- 24 మంది కాలేజీ విద్యార్థినులకు శ్వేతజైన్ ఎర
- మంచి చదువు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ
- ఆడి కార్లు, విలాస జీవితం చూపించి వశం
- తండ్రి వయసు వారితో రాసలీలలకు ప్రేరేపణ
- మోనిక తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు
- వెలుగులోకి తెచ్చిన కమల్నాథ్ సన్నిహితుడు
భోపాల్: మోనికా యాదవ్ (18)ది మధ్యప్రదేశ్లోని నర్సింగ్గఢ్ గ్రామం. భోపాల్లోని ఓ ప్రముఖ కాలేజీలో చేరాలని భావించింది. శ్వేతా జైన్ను కలిస్తే పనవుతుందని ఎవరో చెప్పారు. దీంతో భోపాల్లో శ్వేతా జైన్ను కలిసింది. ప్రభుత్వంలో పెద్ద పెద్దోళ్లంతా తనకు సన్నిహితులని, సీటు గ్యారెంటీ అని శ్వేత చెప్పింది. భోపాల్కు పూర్తిగా కొత్త అయిన ఆమెను సచివాలయానికి తీసుకెళ్లింది. అక్కడ ముగ్గురు సీనియర్ ఐఏఎ్సలకు పరిచయం చేసింది. ఇండోర్ నుంచి రోజూ భోపాల్ రావడానికి ఆమెకు ఓ ఆడి కారు కూడా ఇచ్చింది. ఇందుకు ప్రతిగా తాను చెప్పిన వారికి పడక సుఖం అందించాలని నిర్దేశించింది. ఇందుకు మోనికా యాదవ్ తిరస్కరించింది. నర్సింగ్గఢ్లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది.
దాంతో, ఆర్తి దయాళ్ రంగంలోకి దిగింది. మోనిక ఇంటికి వచ్చింది. తనను తాను సామాజిక సేవికగా పరిచయం చేసుకుంది. మోనికను భోపాల్ పంపిస్తే.. ఆమె చదువుకయ్యే ఖర్చంతా తాము భరిస్తామని మోనిక తండ్రి హీరాలాల్కు చెప్పింది. కుమార్తెకు మంచి చదువు చెప్పించే స్తోమత నిరుపేద హీరాలాల్కు లేదు. కుమార్తె బాగు పడుతుందన్న ఉద్దేశంతో మోనికను ఆర్తి దయాళ్తో పంపించాడు. ‘‘ఓ ఉన్నతాధికారితో శ్వేతా జైన్ సెక్స్లో పాల్గొంటున్న ఎంఎంఎ్సను ఆర్తి చూపించింది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఇటువంటి పనులన్నీ చేయాల్సి ఉంటుందని చెప్పింది’’ అని సిట్ విచారణలో మోనికా యాదవ్ వెల్లడించింది. ఆ తర్వాత ఆమెను ఆమె తండ్రి వయసున్న ఇండోర్ మునిసిపాలిటీలో ఇంజనీర్ హర్బజన్ సింగ్ వద్దకు పంపించింది. కాలేజీ విద్యార్థినులకు శ్వేతా జైన్, ఆర్తి దయాళ్ ఎర వేసే విధానమిది. తమకు కాలేజీ అమ్మాయిలు కావాలని ఉన్నతాధికారులు అడిగేవారని, దాంతో, దాదాపు 24 మందిని తాను ఎర వేసినట్లు శ్వేతా జైన్ స్వయంగా సిట్ విచారణలో అంగీకరించింది.
పేద, దిగువ మధ్య తరగతికి చెందిన అమ్మాయిలే వీరి టార్గెట్. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని, విలాసవంతంగా జీవించాలని వారికి నూరి పోశారు. ఖరీదైన కార్లు, ఫ్లాట్లు, డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. తమ వలపు వలకు వారిని వాడుకున్నారు. వారి తండ్రి వయసుండే రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు పడక సుఖం అందించేలా అమ్మాయిలను ప్రేరేపించారు. ‘‘ఆగస్టు 30న విలాసవంతమైన కారులో ఆర్తి, ఆమె దగ్గర పనిచేసే రూప కలిసి నన్ను ఇండోర్ తీసుకొచ్చారు. అక్కడ ఇన్ఫినిటీ హోటల్లో రూమ్ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజు సాయంత్రం హర్బజన్ సింగ్ను నాకు పరిచయం చేశారు. రాత్రంతా హర్బజన్ సింగ్తో సెక్స్లో పాల్గొన్నా. దాన్నే ఆర్తి వీడియో తీసి, రూ.3 కోట్లు డిమాండ్ చేసింది’’ అని సిట్ విచారణలో మోనిక వెల్లడించింది. అంతేనా, ‘‘ఈ విషయం నీ తల్లిదండ్రులకు చెబితే వెబ్సైట్లో వీడియో అప్లోడ్ చేస్తాన’’ంటూ ఆర్తి బెదిరించింది. ఈ నేపథ్యంలోనే, మోనిక తండ్రి హీరాలాల్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘‘మోనిక వంటి ప్రతిభావంతులైన అమ్మాయిలు వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ ముఠాలో మరింతమంది అమ్మాయిలు ఉండవచ్చు’’ అని ఎస్ఎస్పీ రుచి వర్ధన్ మిశ్రా తెలిపారు. దర్యాప్తులో కీలక ఆధారాలు దొరికాయని, వాటి ఆధారంగా నిందితులను ఎదురెదురుగా ఉంచి ప్రశ్నిస్తామని చెప్పారు. మోనికను వ్యభిచార (హ్యూమన్ ట్రాఫికింగ్) బాధితురాలిగా అభివర్ణించారు. త్వరలోనే ప్రభుత్వ సాక్షిగా ఆమెను కోర్టు ఎదుట హాజరుపరుస్తామన్నారు. కాగా, ఆర్తి దయాళ్, మోనికా యాదవ్కు అక్టోబరు ఒకటి వరకూ; శ్వేతా విజయ్జైన్, శ్వేతా స్వప్నిల్ జైన్, బర్ఖా సోనీలకు సెప్టెంబరు 30 వరకూ పోలీసు కస్టడీకి ఆదేశించారు.
జర్నలిస్టుల వసూళ్లు మధ్యప్రదేశ్ కామ కిలేడీల కేసులో పలువురు జర్నలిస్టుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. భోపాల్కు చెందిన హిందీ దిన పత్రిక రెసిడెంట్ ఎడిటర్, ఓ న్యూస్ చానల్ కెమెరామన్, ఓ ప్రాంతీయ టీవీ చానల్ యజమాని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మధ్యవర్తులుగా వ్యవహరించిన వీరు అటు ఉన్నతాధికారుల నుంచి ఇటు శ్వేతా జైన్ నుంచి డబ్బులు దండుకున్నారని విచారణలో తేలింది.
Courtesy AndhraJyothy..