహిత ఘటన..
మూడేళ్ల క్రితం జరిగిన మంచిర్యాల జిల్లాలో జరిగిన దళిత బాలిక ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఈ రెండు ఘటనల్లో విచారణ వేగవంతం చేసి దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై హత్యాచారాలు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడేలా రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతి పత్రాలను అందచేస్తామని తెలిపారు. కాగా దళిత వివాహిత హత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఎస్సీ బేడబుడగ జంగాల హక్కుల దండు నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
పోలీసుల నిర్లక్ష్యం!
ఆసిఫాబాద్ జిల్లాలో గత నెల 24న జరిగిన హత్యాచార సంఘటనలో పోలీసు ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు కె. రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నిర్మ ల్ జిల్లాకేంద్రంలోని అటవీ శాఖ విశ్రాంతి భవనంలో ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల తో ఆయన మాట్లాడారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పిలిపించుకొని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా అని మృతురాలి భర్తను అడిగా రు. వెంటనే వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, దళిత బస్తీలో మూడెకరాల భూమి, ప్రతినెలా 5వేల పింఛన్ తదితర సౌకర్యా లను వీలైనంత త్వరలో కల్పించాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలన్నారు.
Courtesy Andhrajyothi…