– కోల్కతాలో అమిత్షా ర్యాలీకి నిరసనల సెగ
కోల్కతా నగరంలో అమిత్షాకు నిరసన సెగ తగిలింది. ‘కేంద్రహౌం మంత్రి గోబ్యాక్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. షాహిద్ మినార్ వేదికకు సమీపంలో చిత్తరంజన్ ఎవెన్యూ వద్ద సీపీఐ(ఎం), కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేదిక వద్దకు వెళ్లేందుకు పికెట్ లైన్ దాటడానికి ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి తోసేశారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కోల్కతాలోని దక్షిణ ప్రాంతంలోనూ ‘గో బ్యాక్ అమిత్షా’ నినాదాలతో ఉన్న ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. నిరసనకారులు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఆకాశంలో నల్ల బెలూన్లను ఎగురవేశారు.
కోల్కతా : అమిత్ షా, బీజేపీ లకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు నిరసన చేపట్టాయి. భారీగా పోలీసు బలగాలు మోహరిం చినా ఆందోళనకు దిగాయి. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పార్క్ సర్కస్, శ్యామ్ బజార్లలోనూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. దేశాన్ని విభజించి, శాంతిని ఆపాలని కోరుకునే వారిలో జాతీయ భద్రతా దళాలు (ఎన్ఎస్జీ) భయాన్ని కలిగించాయని హోం మంత్రి అమిత్షా అన్నారు. వారు ఇంకా వస్తే పోరాడి ఓడిం చాల్సిన బాధ్యత ఎన్ఎస్జీదేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను అమలు చేస్తున్న అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాలను సత్కరించేందుకు, పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేందుకు నగరం నడిబొడ్డున ఉన్న షాహిద్ మినార్ వద్ద బీజేపీ సభ నిర్వహించింది. అలాగే ఎన్ఎస్జీ నిర్వహించిన కార్యక్రమంలో నూ ఆయన మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరు వాత చురుకైన రక్షణ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీంతో సర్జికల్ దాడులు చేయడంలో ఇజ్రాయిల్, అమెరికాల సరసన భారత్ చేరిందని చెప్పారు. మనది ప్రపంచ శాంతిని కోరుకుంటున్న దేశమన్నారు. పది వేల సంవత్సరాల దేశ చరిత్ర లో భారత్ ఎన్నడూ కావాలని ఎవరిపైనా దాడి చేయలేదని వివరించారు. అదే సమయంలో ఎవరినీ మనపైకి దాడికి రానివ్వలేదనీ, శాంతిని చెడగొట్టే ప్రయత్నాలు సాగనివ్వలేదని చెప్పారు. మన సైనికుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని అన్నారు. ప్రతిపక్షాలు మైనారిటీల్లో భయాన్ని కలిగిస్తున్నాయని ఆరోపించారు. మైనారిటీలెవరి పౌరసత్వాన్ని తొలగించబోమని చెప్పారు. ఢిల్లీ హింసపై అమిత్షా మాట్లాడకపోవటం గమనార్హం.
సీఎం మమతా పై ప్రతిపక్షాల ఆగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ర్యాలీకి అనుమతిచ్చిన సీఎం మమతా బెనర్జీని సీపీఐ(ఎం), కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించాయి. ఇటీవల భువనేశ్వర్లో జరిగిన సమావేశం సందర్భంగా అమిత్షాను కలిసిన ఆమె ఢిల్లీ ఘర్షణలను ఖండించడంలో విఫలమయ్యారన్నారు.
విస్తరించిన ‘గోలిమారో’ సీపీఐ(ఎం) నేత సలీం
అమిత్ షా ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గోలిమారో నినాదాలు చేయడంపై సీపీఐ(ఎం) నేత మహ్మద్ సలీం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ర్యాలీలో నినాదాలు చేస్తున్న దృశ్యాలున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ”అమిత్ షా ఒక పర్యటనతోనే ‘గోలీమార్..’ నినాదం కోల్కతా అంతటా విస్తరించింది. గాడ్సే అనుచరులు ‘గోలి’ తో ఆకట్టుకోవచ్చునను కున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ వివేకానంద, కాజినజ్రుల్ ఇస్లాం, ఠాగూర్ వంటి శాంతికాముకులకు చెందినది. ‘అమిత్ షా గోబ్యాక్” అని సలీం ట్వీట్ చేశారు.
రెచ్చగొట్టే ప్రయత్నం : అధిర్ రంజన్ చౌదరి
గోలిమార్ నినాదాలతో ఢిల్లీలో సృష్టించిన విధంగానే పశ్చిమ బెంగాల్లోనూ కల్లోల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. దేశ ప్రజలందరూ ఏకమై వారికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. వారు దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
విద్వేష రాజకీయాల్లో భాగస్వామ్యం కాలేను
కోల్కతా : ‘సోదరులమైన మనం మతం పేరుతో ఒకరి గొంతు.. మరొకరు ఎందుకు నరు క్కోవాలి? ఢిల్లీలో మతకల్లోలాల్లో 42 మంది మరణించడంతో కలత చెంది బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని బెంగాలీ నటి సుభద్ర ముఖర్జీ ప్రకటించారు. తాను ఎంతో చేయాలన్న ఆశతో 2013లో బీజేపీలో చేరాననీ, ఢిల్లీలో హింసాత్మక ఘటనలు విద్వేషాన్ని, అల్లర్లను పెంచే వాతావరణం పట్ల తానెంతో కలత చెందానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్కు పంపానన్నారు. మనుషుల్ని మనుషుల్లా చూడకుండా.. మతం పేరుతో అంచనా వేసే ఇటువంటి విద్వేష రాజకీయాల్లో తాను భాగస్వామ్యం కావాలనుకోవడం లేదని చెప్పారు.
Courtesy: NT