వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ – జీఎస్టీ) గురించి కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య జరుగుతున్న వివాదం ఆసక్తికరంగా ఉన్నది. జీఎస్టీ పరిహారం తగ్గించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సోమవారం నాడు జరిగిన ఐదు బీజేపీ యేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో తిరస్కరించారు. రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావలసిన మూడు లక్షల కోట్ల రూపాయల పరిహారం బదులు ఒక లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని, కొరతను రుణాల ద్వారా పూడ్చుకోవాలని కేంద్రప్రభుత్వం చేసిన సూచనను అంగీకరించలేమని ప్రకటించారు. దేశపు సమాఖ్య స్వభావం గురించీ, రాష్ట్రాల హక్కుల గురించి కూడా మాట్లాడారు. ఈ తిరస్కార కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపడం బాగుంది. కానీ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసిన అంశాలు కూడా ఉన్నాయి.
ఎవరికైనా తమను తామే ఉటంకించుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది గానీ, ఈ జీఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు చదువుతుంటే, మూడేండ్ల కింద జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చినప్పుడు, 2017 జూన్ 28న ఇదే శీర్షిక కింద నేను రాసిన అంశాలలో కొన్ని గుర్తు చేయాలనిపిస్తున్నది. ”తెలంగాణ దేశంలోనే జీఎస్టీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అది కూడా ఏప్రిల్ 5న లోకసభ ఆమోదించగానే, హడావిడిగా ఏప్రిల్ 9 ఆదివారం రోజున ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కూడా అంత తొందర పడలేదు గానీ ఎన్డీఏ భాగస్వామి కూడా కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకూ కూడా తీవ్ర విఘాతం కలిగించే జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వం నిరభ్యంతరంగా, మితిమీరిన ఉత్సాహంతో ఆమోదించింది. ఇంతగా ఉరికురికి పోయినా ఉరి తప్పలేదు.
జీఎస్టీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, రాజ్యాంగ సూత్రమైన సమాఖ్య స్వభావానికే మొత్తంగా గొడ్డలిపెట్టు కాబోతున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులనూ సంపూర్ణంగా హరించబోతున్నది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కూడా దెబ్బతిననున్నాయి” అని ఆ మూడేండ్ల కిందటి వ్యాసంలో రాశాను.
అప్పుడు అమలులోకి వస్తున్న జీఎస్టీ చట్టం ఎలా చట్టబద్ధంగానే రాష్ట్రాల హక్కులను కొల్లగొట్టడానికి అవకాశం ఉన్నదో ఆ చట్ట నిబంధనల ఆధారంగానే చెప్పడానికి ప్రయత్నించాను.
”2016 సెప్టెంబర్ 8న అమలులోకి వచ్చిన నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం, 2016 ప్రకారం వస్తు, సేవల పన్నులను నిర్ణయించడానికి జీఎస్టీ కౌన్సిల్ అనే యంత్రాంగం ఏర్పాటయింది. ఆ చట్టం గురించి, జీఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పవలసింది చాల ఉంది గాని, ప్రస్తుతానికి మచ్చుకు ఒక్క విషయం పరిశీలిస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ఎలా కాలరాచివేస్తుందో అర్థమవుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 12 (2) జీఎస్టీ కౌన్సిల్ ఎలా ఏర్పడుతుందో చెపుతుంది. దానికి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షులుగా ఉంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ లేదా ఫైనాన్స్ శాఖల సహాయ మంత్రి మరొక సభ్యులుగా ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి లేదా మరే మంత్రి అయినా సభ్యులుగా ఉంటారు. అంటే ప్రస్తుతం ఇది 31మందితో ఏర్పడే యంత్రాంగం. అంతవరకూ బాగానే ఉంది.
కానీ సెక్షన్ 12 (9) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయమైనా జరగాలంటే ఆ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నవారిలో నాలుగింట మూడు వంతుల (75శాతం) మంది ఆమోదించాలి. ఆ కౌన్సిల్లోని 29 రాష్ట్రాల ప్రతినిధుల ఓట్ల విలువ మూడింట రెండు వంతులు (66.6శాతం). కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఇద్దరు మంత్రుల ఓట్ల విలువ మూడింట ఒక వంతు (33.3శాతం). ఏ ప్రతిపాదన అయినా నెగ్గాలంటే 75శాతం ఓట్లు కావాలని నిర్దేశిస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరి దగ్గరే 33.3శాతం ఓట్లు పెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పెట్టే ఏ ప్రతిపాదన కూడా నెగ్గే అవకాశంలేదని చెప్పకనే చెప్పడమే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ కూడబలుక్కుని ఒకే మాట మీద నిలబడినా కూడ వాటి ఓట్లు 75శాతం కావు కాబట్టి వాటి మాట ఎటువంటి పరిస్థితిలోనూ నెగ్గదు” అని కూడా అప్పుడే రాశాను.
”ఇవి మొత్తంగా భారత సమాఖ్య స్వభావానికీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సంబంధించిన సమస్యలు కాగా జీఎస్టీకి సంబంధించి తెలంగాణకే ప్రత్యేకమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ మూడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో, కనీసం జీఎస్టీ విషయంలో చర్చించిన దాఖలాలు లేవు. కనీసం మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల లాగ వేచి చూడడమో, బేరసారాలు, చర్చలు, సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడమో కూడా కాకుండా తెలంగాణ ప్రభుత్వం అడగక ముందే కేంద్ర ప్రభుత్వం ముందర సాగిలపడింది. అంతకంతకూ నిరంకుశాధికారాన్ని సంతరించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఇలా దాసోహం అన్నందుకైనా తెలంగాణ పట్ల ఎటువంటి నెనరూ ప్రదర్శించలేదు. వ్యవసాయ సేవలను పన్నుల నుంచి మినహాయించాలని, వస్త్రాల మీద, బీడీల మీద, డ్రైనేజి పైపుల మీద, గ్రానైట్ మీద పన్ను రేట్లను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనలలో ఏ ఒక్కదాన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. పన్ను విధానాన్ని, పన్ను రేట్లను నిర్ధారించడానికే జీఎస్టీ కౌన్సిల్ పది నెలల్లో పదిహేను సమావేశాలు జరిపినప్పటికీ, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు బేరసారాలు ఆడడానికి ప్రయత్నించినప్పటికీ, అక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం తన కోరికల మీద పట్టు పట్టలేదు. ఇప్పుడిక కొత్తగా ఏ వస్తువు మీద పన్ను రేటునూ సమీక్షించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ముప్పైకి పైగా వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లు తెలంగాణకు ఇబ్బందికరంగా ఉన్నాయని మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు” అని మూడు సంవత్సరాల కిందనే రాశాను.
‘నా మాట నిజమైందని సంతోషించనా, ఇంకా ఆ దుర్మార్గమే కొనసాగుతున్నదని విచారించనా’ అని కాళోజీ అనేకసార్లు అన్నట్టు ఇవాళ నేను కూడ నా పాత వ్యాసం నుంచి ఇంత ఉటంకించినందుకు సంతోషించనా, విచారించనా? జీఎస్టీ చట్టంలో ఈ పెత్తందారీ తనం ఉందని, ఒక దేశం, ఒకే పన్ను పేరిట కేంద్ర ప్రభుత్వం విపరీతమైన కేంద్రీకరణ జరుపుతున్నదని, ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని, కనీసం రాష్ట్రానికి అనుకూలమైన సవరణలు సూచించాలని ఎన్నో వైపుల నుంచి వచ్చిన సలహాలనూ, అభిప్రాయాలనూ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు పెడచెవిన పెట్టింది. పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగురోజుల్లో, ఆదివారం నాడు హడావిడిగా ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆమోదాన్ని తెల్పింది. ఇక ఇప్పుడు ఆ చట్టం వల్ల నష్టపోతున్నాం అని ఫిర్యాదు చేయడం గతజల సేతు బంధనం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం, తల్లిదండ్రులను చంపి అనాథను ఆదుకోండి అనడం.
సోమవారంనాటి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత పత్రికలతో మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక శాఖామాత్యులు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతున్నదని, యూపీఏ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దష్టిలో ఉంచుకుని జీఎస్టీలో చేరే అంశంపై సందేహించినా, పార్లమెంటుకు చట్టబద్ధత ఉందని, రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇవ్వడంతోనే చేరామని అన్నారు. జీఎస్టీలో చేరకుండా ఉంటే రాష్ట్రానికి రు. 25 వేల కోట్ల రాబడి వచ్చేదన్నారు.
ఎంత రాబడి వచ్చినా అది నిజంగా ప్రజలకు ఉపయోగపడేదా, కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అక్కడి నుంచి చేరవలసిన వారి ముడుపుల ఖజానాలోకి చేరేదా అని ప్రశ్నలు వేయవచ్చు గాని, ప్రస్తుతానికి ఆ ప్రశ్నలను పక్కనపెట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గట్టిగా మాట్లాడడాన్ని ప్రశంసించవచ్చు. కేంద్రం అనేది మిథ్య అని ఒక ముఖ్యమంత్రి ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర చరిత్ర మనది. అంతదూరం పోకపోయినా, రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడం, నిజమైన సమాఖ్య పాలన కోసం నిలబడడం, తోటి రాష్ట్రాలను కూడ సమీకరించడం ఆహ్వానించదగిన సంగతులు.
కానీ ఈ సందర్భంలో కూడ వేయవలసిన ప్రశ్నలున్నాయి. విమర్శనాత్మకంగా ఆలోచించవలసిన అంశాలున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతున్నదనే మాట, యూపీఏ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దష్టిలో ఉంచుకుని జీఎస్టీలో చేరడానికి సందేహించామనే మాట చారిత్రకంగా వాస్తవాలు కాదు. తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకూ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణ ఇవ్వడంలో యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట, తాత్సారం చేసిన మాట నిజం. కానీ నిధుల పంపిణీలో అన్యాయం అనే మాట అనడానికి వీలులేదు. జీఎస్టీలో చేరడానికి భారతీయ జనతా పార్టీ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే సందేహించవలసి ఉండింది. కానీ అప్పుడు తెలంగాణాధీశులు తాము కేంద్ర అధికారపక్షానికి ఎంత సన్నిహితమో చూపుకోవడానికే ఉవ్విళ్లూరారు. ఆ రాజకీయ అవకాశవాద ఫలితాలు ఇప్పుడు ఆర్థిక అన్యాయంలో ప్రతిఫలిస్తున్నాయి.
అసలు సంఫ్ుపరివార్ తత్వమే ఏకాత్మత. భారతీయ సమాజపు బహుళత్వాన్ని అణగదొక్కి, ఒక దేశం ఒకే జాతి, ఒకే మతం, ఒకే పాలన, ఒకే ఎన్నికలు, ఒకే కట్టుబొట్టు, ఒకే ఆహారం, ఒకే పార్టీ, ఒకే అభిప్రాయం అనే కేంద్రీకరణ వైపు పయనించడం, దేశ మార్కెట్ను చాపచుట్టి సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు అప్పగించడం, దేశంలో భూస్వామ్య బ్రాహ్మణీయ మనువాద ఆధిపత్యాన్ని స్థిరపరచడం దాని లక్ష్యాలు. రాజ్యాంగ విలువ అయిన ఫెడరల్ సమాఖ్య స్వభావాన్ని రద్దు చేసి, యూనిటరీ ఏకస్వామ్య పాలన కిందికి తేవడం దాని కోరిక. ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తాం అనే ధైర్యం ఆ పార్టీ నాయకుడికి రావడం వెనుక ఉన్నది ఆ ఏకస్వామ్య భావనే.
ఆర్థిక రంగంలో మాత్రమే గాక, సకల రంగాలలో గుత్తాధిపత్యానికీ, ఏకస్వామ్యానికీ తెగబడుతున్న కేంద్ర పాలకులను ఇప్పటికైనా ఎదిరించి, ప్రతాపరుద్రుడి నుంచి సర్వాయి పాపన్న నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల దాకా సాగించిన ఢిల్లీ వ్యతిరేక పోరు వారసత్వాన్ని నిలుపుకుంటామా లేదా అనేదే ఇవాళ తెలంగాణ ముందు సవాల్. ఇది కేవలం జీఎస్టీ సమస్య కాదు, ఇది స్వయం నిర్ణయాధికార సమస్య, స్వాభిమాన సమస్య. స్వావలంబన సమస్య.
– ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028