– అసంఘటిత రంగాన్ని పరిగణనలోకి తీసుకోలేదు
– లాక్డౌన్ విధించటం వల్లనే ఇదంతా : కేంద్ర మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రనబ్ సేన్
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. జీడీపీ మైనస్ 24శాతం క్షీణించిందని తేలింది. వాస్తవ పరస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని ఉంటే జీడీపీ ‘మైనస్ 24శాతం కాదు…మైనస్ 32శాతం వచ్చి ఉండేదని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రణబ్సేన్ అభిప్రాయపడ్డారు. కరోన వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో చెప్పలేమని, అలాగే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటంపైనా అనిశ్చితి కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రముఖ న్యూస్ వెబ్పోర్టల్ ‘ద వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
లాక్డౌన్ లక్ష్యం ఏంటి?
ఇతర దేశాల్లోనూ లాక్డౌన్ విధించారు. కానీ అత్యంత కఠినమైన లాక్డైన్ మనదేశంలో మోడీ సర్కార్ అమలుజేసింది. దీనివల్ల మొత్తం ఉపాధిరంగమంతా దెబ్బతిన్నది. మరి..మనం ఇప్పుడు ఆలోచించాల్సింది..లాక్డౌన్ లక్ష్యమేంటి? ఆరోగ్య సంక్షోభాన్ని తెచ్చిపెట్టిన కరోనా నియంత్రణ కోసమే కదా! మరి కరోనాను అరికట్టామా! నియంత్రించామా? లేదు కదా!
వైరస్ వ్యాప్తి చెందే వేగాన్ని మాత్రమే లాక్డౌన్ అడ్డుకోగలదు. వైరస్ వ్యాప్తి చెందటం ఖాయం. వైరస్ను అడ్డుకునేందుకు మనం సిద్ధమవడానికి లాక్డౌన్ ఉపయోగపడుతుంది. అంటే..వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని సన్నద్ధం చేయటం. మందులు సిద్ధం చేసుకోవటం. హాస్పిటల్స్లో మౌలిక వసతులు మెరుగుపర్చటం..వంటివి సాధించడానికి లాక్డౌన్ ఉపయోగపడుతుంది. మనదేశంలో అది జరిగిందా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. అంతే తప్ప లాక్డౌన్ విధింపుతో వైరస్ను తరిమికొట్టలేం.
ప్రభుత్వ వ్యయం పడిపోయింది..
ప్రభుత్వ సేవలు ‘మైనస్ 10 శాతం’ నమోదైంది. అన్నిరంగాల్లో ప్రభుత్వం వ్యయం తగ్గింది. అంతేకాదు కరోనాను ఎదుర్కోవటం కోసం విధిగా చేయాల్సిన వ్యయం కూడా జరగలేదు. ఒకవేళ ఆరోగ్యరంగంలో ప్రభుత్వ వ్యయం పెరిగినట్టయితే…ప్రభుత్వ సేవలు పెరిగేవి. రెండో త్రైమాసికం గణాంకాలు బయటకొస్తే మరింత సమాచారం బహిర్గతమవుతుంది. దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తేగనుక, మొత్తం ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది. కోలుకోనివిధంగా నష్టాలుంటాయి.
అసంఘటిత రంగం కీలకం
జాతీయ గణాంక కార్యాలయం ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదు. నాకున్న సమాచారంతో వేసిన అంచనా ‘మైనస్ 32శాతం క్షీణత’. అసంఘటిత రంగాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే జీడీపీ గణాంకాల్ని రూపొందించిందని అనుకుంటున్నా. అన్ని విధాలుగా ఈ రంగం చాలా దారుణంగా దెబ్బతిన్నది. సంఘటిత రంగంలోని సమాచారాన్ని మాత్రమే కేంద్రం లెక్కలోకి తీసుకున్నట్టుంది ! అంతే కాదు అసంఘటిత రంగం ఎంత దీనావస్థలో ఉంది, నష్టపోయింది…వీటిపై వాస్తవ గణాంకాలు బయటకు రానివ్వటం లేదు. రావు కూడా!
Courtesy: NT