పంచకుల: వివాదాస్పద పోలీస్బాస్, హర్యానా ఐజీ హేమంత్ కాల్సన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంచకుల జిల్లా పింజోర్లో ఆయన ఓ ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో ఐజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయనీ.. ఆయనను కోర్టులో ప్రవేశపెడతామని అక్కడి పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది…?
ఐజీపై దాఖలైన తొలి ఎఫ్ఐఆర్లో ఓ మహిళ పేర్కొన్న కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఐజీ బలవంతంగా ఆమె ఇంట్లోకి వెళ్లారు. తాను స్నానం చేస్తుండగా.. కాల్సన్ ఇంట్లోకి చొరబడి తన కుమార్తెపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఏదో గొడవ జరుగుతుందని గ్రహించి తాను బయటికొచ్చాననీ.. ఆయన నుంచి తన కుమార్తెను రక్షించుకున్నానని ఆ మహిళ పేర్కొన్నారు. ”నేను సీఎం ఖట్టర్ర్ మనిషినీ. నన్ను ఎవరు టచ్ చేయలేరు…” అని ఐజీ బెదిరింపులకు దిగినట్టు ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై తాను వీడియో కూడా తీసినట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా గతంలో కూడా కాల్సన్పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి 9:30కి కాల్సన్ తాగి వచ్చి తమ డోర్ కొట్టారనీ.. తలుపు తీసిన తన భార్యను వెనక్కి నెడుతూ బూతులు తిట్టారని బాధితుడు ఆరోపించాడు. అడ్డువెళ్లిన తనను చెంపమీద కొట్టి, కాలితో తన్నారనీ.. కాల్చిచంపుతానని బెదిరించారని అతడు వాపోయాడు. 55 ఏండ్ల ఐజీ కాల్సన్ ప్రస్తుతం పంచకులలో హౌంగార్డ్ విభాగం ఐజీగా పనిచేస్తున్నారు. గతేడాది తమిళనాడులో ఎన్నికల విధుల్లో ఉండగా ఆయన గాల్లోకి కాల్పులు జరిపి సస్పెండ్ అయ్యారు. 2018లో కూడా ఓ కారును వెంబడించి ఘర్షణకు దిగినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో దీనిపై కేసు నమోదు కాలేదు. ఖాకీ బాస్కు ఇవేం బుద్ధులంటూ అక్కడి జనం చర్చించుకుంటున్నారు.
Courtesy Andhrajyothi