కె. నాగలక్ష్మి
అమీన్పూర్లోని మారుతి అనాధాశ్రమం లో 14ఏండ్ల బాలికపై గత సంవత్సరకాలంగా జరిగిన అత్యాచార ఉదంతం, ఆ బాలిక అనారోగ్యంపాలై మరణించిన తీరుచూస్తే మనసున్న ప్రతి మనిషికీ హృదయం ద్రవించకమానదు. దేశంలో, రాష్ట్రంలో వేలాదిగా ఉన్న షెల్టర్ హౌంలూ, అనాధా శ్రమాలలో ఆడపిల్లల పరిస్థితులపై వెలుగులోకి రాని అనేక దారుణాలపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది.
తెలంగాణలో రిజిస్టరు అయిన అనాధాశ్రమాలు 455 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేనివి ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి. జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం ప్రతి శరణాలయం రిజిస్టరు అయ్యి ఉండాలి. ఆరేండ్లలోపు పిల్లలు శిశువిహార్లోనే ఉండాలి. కానీ కొన్ని అనాధాశ్రమాలు సేవ పేరుతో ఫండ్స్ కోసం చిన్న పిల్లలను కూడా పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడటం, వారితో భిక్షాటన చేయించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అనాధాశ్రమాలకు, అవి నడిపే ప్రతి స్వచ్ఛంద సంస్థకూ ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ శరణాలయాలకు కనీస వసతులున్నాయా? లేదా? ఎంతమంది పిల్లలున్నారు? వారికి సరైన భద్రత ఉందా లేదా మొదలైన విషయాలు పరిశీలించి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు వీటికి అనుమతులు ఇస్తాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలూ, స్త్రీ, శిశు సంక్షేమశాఖలూ ఈ శరణాలయాలు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా లేదా అని పర్యవేక్షించాలి. ట్రాఫికింగ్, అత్యాచారాలు, పిల్లల పేరిట జరిగే వ్యాపారాలకు ఇవి అడ్డుకట్టవేయాలి.
గతంలో ముజఫర్పూర్ షెల్టర్ హౌంలోని బాలికలపై అత్యాచారాలు, అకృత్యాలూ వెలుగులోకి వచ్చాయి. ఆ ఘటనలో 40మంది బాలికలపై బ్రిజేష్ఠాకూర్ అతని ముఠాతో కలసి బాలికలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకూ, అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటన అందరినీ నివ్వెరపరిచింది. అదేకోవలో జరిగిన ఈ అమీన్పూర్ ఉదంతం పరిశీలిస్తే ఒక కామాంధుని చేతిలో బాలిక అనుభవించిన నరకం అంతాఇంతా కాదు. 11 సంవత్సరాల ప్రాయంలో ఉత్సాహం గా తన అందమైన బాల్యాన్ని గడపాల్సిన ప్రాయంలో ఆ బాలికకు 2015లో తల్లి చనిపోయింది. 2017లో తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోవడంతో బాలిక అనాధ అయ్యింది. హైదరాబాద్లోని బోయినపల్లిలో నివసించే ఆ బాలికకు దూరపు బందువులు చాలామంది ఉన్నా రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితులు వారివి. దీంతో వరసకు మేనమామ అయిన శామ్యూల్ ఆమెను అమీన్పూర్లోని మారుతి అనాధాశ్రమంలో చేర్పించాడు. రెండు మూడు సంవత్సరాలు ఆ బాలిక అక్కడే గడిపింది. ఆ ఆశ్రమనికి దానం చేసే పేరుతో అక్కడికి తరచుగా వస్తున్న 51ఏండ్ల వేణుగోపాల్ అనే మానవమృగం కన్ను ఆ బాలికపై పడింది. ఆ బాలికను తన లైంగిక వాంఛలకు బాలి పశువుగా చేసుకోవడం మొదలైంది. ఆ అనాధాశ్రమంలోని మహిళా వార్డెన్ విజయ, ఆమె సోదరుడు జయదేవ్లకు కొంత డబ్బు ముట్టజెప్పి వారి సహకారంతో ఆదుర్మార్గుడు వేణుగోపాల్ ఆ బాలికను చెరబట్టాడు.
అమీన్పూర్లోని అనాధాశ్రమం 5వ అంతస్తులోకి రాత్రిపూట వార్డెన్ బాలికను పంపేది. అక్కడికి వచ్చిన దుర్మార్గుడు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్లూ, సేమియా పాయసం లాంటివి బాలికతో తాగించి ఆమెపై అతి కిరాతకంగా అత్యాచారం చేసేవాడు. ప్రొద్దున మెలుకవ వచ్చిన బాలికకు అతను కూల్డ్రింక్స్ ఇవ్వడం తన శరీర ప్రవేటు భాగాలను తాకడం వరకు మాత్రమే తెలుసు.. తరువాత ఏం జరిగిందనేది తెలిసేది కాదు. కానీ ప్రొద్దున లేచేటప్పటికి ఒంటిపై బట్టలు లేకుండా ఒళ్ళంతా రక్కిన గాయాలతో, నొప్పులతో ఉండేది. లేవడానికి ఓపికలేక నిస్సత్తువగా మత్తుగా పడి ఉండే బాలికను తోటి బాలికలు వచ్చి బట్టలు తొడిగి కిందికి తీసుకెళ్ళేవారు. ఈ విధంగా 14సంవత్సరాల బాలికపై గతేడాది కాలంగా ఆ దుర్మార్గుడికి లైంగిక వాంఛలు కలిగినప్పుడల్లా అనాధాశ్రమానికి వచ్చి ఆ బాలికపై దుర్మార్గానికి ఒడిగట్టేవాడు.
బాలిక అతని వద్దకు వెళ్ళను అని ఎంత ప్రాధేయపడినా వార్డెన్ విజయ దుడ్డుకర్రతో బాలికను చితకబాదేది. అతను తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చెబితే నోరు మెదిపావంటే చంపేస్తానని బెదిరించి ఆ మృగాడివద్దకు పంపేది. దిక్కుతోచని ఆ బాలిక ఆ అన్యాయానికి బలవుతూనే ఉండాల్సి వచ్చేది. అతని దుర్మార్గానికి బాలికకు మూత్రకోసంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. పలుమార్లు అత్యాచారానికి గురవడంతో మూత్రాశయ కండరాలు దెబ్బతిని మలమూత్ర విసర్జన నియంత్రణ కోల్పోయి బట్టల్లోనే చేసుకునేది. శరీర ప్రయివేటు భాగాలలో విపరీతమైన నొప్పి, ఎవరికీ చెప్పుకోలేని బాధను దిగమింగేది.
ఇన్ఫెక్షన్ తీవ్రమై చివరికి బాలిక నడవలేని స్థితికి చేరుకుంది. దీనితో బాలికను ఇంటికి తీసుకు వెళ్ళవలసిందిగా వార్డెన్ విజయ ఆమె బంధువులకు ఫోన్చేసి వత్తిడి చేసింది. దీనితో బాలిక గార్డెన్గా వున్న ఆమె భావ అనిల్ ఆమెను మార్చి 21వ తేదీన తమ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వచ్చే సమయంలో బాలిక బండికూడా ఎక్కలేని పరిస్థితిలో ఉంది. ఇంకొకరి సాయంతో బండిపై కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక గోడలు పట్టుకొని నడిచేది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బాలికకు ఏ ఆస్పత్రిలోనూ వైద్యం అందలేదు. 4 నెలలు బాలిక నరకయాతన అనుభవించింది. వాంతులు చేసుకునేది, బట్టలోనే మూత్రవిసర్జన చేసేది. బావ అనిల్ వాళ్ళే బాలికకు ఎంతో సేవ చేసేవారు. తరువాత వారు జులై 29న బాలికను తిరిగి అనాధాశ్రమనికి తీసుకెళ్ళగా వార్డెన్ విజయ బాలికను చేర్చుకోవడానికి నిరాకరించింది. దీనితో వారు ఆ బాలిక పిన్ని వరుసయ్యే ప్రీతి ఇంటికి తీసుకెళ్ళారు.
గతంలో నర్సింగ్ వృత్తిలో అనుభవమున్న ప్రీతి బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించగా బాలిక అనాధాశ్రమంలో తనకు జరిగిన సంఘటనలను వివరించింది. దీనితో జూలై 31న ప్రీతి బోయినపల్లిలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసిన పోలీసులు కేసును అమీన్పూర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసు కంప్లెయిట్ ఇచ్చిన తరువాత కేసులో అనేక అనుమానాలు వెలుగుచూశాయి. బాలికను ఆగస్టు 1న భరోసా సెంటర్కు తీసుకు వెళ్ళారు. భరోసాలో బాలికకు వైద్యపరీక్షలు జరిపి ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. కానీ బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి పంపకుండా ఇంటికి పంపారు. తరువాత 3వ తేదీన నేరేడ్మెట్ సఖి సెంటర్ నుంచి పద్మావతి అనే ఆమె ఫోన్చేసి బాలికను అక్కడికి తీసుకురావాలని చెప్పారు. అక్కడ బాలికను ఇంటరాగేట్ చేసే సమయంలో సీసీ కెమెరాలను ఆపేశారు. ప్రీతిని బాలికతో మాట్లాడనివ్వలేదు. ప్రీతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలికతో మాట్లాడించలేదు. తరువాత 7వ తేదీన బాలికను నీలోఫర్లో అడ్మిట్ చేశామని చెప్పారు. అదే రోజు వేణుగోపాల్ను అరెస్టు చేశారు. ఇంకోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు ఫిర్యాదు చేసిన బాలిక బావ అనిల్పై కూడా బాలికను కొట్టాడని అదే రోజు తప్పుడు కేసు బనాయించారు. దీంతో ప్రీతివాళ్ళు నిందితుడ్ని వదిలేసి మాపై కేసుపెట్టడమేమిటని గొడవ చేయగా అనిల్ను వదిలేశారు. తరువాత 10వ తేదీన బాలికను ఐసీయులో చూసిన ప్రీతి వాళ్ళు హడలిపోయారు. 12వ తేదీన బాలిక చనిపోయిందని చెప్పారు. మీడియా, మహిళా సంఘాలు స్పందించడంతో విజయ ఆమె సోదరుడు జయదేవ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కేసులో పలు కీలక అనుమానాలున్నాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ బాలికను ఏం చేశారు? ఆరోగ్యం బాగాలేని బాలికను ఆస్పత్రికి వెంటనే ఎందుకు పంపలేదు? కేసును పక్కదోవ పట్టించేందుకు ఎవరు ప్రయత్నించారు లాంటి అంశాలన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కనుక కేసును సత్వరం ఛేదించి నిజానిజాలు వెలికి తీయాలి.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో బాలిక జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారకులెవరు? అనాధాశ్రమాలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవి సక్రమంగా నడుస్తున్నాయా? లేదా అని చూసే బాధ్యత ప్రభుత్వానికి లేదా! ఒక అనాధ బాలికను ఇంతటి దాష్టీకానికి బలిచేయడానికి వార్డెన్ విజయకు వేణుగోపాల్ లాంటి క్రూరమృగాలకు శిక్షలు పడతాయా? లేక బైయిల్ ఇచ్చి వదిలేస్తారా? ఈ ప్రశ్నలకు బదులేది? ఈ పాపం ఎవరిది?
Courtesy: NT