ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ప్రియమైన మిత్రులారా!
జస్టిస్ మురళీధరన్ పేరు నేడు అందరి నోళ్ళల్లో నానుతున్నదే. మళ్లీ వివరాలు అక్కరలేదు. రాత్రికి రాత్రే పంజాబ్ హర్యానా హైకోర్టు కు బదిలీ కాబడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి! నిన్న ఢిల్లీ హైకోర్టులో వీడ్కోలు వేడుక జరిగింది. అందిన ప్రాధమిక సమాచారాన్ని బట్టి అది అపూర్వ రీతిలో జరిగింది. మున్నెన్నడూ హాజరుకానంత మంది పాల్గొన్నారు. ఇది ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాటల్లోనూ తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడ్కోలు వేడుక దృశ్యాలని చూస్తే, కాన్ఫెరెన్సు హాల్ కిక్కిరిసి పై అంతస్తుల నుండి వీక్షించారని తెలుస్తోంది. సభలో ప్రసంగాల సారం తెలీదు. సభావిశేషాలు కూడా తెలీదు. తెలియకుండా వాటిలోకి వెళ్లడం లేదు. తెల్సిన చేదునిజం ఏమంటే కనీవినీ ఎరుగని అపూర్వ రీతిలో వీడ్కోలు జరిగిన విషయమే. ఈ మేరకే ఈ చిన్న ప్రతిస్పందన!
మోడీ షా సర్కార్ చేపట్టిన నిరంకుశ బదిలీ చర్యకు మున్నెన్నడూ జరగని అపూర్వ వీడ్కోలు కార్యక్రమమిది. అదో ప్రతీకార ప్రతిస్పందనయే! “చర్యకు ప్రతిచర్య” భౌతిక సూత్రం వర్తిస్తుంది. ‘చర్య’ తెల్సిందే. అది స్వయంగా రాజ్యం చేపట్టిన బదిలీ ‘చర్య’! మున్ముందు ఈ తరహా చర్యలు మరిన్ని వుండొచ్చు. వాటి గూర్చి ఇప్పుడు మాట్లాడటం లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాదలోకం నేడు చేపట్టిన తాజా ‘ప్రతిచర్య’ ప్రస్తుత అంశం. దాని భావిఫలితాల కి వద్దాం. నేను గ్రహించిన మేరకు అవి ఈ కిందివిధంగా వుండొచ్చు.
1 -జస్టిస్ మురళీధరన్ బదిలీ చర్య ఆయనలోని న్యాయపరమైన జీవశక్తిపై దాడి! అపూర్వ వీడ్కోలు ద్వారా చేపట్టిన ‘ప్రతిచర్య’ దానిని జీవింపజేస్తుంది. గాన ఫాసిస్టు శక్తుల లక్ష్యం విఫలమౌతుంది. పైగా ఈ అపూర్వ ప్రేమాదరణ ఆయన నైతిక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఢిల్లీ లో నిన్నటి మురళీధరన్ కంటే, పంజాబ్-హర్యానా హైకోర్టు లో రేపటి మురళీధరన్ మరింత సజీవ న్యాయప్రతీకగా వర్ధిల్లుతారు.
2 -నిన్నటి బదిలీ ‘చర్య’ యొక్క లక్ష్యం మురళీధరన్ కి గుణపాఠం చెప్పడానికే పరిమితం కాదు. ఇంకా న్యాయవ్యవస్థలో మిగిలివున్న మరికొందరు మురళీధరన్ లను బెదిరించి లొంగదీసుకునే లక్ష్యం కూడా ఒకటి. ఐతే తాజా వీడ్కోలు ‘ప్రతిచర్య’ అట్టి లక్ష్యాన్ని కూడా విఫలం చేసి తీరుతుంది. అలాంటి మరికొందరు మురళీధరన్ లకు కొత్త ఆత్మిక, నైతికశక్తిని అందిస్తుంది. నేడు బ్రహ్మరథం పట్టిన అపూర్వ ప్రేమాదరణ రేపు వారిచ్చే తీర్పులకి కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
3 -న్యాయమూర్తులపై బదిలీ చర్య వారికే పరిమితం కాదు. అది రానున్న కాలంలో మతం పేరిట ఫాసిస్టు శక్తులు సాగించబోయే దాడులకు బలయ్యే బాధిత వర్గాల ప్రజలను నిరుత్సాహ పరుస్తుంది. కోర్టుల్లో బాధిత ప్రజలకు న్యాయం చేకూరే మార్గాలని మూసివేసే దీర్ఘ కాలిక లక్ష్యం కూడా వుంది. అట్టి బాధిత ప్రజల పక్షాన బాసటగా నిలిచి మురళీధరన్ వంటి వృత్తి నిబద్ద న్యాయమూర్తుల ద్వారా సానుకూల తీర్పులిప్పించే న్యాయవాద లోకాన్ని నిరాశపరిచే లక్ష్యం కూడా వుంది. దాన్ని కూడా తాజా ‘ప్రతిచర్య’ విఫలం చేస్తుంది. నేడు ఢిల్లీహైకోర్టు న్యాయవాద లోకం చేపట్టిన ఘనవీడ్కోలు వేడుక ని దేశవ్యాప్తంగా న్యాయవాద లోకం ఆదర్శంగా తీసుకుంటుంది.
4 -పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో ఫాసిజాన్ని తెచ్చే లక్ష్యం గల ఫాసిస్టురాజకీయ శక్తులు నేడు ఉనికిలో వున్న న్యాయవ్యవస్థ కు రాజకీయంగా మరణశాసనం రాసే పనికి దిగుతాయి. గత నాజీ జర్మన్ చరిత్ర నేర్పిందే! ఆ సంకేతాలు ఇక్కడ కూడా నేడు కనిపిస్తున్నవే! ఫాసిస్టు శక్తుల ముప్పు నుండి రాజ్యాంగంలోని లౌకిక, ప్రజాతంత్ర హక్కులతో పాటు న్యాయవ్యవస్థలో మిగిలిన న్యాయ పరిరక్షణకై పోరాడే ఆకాంక్ష బాధిత ప్రజల్లో వుంది. ఈ తరహా బదిలీ ‘చర్యల’ వెనక పైన పేర్కొన్న ప్రజల ఆకాంక్షని దెబ్బతీసే లక్ష్యమూ వుంది. దీనిని కూడా నేటి ఘనవీడ్కోలు వంటి ‘ప్రతిచర్యలు’ విఫలం చేస్తాయి. నిరాశకు గురయ్యే బదులు ఫాసిస్టు దాడుల నుండి వాటి పరిరక్షనకి పోరాడే బలాన్ని బాధిత ప్రజల్లో అవి కలిగిస్తాయి.
5 -న్యాయవాదలోకం నుండి ఈ తరహా ప్రతీకార ప్రతిస్పందన చర్యల వల్ల స్థూలంగా దేశప్రజలపై గొప్ప రాజకీయ ప్రభావం కలిగిస్తుంది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి కొత్త బలాన్ని ఇస్తుంది. ఫాసిస్టు శక్తుల్ని ఎంతో కొంత కలవరపరుస్తుంది. అవి తమ పూర్వ అంచనాలని ఏదో మేరకి సవరించుకోవాల్సి వస్తుంది. అంతర్జాతీయ సమాజం మీద కూడా ప్రభావాన్ని కలిగిస్తుంది.
మిత్రులారా ! నేడు మోడీ షా నిరంకుశ ప్రభుత్వం చేపడుతున్న ఫాసిస్టు స్వభావం గల దూకుడు చర్యల నేపథ్యం తెలిసిందే. అట్టి క్లిష్ట పరిస్థితుల్లో నిన్న 6-3-2020న రెండు ఉత్తేజకర పరిణామాలు జరిగాయి. అవి రెండూ కూడా ఢిల్లీలోనే జరిగాయి. అవి రెండూ న్యాయవాదపరంగానే జరిగాయి.
A-సుప్రీంకోర్టు న్యాయవాదలోకం ఢిల్లీ దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర హొమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్ తో గొప్ప ప్రదర్శన నిర్వహించింది.
B-ఢిల్లీ హైకోర్టు న్యాయవాదలోకం మురళీధరన్ కి రాజకీయ కసితో ఘనంగా అపూర్వ రీతిలో వీడ్కోలు నిర్వహించింది. ఇవి రెండూ ఒకే రోజులో, ఒకే ఢిల్లీ నగరంలో, ఒకే న్యాయవ్యవస్థలో, ఒకే ఫాసిస్టు ప్రభుత్వంపై, ఒకే ప్రజాతంత్ర లక్ష్యం తో జరిగిన రెండు వేర్వేరు పరిణామాలు కావడం విశేషం!
న్యాయవాదుల కదలికకు గల పరిమితుల పట్ల స్పష్టత వుంది. వారు పోషించగల వాస్తవ పాత్ర పట్ల అవగాహన వుంది. వాస్తవ భౌతిక స్థితి కంటే మించిన అంచనాలు, ఆశలు అక్కరలేదు. కానీ కొన్ని క్లిష్ట సమయాలలో చిన్న ఉపశమన చర్యలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. పోటెత్తే నదిలో మునిగే వాడికి చిన్న కట్టె దుంగ దొరికినా కొండంత బలాన్నిస్తుంది. వరసగా పాతికకి పైగా నిరంకుశ చట్టాల ఆమోదం, 370, 35A రద్దు, NRC, NPR, CAA వంటి ఫాసిస్టు చట్టాలు, ఢిల్లీ దాడులు, మురళీధరన్ బదిలీ వంటి సమ్మెట పోట్లతో మోడీ షా సర్కార్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ నిర్దిష్ట భౌతికస్థితిలో దేశ రాజధాని ఢిల్లీలో న్యాయవాద లోకం నిరసనగా వెల్లువెత్తింది. ఈ స్థల,కాలాదులకు లోబడి నేటి ప్రతిచర్యల్ని విశ్లేషించాలి. దాని రాజకీయ విశిష్టత, ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు అర్ధమౌతాయి. అవి ఇప్పటికే పోరాడే దేశ ప్రజలకు గొప్ప ఉత్తేజాన్నిస్తాయి. నేటికీ ప్రేక్షకులుగా ఉన్న ప్రజల్ని మేల్కొలుపుతాయి. ముఖ్యంగా మున్ముందు ఫాసిజంపై పోరాడి ఓడించాల్సిన వాస్తవ శ్రామిక వర్గాలను కార్యరంగంలోకి పురికొల్పడానికి ఇవి ఉత్ప్రేరకలుగా ఉపకరిస్తాయి. రేపటి ఫాసిస్టు వ్యతిరేక పోరాట చరిత్రలో ఇలాంటి ప్రతీకార ప్రతిస్పందన చర్యలకి తగు స్తానం వుంటుంది. వీటిని కార్పొరేట్ మీడియా ప్రచారం చేయదు. పైగా వీటిపై బురదజల్లి వక్రీకరించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది మురళీధరన్ స్వంత వేడుక కాదు. వ్యక్తిగత ఆదరణ కాదు. ఇది దేశ ప్రజలందరిది. దీనిని ప్రచారం చేసుకుందాం. దీనిని షేర్ చేసుకొని విస్తృత ప్రాచుర్యం కల్పిద్దాం.
A-రేపటి మురళీధరన్ ని కూడా నిన్నటి మురళీధరన్ గానే సజీవ న్యాయ ప్రతీకగా నిలబెట్టుకొనుటకు ఇది ఓ సాధనంగా ఉపకరిస్తుంది.
B-దేశంలో నేటికీ మిగిలివున్న మురళీధరన్ లను యధాతధంగా నిలబెట్టుకొనుటకు ఉపకరిస్తుంది.
C-మున్ముందు కొత్త మురళీధరన్ లను సృష్టించుకొనుటకు కూడా ఉపకరిస్తుంది.
రేపటి ఫాసిస్టు వ్యతిరేక పోరుకు పై రాజకీయ, ఆత్మిక, నైతిక శక్తిని అందించిన తాజా ‘ప్రతిచర్య’ (ఘన వీడ్కోలు) ను చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాద లోకానికి జేజేలు!
కేంద్ర హొమ్ మంత్రి రాజీనామా డిమాండ్ తో రోడ్డెక్కిన సుప్రీంకోర్టు న్యాయవాదలోకానికీ జేజేలు!
దీన్ని వేనోళ్లుగా ప్రచారం చేద్దాం.