యువతిపై సామూహిక అత్యాచారం, దాడి
చండీగఢ్: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో దళిత యువతిపై అత్యాచారం, హత్యతో దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈనేపథ్యంలో హరియాణాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు దాడిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి తలకు బలమైన గాయాలయ్యాయి. గురుగ్రామ్ ఏసీపీ కరణ్ గోయల్ వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన యువతి శనివారం రాత్రి గురుగ్రామ్లోని సికందర్పుర్ మెట్రోస్టేషన్ వద్ద రైలు కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో యువతి వద్దకు వచ్చిన ఓ యువకుడు ఈ సమయంలో రైళ్ల రాకపోకలు ఉండవని నమ్మబలికి ఆమెను డీఎల్ఎఫ్ ఫేస్-2లోని ఓ కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ముగ్గురు యువకులు ఉన్నారు. వారిని చూసి భయపడిన యువతి అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. యువతిని అడ్డుకున్న నలుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దాడిచేసి, తలపై రాయితో మోది అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. బాధితురాలి ఏడుపులు విన్న కాంప్లెక్స్ వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించి గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా 20 నుంచి 25 యువకులే. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Courtesy Eenadu