– దళితులు, గిరిజనులు, ముస్లింల సంఖ్య ఎక్కువ
– గరిష్టంగా యూపీ నుంచే..!
– ఎన్సీఆర్బీ తాజా సమాచారం
న్యూఢిల్లీ : దేశంలోని జైళ్లలో అట్టడుగు వర్గాల ప్రజలే అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో వారి వాటా కంటే అసమానంగా ఈ వర్గాల ప్రజలు దోషులుగానూ, పలు కేసులలో విచారణలను ఎదుర్కొంటున్నారు. 2019కి సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా సమాచారం ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నది. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం.. దళితులు, గిరిజనులు, ముస్లింలు జనాభాలో తమ వాటాకు అసమాన సంఖ్యలో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అట్టడుగు వర్గాలలో ముస్లింలు.. దోషుల సంఖ్య కంటే ఎక్కువ మంది అండర్ ట్రయల్లోనే ఉన్నారు.
దళితుల్లో దోషుల సంఖ్య 21.7శాతంగా ఉన్నది. జైళ్లలో కొట్టుమిట్టాడుతున్న వారిలో షెడ్యూల్డ్ కులాల వాటా 21శాతంగా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభాలో వారి వాటా 16.6శాతం. గిరిజనులు విషయంలోనూ ఈ అంతరం పెద్దదిగానే ఉన్నది. షెడ్యూల్డ్ తెగలుదోషుల జనాభాలో 13.6శాతంగా ఉన్నారు. జైళ్లలో 10.5శాతం మంది మగ్గుతున్నారు. అయితే దేశజనాభాలో వారి వాటా 8.6శాతంగా ఉండటం గమనించాల్సిన అంశం. ఇక దేశజనాభాలో ముస్లింల వాటా 14.2శాతంగా ఉన్నది. మొత్తం దోషులలో 16.6శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయితే అండర్ ట్రయల్స్ కింద ఉన్న ముస్లింల సంఖ్య 18.7శాతంగా ఉన్నది. ” మన న్యాయవ్యవస్థ కఠినంగా ఉండటమే కాకుండా పేదలకు వ్యతిరేకంగా లోడ్ చేయబడింది. మంచి న్యాయవాదులను నియమించుకోగలిగినవారు సులభంగా బెయిల్ పొందుతారు. కానీ, అట్టడుగు వర్గాల వారు పేదరికంలో మగ్గిపోవడంతో వారికి మంచి న్యాయవాదులను నియమించుకునే ఆర్థిక స్తోమత ఉండదు. ఈ కారణంగానే వారు దోషులుగా తేలుతూ జైళ్లలో మగ్గుతున్నారు” అని పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాజీ చీఫ్ ఎన్ఆర్ వాసన్ అన్నారు.
ఇక పెత్తందారీ వర్గాలలో తప్పులు చేసినవారు డబ్బు ఆశను ఎరగా చూపించి అట్టడుగు వర్గాల వారిని పావుగా వాడుకుంటున్నాయనీ, దీంతో అనేక సందర్భాల్లో చేయని నేరాలకు దళితులు, గిరిజనులు, ముస్లింలు జైళ్లకు వెళ్లాల్సి వస్తోందని ప్రజాసంఘాల నాయకులు వాపోయారు. ఇక ఓబీసీల విషయానికొస్తే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2006 సమాచారం ప్రకారం.. దేశజనాభాలో వారి వాటా 41శాతం. వీరిలో 35శాతం మంది దోషులుగా ఉన్నారు. 34శాతం మంది కేసు విచారణలను ఎదుర్కొంటున్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే యూపీలో దళితులు, ముస్లింలు అధికంగా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ జాబితాలో యూపీ(17,995 మంది), బీహార్(6,843), పంజాబ్(6831)లు ఉన్నాయి. అలాగే ఎస్టీల విషయానికొస్తే మధ్యప్రదేశ్(5,894), యూపీ(3,954), ఛత్తీస్గఢ్ (3,471) లు ఉన్నాయి. ఇక జైళ్లలో మగ్గుతున్న ముస్లింల సంఖ్య యూపీ(21,139)లో అధికంగా ఉన్నది. తర్వాతి స్థానాల్లో బీహార్(4,758), మధ్యప్రదేశ్(2,947) లు ఉన్నాయి.
అదేవిధంగా దళిత, ముస్లిం దోషుల సంఖ్య యూపీలోనే అధికంగా ఉండటం గమనించాల్సిన అంశం. దళిత దోషుల విషయంలో యూపీ(6,143 మంది), ఎంపీ(5,017), పంజాబ్(2,786)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక గిరిజనుల్లో ఎంపీ(5,303), ఛత్తీస్గఢ్(2,906), జార్ఖండ్ (1985) ల నుంచి దోషులు ఉన్నారు. ముస్లింల విషయానికొస్తే యూపీ(6,098 మంది) నుంచి అత్యధికంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్(2,369), మహారాష్ట్ర (2,114) లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Courtesy Nava telangana