న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారినపడ్డామో ? లేదో ? వెంటనే తెలియటం లేదు. రోగ నిరోధక శక్తి పడిపోతే ఎలా? కాబట్టి ఎక్కడ..ఎవరు..ఏది చెప్పినా దానిని అనేకమంది ఫాలో అవుతున్నారు. మధుమేహం, కిడ్నీ సమస్యలు, అధికరక్తపోటుతో బాధపడేవారి భయాలు ఇక్క చెప్పక్కర్లేదు. ఇలాంటివారిలో పసుపు, మెంతి, విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం అనూహ్యంగా పెరిగింది. అశ్వగంధ, కాధా, చ్యవన్పాశ్…మొదలైనవి తీసుకుంటున్నారు. వీటివల్ల అనేకమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయని, రోజులో కనీసం ఇలాంటి కేసులు నాలుగైదు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడే రోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటాన్ని వైద్యులు గుర్తించారు. వైద్యుల్ని సంప్రదించకుండానే సి-విటమిన్, డి-విటమిన్ మందు బిళ్లలను వేసుకుంటున్నారని, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ…రకరకాల పద్దతుల్లో అవసరం లేకున్నా మందులు వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఫార్మా కంపెనీల ఎత్తుగడ!
ముంబయిలో ప్రఖ్యాత వైద్యుడు ఒకరు ఏమన్నారంటే, ”ఫార్మా కంపెనీలు తమ అమ్మకాల కోసం ప్రజల్లో పెద్ద ఎత్తున అపోహలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో పెద్ద సంఖ్యలో వీడియోల్ని విడుదల చేస్తున్నాయి. దాని ఫలితమే నేడు సమాజంలో కనపడుతున్నది. విటమిన్ల వాడకం అనూహ్యంగా పెరిగింది. విటమిన్ డి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నది అపోహ మాత్రమే. క్యాల్షియం లోపంతో బాధపడే వారు మాత్రమే వైద్యుల సలహా మేరకు డి-విటమిన్లు తీసుకోవాలి. వారానికి ఒకటి వేసుకోవాల్సిన డి-విటమిన్ రోజుకొకటి వేసుకుంటున్నారు. దీనివల్ల 50ఏండ్లు దాటినవారిలో రక్తపోటు అమాంతం పెరుగుతుంది. మూత్రంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది” అని అన్నారు.
హోమియోపతి మందులు, తేనె, అల్లం, పసుపు, మెంతి, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉన్న ఆయుర్వేద మందులు వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్న తాపత్రయంతో అనేక మంది…అలోవీరా జ్యూస్, జింక్, విటమిన్ డి మందు బిళ్లలను ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారు. సమతుల ఆహారం తీసుకోవటం ద్వారానే మంచి ఆరోగ్యం కలుగుతుంది తప్ప, ప్రత్కేకంగా మందు బిళ్లలు మింగటం వల్ల ఉపయోగం ఉండదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెంతులు అధిక మొత్తంలో వాడితె రక్తం చిక్కబడుతుందని, కాలేయ సమస్యలున్నవారికి ఇది మరింత హాని చేస్తుందని కేరళకు చెందిన ఒక వైద్య నిపుణుడు చెబుతున్నారు. అలాగే ఆలోవీరా జ్యూస్ను తాగడం లివర్ను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సర్వే ఏం చెప్పిందంటే..
వంద మందు బిళ్లలు అమ్ముడుపోతే..అందులో 92 బిళ్లలు ‘ఇమ్యునిటీ బూస్టర్లు’ ఉంటున్నాయని ‘ప్రోంటో కన్స్ల్ట్’ సర్వే తేల్చింది. రోగ నిరోధక శక్తి పెంచుతాయని…పసుపు, అల్లం, తేనె, మెంతులు… మొదలైనవి ఇష్టమొచ్చినట్టు తీసుకుం టున్నారు. గ్రీన్ టీ, తులసీ, నిమ్మ, కాకర, కుంకుమ పువ్వు…వాడకం పెరిగింది. ప్రజల్లో ఈ ట్రెండ్ సరైంది కాదని, సమతుల ఆహారంతోనే రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.