- ప్రత్యామ్నాయ విధానం అవసరం
- జిల్లాల మధ్య అసమానతలు పెరిగాయి
- ‘తెలంగాణ ప్రజా అసెంబ్లీ’లో హరగోపాల్
హైదరాబాద్: తెలంగాణలో దోపిడీ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని సామాజిక ఉద్యమకారుడు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రజా సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజా సంఘాలు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 13 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించతలపెట్టిన ప్రజా అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమంలో శుక్రవారం హరగోపాల్ మాట్లాడారు. ఉద్యమాల ద్వారా సాధించిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎవరినీ కలవని పరిస్థితి ఉండటం దారుణమన్నారు.
కలిస్తే ప్రశ్నిస్తారనే భయంలో ఆయన ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని రాజకీయాలు ప్రజలను కలవడానికి సిద్ధంగా ఉండవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజల మధ్యేకాదు.. జిల్లాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని చెప్పారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడం సిగ్గుచేటని సామాజిక ఉద్యమకారిణి, ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదని, వ్యక్తిస్వామ్యం నడుస్తోందని విమర్శించారు.