– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరణ
వాషింగ్టన్: ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైన్యం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ కారణంగానే అతడు మృతి చెందినట్టు తెలిపారు. సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో బాగ్దాదీని తమ సైన్యం వెంబడించి చుక్కలు చూపించిందన్నారు. ప్రాణభయంతోనే బాగ్దాదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. అమెరికా సైన్యం బాగ్దాదీని వెంబడించడంతో అతను ఓ పిరికిపందలా టన్నెల్లోకి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించాడని అన్నారు. సైన్యం టన్నెల్ను చుట్టుముట్టడంతో చేసేదేమీ లేక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. కాగా, సిరియాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన బాగ్దాదీని హతమార్చేందుకు తమ సైన్యం గత ఐదేండ్ల నుంచి వేచిచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పక్కా ప్లాన్తో బాగ్దాదీని హతమార్చినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఇక బాగ్దాదీపై తమ సైనికులు విరుచుకుపడిన తీరును ట్రంప్ సహా అమెరికా భద్రతా సంస్థ సీనియర్ అధికారులు సిట్యూవేషన్ రూంలో నుం చి ప్రత్యక్షంగా వీక్షించినట్టు సమాచారం. బాగ్దాదీ కీల క అనుచరుడు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని ట్రంప్ అన్నారు.
కైలా మ్యూలర్ ఆపరేషన్ సక్సెస్ :
పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్కు అమెరికా అధికారులు కైలా మ్యూలర్ అని నామకరణం చేశారు. సిరియాలో పనిచేస్తున్న సమయంలో అమెరికా సామాజిక కార్యకర్త కైలాను బాగ్దాదీ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్కు కైలా మ్యూలర్ అని పేరుపెట్టిన అధికారులు గురువారం నుంచే బాగ్దాదీని హతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంలోనూ సఫలీకృతమయ్యారు. శుక్రవారం తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ వివాహ వార్షికోత్సవాన్ని జరపడం కోసం ట్రంప్ క్యాంప్ డేవిడ్కు వెళ్లారు. అనంతరం వెంటనే వర్జీనియాకు పయనమై మిలిటరీ ఆపరేషన్స్కు సంబంధించిన ఫైళ్లను ఆయనే స్వయంగా పరిశీలించారు.
Courtesy: NT..