- రాష్ట్రంలో వేలకొద్దీ ఖాళీలు.. కొవిడ్ నేపథ్యంలో నోటిఫికేషన్లు బంద్
- నిరాశలో నిరుద్యోగులు.. ప్రకటనల కోసం ఎదురు చూపులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొలువుల భర్తీపై కొవిడ్ ప్రభావం పడింది. కొన్ని శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినా కరోనా నేపథ్యంలో ప్రకటనలు విడుదల కావడం లేదు. మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది నిరాశలో ఉన్నారు. ఇప్పట్లో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్ల్లకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు.
వేల సంఖ్యలో ఖాళీలు!
వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 17వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంహెచ్ఆర్డీ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. వీటిలో 1,731 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండటం గమనార్హం. అలాగే పోలీస్ శాఖలో 12 వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ఇటీవల మున్సిపాలిటీలో వార్డుకో ఆఫీసరును నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వార్డులున్నాయి. ఆ శాఖలో మరో 2 వేల పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అలా మునిసిపల్ శాఖలో మొత్తం 5,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు వాటిలో ఒక్క రెగ్యులర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. గురుకులాల్లో 3,717 రెగ్యులర్, మరో 605 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపి ఏడాది గడిచింది. నీటిపారుదల శాఖలో వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. కాగా, కరోనా వల్ల ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆగడం లేదని టీఎ్సపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గతంలో జారీ చేసిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తున్నామని వివరించాయి. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టం చేశాయి.
గ్రూప్-1, 3 ఎప్పుడు?
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ కాలేదు. మొదటిదశలో 100కిపైగా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జోనల్ విధానంలోని సమస్యలతో నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రస్తుతం దాదాపు 500 వరకు గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. జోనల్ విధానంలో స్పష్టత లేకపోవడం వల్లే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ కావడం లేదని టీఎ్సపీఎస్సీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం సిద్ధించిన తర్వాత గ్రూప్-2 నోటిఫికేషన్ ఒక్కసారే విడుదలైంది. గ్రూప్-3, 4 పోస్టులు సైతం అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Courtesy Andhrajyothi