– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టిన బాంబే హైకోర్టు
– కరోనా వైరస్ వ్యాప్తికి కారణాలు వెతుకున్నారు..
– ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తబ్లిగీలపై విష ప్రచారం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తికి ఓ వర్గం వారిని బాధ్యులు చేస్తూ మనదేశంలో జరిగిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. విచారకరమేంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి కారణం. ఢిల్లీలోని మర్కజ్ సెమినార్కు వచ్చిన తబ్లిగీలను లక్ష్యంగా చేసుకొని అధికార రాజకీయ నాయకత్వం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మనదేశంలో వైరస్ వ్యాప్తికి తబ్లిగీలే కారణమని తేల్చేశారు. ఆ తర్వాత పుకార్లతో కూడిన ఊహాజనిత వార్తాకథనాలకు అడ్డేలేకుండా పోయింది…. తబ్లిగీలపై వేసిన కేసుల విచారణలో తీర్పు చెబుతూ ‘బాంబే హైకోర్టు’ ఔరంగాబాద్ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలివి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తూ తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న పలువరు తబ్లిగీలను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పు చెప్పింది.
కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారంటూ మర్కజ్ యాత్రికులను బలిపశువులను చేశారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనలేక, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దుష్ప్రచారం జరిగిందని, 50 ఏండ్లుగా ఏటా జరుగుతున్న తబ్లిగీ సమావేశాలపై లేనిపోని ఆరోపణలు చేశారని తీర్పులో పేర్కొన్నారు. 29మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, వారిని విడుదల చేయాల్సిందిగా బాంబే హైకోర్టు కొద్ది రోజుల క్రితం సంచలన తీర్పు వెలువరించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది ఎలా మొదలైంది?
ఢిల్లీలోని నిజామొద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ వద్ద తబ్లిగీ జమాత్ మూడు రోజుల సెమినార్ (మార్చి 13 నుంచి 15వరకు) జరిగింది. లాక్డౌన్ విధింపు జరిగేనాటికి అనేకమంది విదేశీ, స్వదేశీ యాత్రికులు ఢిల్లీలోని సమావేశస్థలంలోనే చిక్కుకుపోయారు. మలేసియా, ఇండొనేసియా నుంచి యాత్రికులు సమావేశాలకు హాజరయ్యారు. మర్కజ్లో కరోనా కేసులు బయటపడటంతో, వైరస్ దేశమంతా విస్తరించడానికి వారే కారణమని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఒక వర్గం వారి వల్లనే వ్యాప్తి జరుగుతోందన్న అపోహలను పెంచింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్కజ్ యాత్రికుల వివరాలను మీడియాకు ప్రత్యేకంగా పేర్కొనటం అపోహలను మరింత పెంచాయి. ఇక సామాజిక మాధ్యమాలలో అడ్డూఅదుపులేని విద్వేష ప్రచారం కొనసాగింది. పాలకుల అభీష్టాన్ని నెరవేర్చేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నడుచుకున్నాయని ‘బాంబే హైకోర్టు’ తీర్పు స్పష్టంగా పేర్కొన్నది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలు కాకుండా ‘నెపం’ వేయడానికి, తద్వారా సమస్యను పక్కదారి పట్టించడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో ఈ ఉదంతం చక్కటి ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
Courtesy Nava telangana