వలస వ్యతిరేక పోరాటంతో అఖిల భారత జాతీయ చైతన్యం ఆవిర్భవించింది. అంతకుముందు వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాల ప్రాతిపదికగావున్న ‘జాతీయ’ చైతన్యంపైన అఖిల భారత జాతీయ చైతన్యం ఆవిర్భవించింది.
వేరేవిధంగా చెప్పాలంటే ఒడియా, గుజరాతీ, బెంగాలీవంటి ప్రాంతీయ చైతన్యంపైన అఖిల భారత జాతీయ చైతన్యం ఆవిర్భవించింది. వలస వ్యతిరేక పోరాటంలో ఈ రెండు చైతన్యాలు వికసించాయి. ప్రాంతీయ భాషా చైతన్యం భక్తి ఉద్యమానికంటే ముందే ఉందని ఇఎమ్ఎస్ నంబూద్రీపాద్ అనటం అందరూ అనుకుంటున్నదానికి భిన్నంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఆ చర్చ చేయనవసరం లేదు. అసలు విషయం ఏమంటే నేడు ప్రతి భారతీయుడు ఈ రెండు రకాల జాతీయ చైతన్యాలను కలిగివున్నాడు. ఈ రెండు చైతన్యాలను జాగ్రత్తగా పెంపొందించాలి. వీటిమధ్య సున్నితమైన సమతుల్యాన్ని సాధించాలి. వీటిలో ఒకదానిని విస్మరించి మరోదానిపై అతిగా ఆధారపడితే దేశం చీలిపోతుంది.
మన దేశ సమాఖ్య వ్యవస్థ నిర్మాణంలో ఈ రెండు చైతన్యాల వ్యక్తీకరణ ఉంది. నిజానికి భాషా ప్రాంతీయ చైతన్యం కింద వివిధ రకాల చైతన్యం కూడా ఉంది. ఈ చైతన్యాలను కూడా కలుపుకుపోవటానికి ”స్వయంచాలక మండళ్ళు(అటానమస్ కౌన్సిల్స్)” వంటి అనేక సాధనాల రూపకల్పన జరిగింది. ఇవి సరిపోవచ్చు లేక సరిపోకపోవచ్చు. అయితే అసలు విషయం ఏమంటే నేడు కొనసాగుతున్న అధికార కేంద్రీకరణ ధోరణికి భిన్నంగా భారత సమాఖ్య వ్యవస్థకు పరస్పరం సర్దుకుపోయే లక్షణం ఉండటం అవసరం.
మన వలస వ్యతిరేక జాతీయవాద స్వభావం నుంచే ఈ సర్దుకుపోయే లక్షణం వచ్చింది. మతపరమైన జాతీయవాదంవంటి మరే ఇతర జాతీయవాదం కూడా ఇలా సర్దుకుపోయే స్వభావాన్ని అందించలేదు. అందువల్ల దేశంలోని రాజ్య వ్యవస్థని హిందూత్వ భావజాలానికి అనుగుణంగా మారిస్తే అది అంతిమంగా దేశ విచ్ఛిత్తికే దారితీస్తుంది. మతపరమైన అల్పసంఖ్యాకులు హిందూత్వచేత అణచివేతకు గురయిన వెంటనే ఈ విషయం గుర్తింపబడుతుంది. అయితే మతపరమైన విభజనను పెంపొందించే హిందూత్వ విషయంలోనే కాకుండా అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా చెలరేగే ప్రాంతీయ తిరుగుబాట్లను కూడా వివరించగలిగే సార్వత్రిక విలువ ఈ వాస్తవానికి ఉంది.
(హిందు) ‘జాతి’ ఇప్పటికే అస్తిత్వంలో ఉందని హిందూత్వ ‘జాతీయవాదం’ భావిస్తుంది. అంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య సర్దుబాటు అవసరం లేదు. అటువంటి డిమాండ్ కేవలం తమ జేబులు నింపుకోజూసే ‘అవినీతిపరులైన ప్రాంతీయ పాలక వర్గాల’ నుంచి మాత్రమే వస్తుంది. అటువంటి సర్దుబాటు కోసం చేసే ఏ డిమాండ్ అయినా ‘జాతి ప్రయోజనం’ పేరుతో విస్మరింపబడుతుంది. కాబట్టి అధికార కేంద్రీకరణ ఆవశ్యకం. అలాంటి అధికార కేంద్రీకరణకు చేసే ప్రతి ప్రయత్నమూ దేశాన్ని విభజనవైపు నెడుతుంది లేక అలాంటి విభజనను నిలువరించటానికి నియంతృత్వంవైపు నెడుతుంది.
అటువంటి నియంతృత్వం స్వీయ సమర్థ ధోరణిగా మారుతుంది: ”శాంతి, భద్రతల పరిస్థితిని, ‘టెర్రరిస్టులు’ హింసాత్మకంగా పెట్రేగిపోవటాన్ని చూడండి. అటువంటి పరిస్థితులలో పౌరహక్కులను మినహాయించి ఉక్కుపాదాన్ని మోపవలసిన అవసరం ఉంటుంది” (జమ్మూ-కాశ్మీర్ విషయంలో ప్రభుత్వం అధికారికంగా చేసిన ఇటువంటి వాదనతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది).
అటువంటి అధికార కేంద్రీకరణతో ఎటువంటి వినాశకరమైన పర్యవసానాలుంటాయో జమ్మూ-కాశ్మీర్ సమస్య తెలియజేస్తోంది. అసాధారణ పరిస్థితులలో రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసుకునేందుకు సర్దుబాటు చేసుకున్న జాతీయవాదాన్ని 370, 35ఏ ప్రకరణాలు ప్రతిబింబించాయి: ముస్లిం ప్రజలు మెజారిటీగా వున్న రాష్ట్రాన్ని హిందూ రాజు పాలించాడు. తన రాజ్యాన్ని పాకిస్థాన్లో విలీనం చేయటానికి బదులుగా ఈ ప్రత్యేక ప్రకరణాల ఆధారంగా భారతదేశంలో విలీనం చేశాడు. ఆకస్మికంగా, ఏకపక్షంగా ఈ ప్రత్యేక ప్రకరణాలను రద్దుచేయటతో మిగిలిన దేశంలోని హిందూత్వ సమర్థకులు ఎంతగా హర్షించినప్పటికీ అది మొత్తం భారత జాతి పునాదులనే కుదుపుతుంది.
జాతీయవాదానికి మతం ప్రాతిపదిక కాజాలదనేది వాస్తవం. ఎందుకంటే జాతి అస్తిత్వాన్ని పూర్వకాలం నుంచీ కొనసాగేదిగా మతం భావించటంవల్ల వలస పాలనపై సుదీర్ఘకాలం సాగిన పోరాటం తరువాత ఆవిర్భవించిన ఆధునిక జాతికి ఉండే సర్దుబాటు చేసుకునే తత్వం మతం ప్రాతిపదికగా వుండే జాతీయవాదానికి ఉండదు. భాష ప్రాతిపదికన నడిచిన ఉద్యమంతో తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్) పాకిస్థాన్ నుంచి విడిపోవటంలో ఈ వాస్తవం ప్రతిబింబించింది. హిందూత్వ జాతీయవాదం కూడా భారతదేశాన్ని ఇదే దిశలో ముందుకు నెడుతోంది. కాశ్మీరీలు అనుభవిస్తున్న అవమానాలను చూసి సంబరపడేవాళ్ళకి ప్రభుత్వ నిర్ణయంపట్ల విచారాన్ని వ్యక్తం చేసే రోజువస్తుంది.
నిజానికి కాశ్మీర్లో సృష్టించిన బీభత్సంతో సంతృప్తి చెందకుండా మోడీ ప్రభుత్వం ఇప్పుడు దేశంపైన హిందీని రుద్దాలని చూస్తోంది. అనేక ప్రాంతీయ-భాషాపరమైన జాతుల ఆకాంక్షలను అణచివేతకు గురిచేసే చర్య ఇది. జాతిని సమైక్యం చేసేపేరుతో దానిని ముక్కలు చేసే మరో చర్య ఇది. ఇలా ముక్కలయ్యే ధోరణిని అరికట్టటానికి ప్రజలందరి మానవ హక్కులపైన, పౌర స్వేచ్ఛపైన మరింతగా పరిమితులు విధించటం అనివార్యమౌతుంది.
ప్రాంతీయ భాషా జాతుల ఆకాంక్షలను అణగదొక్కే ఈ ధోరణి కేవలం హిందూత్వతోనే మొదలు కాలేదు. ఇది సమాఖ్య ఏర్పాటులో అధికార కేంద్రీకరణ రూపం తీసుకుంది. దీని ఆర్థిక రూపం కార్పొరేట్-ఫైనాన్షియల్ వర్గాల డిమాండ్కు అనుగుణంగా ఉంది. వస్తువుల, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశంతో రాష్ట్రాలు తమకు తోచిన విధంగా సరుకులపై పన్ను విధించే అధికారాన్ని కోల్పోయాయి. ఈ అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి కట్టబెట్టారు. పన్ను రేట్లలో ఏమాత్రం సర్దుబాటు చేసుకోవాలన్నా రాష్ట్రాలు ఈ కౌన్సిల్ని బతిమిలాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా జీఎస్టీ ఒక ఆశ్చర్యకరమైన అధికార కేంద్రీకృత చర్యగా ఉంది. అనేక రకాల తప్పుడు ఆపేక్షల కారణంగా అటువంటి అధికార కేంద్రీకరణకు మద్దతునిచ్చిన రాష్ట్రాలకు తాము చేసిన తప్పు తీవ్రత తెలిసివస్తోంది. జీఎస్టీని ”ఒక దేశం-ఒక పన్ను” అని అభివర్ణించినట్టుగా ”ఒక దేశం-ఒక భాష” మన సమాఖ్య రాజ్యతంత్రానికి ప్రమాదకరం.
జరిగిన తప్పు జీఎస్టీతో కాదని, తొందరపాటుగా దానిని ప్రవేశ పెట్టటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయనే దృక్పథం ఒకటుంది. ఇది పూర్తిగా అబద్ధం. జీఎస్టీవల్ల ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన కష్టనష్టాలకు జీఎస్టీ తప్ప మరేదీ కారణం కాదు. దీనికి కారణం చాలా సామాన్యమైంది: పెద్ద పరిశ్రమల రంగం తన ఇన్పుట్స్ను తక్కువ వేతనాలుగల చిన్న ఉత్పత్తి రంగం నుంచి కొనుగోలు చేసే మనలాంటి ఒక ఆర్థిక వ్యవస్థలో పెద్ద పరిశ్రమలకు పన్ను రిఫండ్ రావాలంటే చిన్న ఉత్పత్తి రంగంలోని ఇన్పుట్స్ సరఫరా చేసిన కంపెనీలు జీఎస్టీ రిటర్న్స్ని సమర్పించాలి.
ఇది రెండు విషయాలను సూచిస్తుంది: మొదటిది, చిన్న పరిశ్రమల రంగం గతంలో కంటే అధిక వ్యయాన్ని భరించవలసి వస్తోంది. నిజానికి ”అవిభాజ్యతల” కారణంగా జీఎస్టీని అనుసరించటానికి ఒక్కో యూనిట్కి అయ్యే వ్యయం పెద్ద ఉత్పత్తి రంగం కంటే చిన్న ఉత్పత్తి రంగంలో ఎక్కువగా ఉంది. రెండవది, గతంలో అసలు పన్ను చెల్లించని అనేక చిన్న యూనిట్లు ఇప్పుడు పన్ను చెల్లించవలసిన పరిస్థితికి నెట్టబడ్డాయి. సాధ్యమైనంతవరకు ”రెవెన్యూ తాటస్థ్యం” వచ్చేలా జీఎస్టీ పన్ను రేటును నిర్ణయించాలనే వాస్తవం, దేశ వ్యాప్తంగా ఒక్కో సరుకుకూ ఒకే పన్ను ఉండేలా చూడటంవల్ల గతంలో అసలు పన్నే కట్టని చిన్న పరిశ్రమలు చాలా పెద్ద మొత్తంలో పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది.
జీఎస్టీ భారంవల్ల చాలా చిన్న పరిశ్రమలు దివాళా తీయటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నయా ఉదారవాద వైరుధ్యాలవల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మందగమనంతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థ దీనితో మరింతగా కుంగిపోతుంది. అటువంటి మాంద్య ధోరణుల ప్రభావంతో తిరిగి జీఎస్టీ ద్వారావచ్చే పన్ను వసూళ్ళు తగ్గిపోతాయి. అదే నేడు జరుగుతున్నది.
ఇదంతా జరగటానికి జీఎస్టీని ప్రవేశ పెట్టటంలో తొందరపాటు గానీ, అడ్డదిడ్డంగా అమలు చేయటం గానీ కారణం కాదు. అదొక నయా ఉదారవాద కల్పితకధ. జీఎస్టీ కారణంగానే అది ఉద్భవించింది. గతంలో ఆర్థిక వ్యవస్థలోని చిన్న ఉత్పత్తిదారులను మినహాయించి ఒకే ఒక విభాగం నుంచి పన్నులపై వచ్చిన ఆదాయాన్ని నేడు చిన్న ఉత్పత్తిదారులతో కలిపి ఆర్థిక వ్యవస్థలోని మరింత పెద్ద విభాగంలో పన్నులపై ఆదాయం వచ్చేలా చూస్తున్నారు. గతంలో కంటే చిన్న ఉత్పత్తిదారులు మరింత పీడనకు గురికావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
”జాతీయ”మార్కెట్(ప్రపంచంలోనే జీఎస్టీ లేని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకు ఐక్య ”జాతీయ” మార్కెట్ లేనట్టు)ను ఐక్యపరచటానికి అనేటటువంటి అనేక పనికిమాలిన వాదనలతో ”సమర్థించిన” జీఎస్టీ నిజస్వరూపం బయటపడుతోంది: గతంలో భారీ పరిశ్రమల రంగం భరించిన ఒక సరుకుపై వేసే పన్ను భారంలో ఒక భాగాన్ని చిన్న ఉత్పత్తి రంగం భుజాలపైకి బదిలీ చేయటమే జీఎస్టీ అసలు స్వరూపం.
కాబట్టి భారత సమాఖ్య రాజ్యవ్యవస్థ నిర్మాణం మీద రెండు వైపుల నుంచి దాడి జరుగుతోంది: ఒకవైపు హిందూత్వ శక్తులు, మరోవైపు కార్పొరేట్-ఫైనాన్షియల్ వర్గం ఈ దాడులు చేస్తున్నాయి. ఈ రెండు శక్తుల మైత్రి అనే ఇరుసుపై దేశంలోని పాలన సాగుతున్నందున అధికారం మరింతగా కేంద్రీకృతం అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో ద్వంద్వ జాతీయ చైతన్యంలో ఆవశ్యక భాగమైన ప్రాంతీయ-భాషా జాతులు నిరాదరణకు గురవుతాయి. ఈ వాస్తవం రాబోయే రోజుల్లో జాతి ఐక్యతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
గత ప్రభుత్వాలు 70సంవత్సరాలలో చేయజాలని పనులను తాము 70రోజుల్లోనే చేశామని బీజేపీ చెప్పుకుంటోంది. అది నిజమే. ఇన్నేళ్ళూ ఇటువంటి వినాశకరమైన పనులు చేయటానికి ఈ శక్తులను దేశం అనుమతించలేదు. ఈ శక్తులే నేడు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
– ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999