– వెంటాడి కాల్చి చంపిన దుండగులు
– నెల వ్యవధిలో ఇది రెండో ఘటన
– యోగి సర్కారుపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
లక్నో : యోగి సర్కారు పాలనలో యూపీలో జర్నలిస్టులకు రక్షణ కరువైంది. మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అక్రమార్కుల బాగోతాలను బయటపెట్టి ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించే జర్నలిస్టులపై అక్కడ దాడులు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా యూపీలోని మరొక జర్నలిస్టు హత్యకు గురయ్యారు. దుండగులు నిందితుడిని వెంటాడి అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన బల్లియాలోని ఓ గ్రామ పెద్ద ఇంటి వద్ద చోటు చేసుకున్నది. అయితే నెల వ్యవధిలోని రాష్ట్రంలో మరొక జర్నలిస్టుపై ఇలా దాడి జరగడం జర్నలిస్టుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హిందూ వార్త ఛానెల్లో బాధితుడు రతన్సింగ్(42) పని చేస్తుండేవాడు. అయితే ఆయనకు, నిందితుల మధ్య గత కొంత కాలంగా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరగుతుండేవి.
అయితే రతన్సింగ్పై కోపాన్ని పెంచుకున్న నిందితులు.. ఆయనను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించకున్నారు. కాగా, రతన్సింగ్ తన ఇంటికివస్తున్న తరుణంలో కాపు కాసి ఉన్న దుండగులు ఆయనపై దాడికి దిగారు. తీవ్రంగా గాయపరిచారు. అనంతరం గ్రామ పెద్ద ఇంటి వద్ద ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో రతన్సింగ్ ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ తెలిపారు.
Courtesy: NT