హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. లక్షా 82 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.4,356 కోట్లే కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ కేటాయించి బీసీలకు భిక్షమేస్తున్నారా అని ప్రశ్నించారు.
బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్లో బీసీ సబ్ప్లాన్ ఊసేలేదని విమర్శించారు. ప్రభుత్వం చేసిన రూ.2.29 లక్షల కోట్ల అప్పులో బీసీలు రూ.1.15 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. బీసీలకు రూ.5,000 కోట్ల కేటాయిస్తామన్న వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు.
బడ్జెట్ లో బీసీలకు అరకొర కేటాయింపులు జరిపినందుకు నిరసనగా ఈ నెల 13న అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్వో కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రకటించారు. బీసీలు పెద్దసంఖ్యలో నిరసన కార్యక్రామల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాజుల శ్రీనివాస్గౌడ్తో పాటు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘాల నాయకులు కనకల శ్యాంనంద, కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.