– స్టే ఇవ్వటానికి నిరాకరించిన హైకోర్టు
– 400కు పైగా చెట్లు కూల్చివేత
– 29 మంది నిరసనకారుల అరెస్ట్
– ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం
ముంబై : చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే భారీ సంఖ్యలో వృక్షాలను పోలీసుల సహాయంతో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్సి) నేలమట్టం చేయడం వివాదాస్పదంగా మారింది. భారీ కారు షెడ్ నిర్మాణం కోసం వందల ఏళ్ల నాటి 2,500 వృక్షాలను నరికివేయడానికి ఎఎంఆర్సి ప్రణాళిక రూపొందించింది. 200 చెట్లు కూల్చిన తరువాత స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అది అడవి కాదని పేర్కొంటూ స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఈ చర్య తరువాత శనివారం రాత్రికి 1000 చెట్లను కూల్చివేశారు. ఈ చర్యకు నిరసనగా ఆందోళనకు దిగిన వారిలో ఆరుగురు మహిళలుసహా 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరే కాలనీలో చెట్లను కూల్చివేయొద్దంటూ గతంలో ఎన్జిఒలు, పలువురు పర్యావరణ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను ముంబై హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే చెట్ల నరికివేతకు ఎంఎంఆర్సి పూనుకుంది. నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆరే కాలనీ వైపు వెళ్లకుండా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశారు. ఆందోళనలు చేపట్టిన అనేక మంది కార్యకర్తలను ఆరే చెక్ పోస్ట్ నుండి గోరేగావ్ పోలీస్ స్టేషన్కు తరలించామని పేర్కొన్నారు.
నిరసనకారుల అరెస్టును ఖండించిన ఆదిత్య థాకరే, కాంగ్రెస్
వృక్షాల నరికివేత, నిరసనకారుల అరెస్టును శివసేన యువనేత ఆదిత్య థాకరే ట్విట్టర్ ద్వారా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డారో తెలుసు కోవాలని అనుకుంటున్నానని అన్నారు. పర్యావరణంపై ప్రధాని మోడీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నా రనడానికి ఇది మచ్చుతునక అని కాంగ్రెస్ విమర్శించింది.
Courtesy Prajashkathi…