- మళ్లీ కరోనా బారిన డాక్టర్లు, వైద్యసిబ్బంది
- ఈఎస్ఐ ఆస్పత్రిలో ఓ ఉన్నతాధికారికి,
- గాంధీలో పలువురు వైద్యులకు రెండోసారి వైరస్
- వైద్య ఆరోగ్యశాఖలో ఓ ఉన్నతాధికారికి కూడా
- పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు, నర్స్లకూ!
- సాధారణ ప్రజల్లో ఇలా సోకుతున్న దాఖలాల్లేవు
- రీ-ఇన్ఫెక్షన్ కేసుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోంది
- వైద్య నిపుణుల వెల్లడి.. ఆందోళనలో వైద్య శాఖ
- మళ్లీ సోకితే కోలుకోవడానికి కనీసం 20 రోజులు
రెండోసారి కరోనా బారిన పడిన కేసుల్లో బాధితులు కోలుకోవడానికి కనీసం 20 రోజులు పడుతోంది. వారిలో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు, న్యూమోనియా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారికి ఎక్కువగా యాంటీవైరల్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తున్నాం. దీర్ఘకాలంలో వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి. అసలు వీరంతా వైరస్లో ఏదైనా కొత్త స్ట్రెయిన్ (రకం) బారిన పడుతున్నారా లేక.. అదే స్ట్రెయిన్తోనా అనే విషయాన్ని పరిశీలించాలి. లేదా.. శరీరంలో ఉన్న వైరస్సే మళ్లీ శక్తిపుంజుకుని తిరగబెడుతోందా అనేది కూడా చూడాల్సి ఉంది.
డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ హెచ్వోడీ, నిమ్స్ ఆస్పత్రి
హైదరాబాద్ : ఒకసారి కరోనా సోకినవారికి మళ్లీ సోకే ప్రమాదం ఉందా? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. హాంకాంగ్లో 33 ఏళ్ల వ్యక్తికి కరోనా రెండోసారి సోకిందని.. ఆ వైరస్ రీఇన్ఫెక్షన్కు సంబంధించి ఇది ప్రపంచంలోనే పూర్తిస్థాయి వివరాలు నమోదు చేసిన (డాక్యుమెంటెడ్) కేసు అని హాంకాంగ్ వర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. కానీ, ఇలా రెండోసారి వైరస్ బారిన పడిన కేసులు తెలంగాణలో చాలానే ఉన్నాయని, ముఖ్యంగా.. కొవిడ్పై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బందిలో కరోనా రీ-ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనపడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో ఒకరికి రెండోసారి వైరస్ సోకినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించడం గమనార్హం. ఈ రీ-ఇన్ఫెక్షన్ల బెడద కొద్దిరోజుల క్రితమే మొదలైనట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే రెండోసారి కరోనా సోకినవారిలో సాధారణ ప్రజలెవరూ ఉన్నట్టు తమ దృష్టికి రాలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వైరల్ లోడ్ ఎక్కువగా ఉండే పేషెంట్లకు రోజూ చికిత్స చేయడంతోపాటు.. ఇప్పటికే ఒకసారి వచ్చింది కదా, రెండోసారి రాదులే అనే భావన ఉండడం వల్లే వైద్యులు, వైద్య సిబ్బంది రీ-ఇన్ఫెక్షన్కు గురవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండోసారి వైరస్ బారిన పడినవారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటున్నట్టు వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారంతా తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని.. ఆక్సిజన్, వెంటిలేటర్ చికిత్స అవసరమవుతోందని పేర్కొంటున్నారు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలుంటే తీవ్రత మరింత అధికంగా ఉంటోందని చెబుతున్నారు. ఉదాహరణకు.. వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరికి రెండోసారి కరోనా సోకి పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజానికి నెల రోజుల క్రితమే ఆయనకు కరోనా వచ్చి తగ్గింది. అప్పుడు కొద్దిపాటి లక్షణాలే కనిపించాయి. రెండోసారి వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అలాగే.. ఈఎ్సఐ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే ఒకవ్యక్తికి నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు కరోనా సోకింది. మొదటిసారి వచ్చినప్పటి కంటే రెండోసారి తీవ్ర లక్షణాలు కనిపించినట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. గాంధీలో పలువురు వైద్యులు, నర్సులు, సికింద్రాబాద్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో ఆరుగురు నర్సులకు రెండోసారి వైరస్ సోకాక తీవ్రత ఎక్కువగా ఉంది. వైద్యులు, సిబ్బంది మళ్లీ మళ్లీ కరోనా బారిన పడుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర ఆందోళన నెలకొంది.
హాంకాంగ్ కేసులో రెండోసారి లక్షణాలే లేవు
కరోనా రీ-ఇన్ఫెక్షన్కు సంబంధించి తొలి డాక్యుమెంటెడ్ కేసుగా నమోదైన హాంకాంగ్ కేసులో బాధితుడికి.. రెండోసారి ఎలాంటి లక్షణాలూ కనపడకపోవడం గమనార్హం. అతడికి మార్చి 26న వైరస్ పాజిటివ్ వచ్చింది. అప్పట్లో దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి స్వల్పలక్షణాలు 3 రోజులపాటు ఉన్నాయి. ఆగస్టులో అతడు స్పెయిన్ నుంచి యూకే మీదుగా హాంకాంగ్కు ప్రయాణించాడు. ఆగస్టు 15న హాంకాంగ్ విమానాశ్రయంలో అధికారులు అందరికీ చేసినట్టే అతడికీ పరీక్ష చేశారు. టెస్టులో పాజిటివ్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అతడికి ఎలాంటి లక్షణాలూ లేవు. రెండుసార్లూ అతడి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. ఆ నమూనాల్లోని వైర్సల జన్యు క్రమాన్ని అధ్యయనం చేశారు.
అతడికి సోకిన వైర్సల జన్యుక్రమంలో చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఒకసారి వైరస్ సోకినవారికి మళ్లీ సోకుతుందా? అనే ప్రశ్నకు ఈ కేసుతో సమాధానం దొరికిందని యూకేకు చెందిన పరిశోధకురాలు గ్రిఫిన్ అభిప్రాయపడ్డారు. వైరస్ సోకడం వల్ల వచ్చే రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో తెలియదని ఈ కేసు బట్టి అర్థమైంది కాబట్టి.. ఒకసారి వైరస్ బారిన పడినవారు కూడా టీకాలు వేయించుకోవాల్సిందేనని హాంకాంగ్ వర్సిటీ పరిశోధకులు సూచించారు. ‘ఒకసారి వైరస్ సోకింది కాబట్టి నాకేం కాదు’ అనే ధీమాతో ఉండొద్దని.. ఇప్పటికే వైరస్ సోకి, కోలుకున్నవారు కూడా భౌతిక దూరం, మాస్కులను ధరించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.
Courtesy Andhrajyothi