ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్ కీపర్’ పురస్కారం ప్రదానం చేసింది. లక్షల మరుగుదొడ్లు కట్టించి ప్రజారోగ్యాన్ని కాపాడినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. వాస్తవానికి వాటి నిర్మాణం ఎంతవరకు జరిగిందన్న విషయమై విబేధాలున్నా, మరుగుదొడ్లు కట్టించాలని ‘స్వచ్ఛ భారత్’ ఇచ్చిన పిలుపును తప్పుపట్టలేం. కానీ ఇచ్చిన పురస్కారం భాతదేశంలోను, బయట కూడా వివాదాస్పదమైంది. మోడీకి ఈ అవార్డు ఇచ్చినందుకు అనేకమంది మానవ హక్కుల కార్యకర్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు గేట్స్ ఫౌండేషన్ని విమర్శించారు. మోడీ నాయకత్వంలో భారత దేశం భయంకరమైన అదఃపాతాళానికి, నికృష్టమైన అరాచకానికి దిగజారింది. మానవ హక్కులు హరించబడ్డాయి. ప్రజాస్వామ్యం మసకబారింది. ‘జీవితాలను కాపాడడం, సమానత్వం కోసం పోరాడడం మీ ఫౌండేషన్ లక్ష్యం. కాగా మీరు మోడీకి ఈ అవార్డు ప్రదానం చేయడం మాకు ఆందోళన కలిగిస్తున్నది’ అని నోబెల్ బహుమతి గ్రహీత మైరెడ్ మాగిరే రాశారు. ఇదే భావాన్ని యెమెన్ జర్నలిస్ట్, రాజకేయవేత్త అబ్దుల్ సలాం కర్మాన్, ఇరానియన్ న్యాయవాది, రాజకీయ కార్యకర్త షిరిన్ ఎబాడి కూడా వెలిబుచ్చారు.
ప్రమాదంలో స్వేచ్ఛ
జీవించే హక్కు, స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను సామాజిక సరకులకు మారకం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ మారకమే మానవ హక్కుల పరిరక్షకులను సైద్ధాంతికవేత్తలను కలవర పెడుతున్నది. దయాళులైన నియంతలు ఇటువంటి జిమ్మిక్కులే చేస్తుంటారు. వారు ప్రజలకు జీవించడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను సమకూర్చి వారి స్వేచ్ఛా హక్కును హరిస్తుంటారు. మోడీ ప్రభుత్వం ఈ వాక్యాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నది. ప్రభుత్వం సామాజిక వస్తువులు సమకూర్చడం పైన దృష్టి పెడుతున్నది. ఈ విధానం 2019 ఎన్నికలలో మంచి ఫలితాలను ఇచ్చింది. అదే సమయంలో మానవ హక్కుల కార్యకర్తలను ఏ ఆధారాలు చూపకుండా జైళ్లలో కుక్కుతున్నది. పౌర సమాజ సంఘాల నిధులు నిలిపి వేస్తున్నది. మూక దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. అసోంలో 19 లక్షల మంది విదేశీయులుగా ధృవీకరించబడ్డారు. బతకాలంటే మీడియా కనుసన్నలలో మెలగవలసి వస్తున్నది. ప్రధాన ప్రత్యర్థి పార్టీల నాయకులు బందీలయ్యారు. ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శించనీయకుండా సైన్యం వెంటాడుతున్నది. అన్నిటికి మించి 370వ అధికరణాన్ని నీరుగార్చడంతో సహా జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కు కాలరాయబడుతున్నది. ప్రస్తుతం మన ముందు ఒక పెను సవాలు వేలాడుతున్నది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన బృహత్తరమైన స్వతంత్ర పోరాటానికి భారతదేశ పౌరులు వారసులా కాదా? అణా పైసలకి తమ స్వాతంత్య్రాన్ని వదులుకోవాలా? అన్న ప్రశ్నకు సమాధానం అవునన్నది ఆందోళన కలిగించే అంశం. మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, తాగు నీరుకు బదులుగా స్వేచ్ఛను లాగేసుకోవడం అనైతికం. సైన్యం చుట్టుముట్టిన జమ్మూ కాశ్మీర్ ప్రజల గాయాలను మాన్పడానికి అభివృద్ధిని అంజనంగా పెడుతున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఎవరికీ అభివృద్ధి? ఆ అభివృద్ధికి చెల్లించే మూల్యం ఎంత? ఎవరు ఓడిపోయారు? ఎవరు గెలుస్తున్నారు? స్వేచ్ఛ మానవ నైజం. మనుగడకు అది తప్పనిసరి. ప్రజాస్వామిక సిద్ధాంతానికి స్వేచ్ఛ గుండెకాయ వంటిది. అందుకనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది. అదే ప్రజాస్వామ్యం ఉనికిని కాపాడుతున్నది. గొప్ప రాజనీతిజ్ఞుడు, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా, 1994 మే 10న తన అధ్యక్షోపన్యాసంలో, చరిత్రలో స్వేచ్ఛ పాత్రని క్లుప్తంగా వివరించారు. ‘స్వేచ్ఛను పాలించనివ్వండి. మానవ విజయాల జయకేతనంపై సూర్యుడు ఎన్నటికీ అస్తమించడు’ అన్నారు. మండేలాకు చరిత్ర తెలుసు. స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలు ఎంతకయినా తెగించి బ్రహ్మాండంగా పోరాడతారని ఎరుగును. ప్రజలు ఏం ఆలోచించాలి? ఏం తినాలి? ఏం చదవాలి, వినాలి, రాయాలి, మాట్లాడాలి? అని ఎదురుగా నిలిచి శాసిస్తే ప్రజాతంత్ర ఉద్యమాలు వెల్లివిరిసి స్వేచ్ఛా పతాకాన్ని చేబూనతారని చరిత్ర చెపుతున్నది. స్వేచ్ఛ ఒక ప్రాబల్యం గల, పొందికైన భావనగా 1789 ఫ్రెంచ్ విప్లవ కాలం లోని రాజకీయ చర్చలలో అవిర్భవించింది. రాజకీయాలలో ప్రముఖమైన స్థానాన్ని పొందింది. వారు వలసవాదులయినా కావచ్చు. లేదా మన పాలకులే అవవచ్చు. ఎవరైనా సరే, 18వ శతాబ్దం నుంచి ప్రజలు పోరాడుతున్నట్టుగానే మన స్వేచ్ఛ కోసం మనం పోరాడవలసిందే.
స్వతంత్రకు పెను సవాలు
ఆనాటి నుండి నేటికి మనం చాలా దూరం ప్రయాణం చేశాం. 19వ శతాబ్దం చివరి దశకం నుండి 21వ శతాబ్దం లోని మొదటి రెండు దశాబ్దాల వరకు స్వతంత్రతను పోగొట్టుకున్నవారు, అణచివేతకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మనుషులకు ఇవ్వవలసిన హక్కులు, మతం, భాష, కార్మిక వర్గం హక్కులు, మహిళలకు నిరాకరించిన హక్కులు, మైనారిటీలకు చెందాల్సిన హక్కులను రాబట్టుకునేందుకు రాజకీయ ఉద్యమాలు ప్రత్యక్షంగా మొదలెడుతున్నారు. ఈ చైతన్యం ఉవ్వెత్తున ఎగసేకొద్దీ రాజకీయ విధానాలపై రాజకీయ సిద్ధాంతాలపై ఆ ప్రభావం పడుతుంది. ఈనాడు రాజకీయ సిద్ధాంతకర్తలు కేవలం స్వతంత్రం గురించి మాట్లాడితే సరిపోదని తెలుసుకున్నారు. ఒక ఆకలిగొన్న మనిషి స్వేచ్ఛా జీవి కాలేడు. పేదరికంతో, ఆకలితో ఉన్నవాడు లేనితనం, కోరికల ఉచ్చు నుండి బయట పడలేదు. ఫలితంగా స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుంటాడు.కష్టాలు మనిషికి ఇష్టాలు లేకుండా చేస్తాయి. లేదా తీర్చుకోలేకుండా చేస్తాయి. సైద్ధాంతికంగా మనిషి తనకు ఇష్టమైన పని చెయ్యవచ్చు. తన జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలనుకుంటారో అలాగే బతకవచ్చు. కానీ ఎన్నో కారణాల వలన అతనికి నచ్చిన జీవితాన్ని అనుభవించడానికి ఆటంకం అవుతాయి. ఎప్పుడూ స్కూల్కి వెళ్లలేక పోయి ఉండవచ్చు, ఒక నవల రాయాలంటే ఎంతో కొంత సాహిత్య ప్రజ్ఞ కావాలి కదా! గ్రంథాలయాలు అందుబాటులో ఉండాలి. లేదా పుస్తకాల దుకాణాలయినా అందుబాటులో ఉండాలి. సాహిత్య చర్చాగోష్టులలో పాల్గొనగలగాలి. తన రచనలను మెచ్చుకునే వారు లేదా విమర్శించే వారు ఉండాలి. పేదరికంలో ఉన్న వ్యక్తికి ఇవన్నీ అందుబాటులో లేవంటే ఆ వ్యక్తికి రచయిత అయ్యే స్వేచ్ఛ లేనట్టే. అంటే సమాజంలో మనం ఏ విధమైన జీవితాన్ని గడపదలుచుకున్నామో అటువంటి జీవితం గడపడానికి అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉండాలి.
ప్రజాస్వామిక విధులు
తన పౌరులందరికీ స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంది. చదువు, గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన జీతం, ఆహారం, సంతృప్తికరమైన ఉద్యోగం, ఆరోగ్యం వగైరా. ఈ సామజిక అవసరాలు మనిషి స్వేచ్ఛగా బతికేందుకు ఉండాల్సిన మైలురాళ్ళు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఆహారాన్ని ఇచ్చి వారి స్వతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, వారి కలలను, వారికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలో ఎంచుకునే నిర్ణయాన్ని హరించకూడదు. మనుషులు ఇలా ఉండాలని కోరుకుంటారని, అది వారికి ఖచ్చితంగా ఇవ్వవలసిందేనని, ఇంతకంటే నువ్వు దిగజారకూడదని ప్రతి ఒక్క పాలకుడికి స్వతంత్ర హక్కు చెపుతుంది. ఈ హక్కును ఎవరూ కాలరాయకూడదు. మరుగుదొడ్లు కట్టడానికి, స్వేచ్ఛా హక్కుని హరించడానికి మధ్య వైరుధ్యం తప్పుడు సిద్ధాంతాల మీద ఆధారపడి ఏర్పడింది. మనిషికి కావలసిన సామాజిక అవసరాలు తీర్చకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. మనిషి స్వేచ్ఛను హరించడం అంటే మానవత్వాన్ని హరించడమే.
* నీరా చందోక్ (వ్యాసకర్త ఢిల్లీ యూవివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్వ ఆచార్యులు, ‘ది హిందూ‘ సౌజన్యంతో)