I want to become a Maoist’ అని స్టేట్ మెంట్ ఇచ్చాడు ఈ దేశ మాజీ ప్రధాని వి.పి.సింగ్ గారు..! ఒరిస్సా లోని కళింగా నగర్ లో భూసేకరణ కు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న పోరాటాన్ని చూసి, ప్రస్తుత ఈ పరిస్థితి చూస్తుంటే నక్సలైట్ కావాలని ఉంది అని అన్నాడు…
ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి !నందమూరి తారకరామారావు కూడా నక్సలైట్లే దేశ భక్తులు అని మాట్లాడిండు. (తర్వాత ఆయన నక్సలైట్లని అణచివేసిండనుకొండి అది వేరే విషయం).
మేము అధికారంలోకి వస్తే నక్సలైట్ ఏజండానే అమలు చేస్తామని చెప్పాడు ఈ రాష్టాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు.
పై ముగ్గురూ నక్సలైట్లకు అనుకూలంగా లేదా వారికి భావజాలానికి మద్దతుగా మాట్లాడినప్పుడు ఏ సంఘం కానీ, ఏ వ్యక్తి కానీ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.
కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి, దళితుల గురించి, ఆదివాసుల గురించి, అడవి గురించి మాట్లాడుతున్నందుకు ఈ దేశంలోని మేధావులు, కవులు, రచయితలపై ‘ అర్బన్ నక్సలైట్’ అనే ముద్రవేసి కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధిస్తున్నారు.

పై వర్గాల కోసం మాట్లాడినందుకు నిన్నా మొన్న సాయిబాబా, రోనా విల్సన్, సుధా భరద్వాజ్, వీవీ తదితరులను అక్రమంగా అరెస్టు చేసిన పాలక వర్గం ఇవాళ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ Sujatha Surepally పై దాడిచేయడానికి కాచుకొని కూచుంది.
అయితే రాజ్యం తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను తన బలమైన అంగాలను ఉపయోగించి డైరెక్టుగా నిర్భందంలోకి తీసుకుంటే, కొంతమంది మేధావులను, ప్రజల్లో నిత్య సంబంధాలు ఉన్న వ్యక్తులను మాత్రం ఎవరో ఇచ్చిన ఆరోపణలను, కల్పిత కథలను ఆధారం చేసుకుని వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది.
మొన్న సాయిబాబా విషయంలో, ఆ తర్వాత JNU విషయంలో, నిన్నటి భీమా కోరేగావ్ విషయంలో నేటి శాతవాహన యూనివర్సిటీ విషయంలో జరుగుతున్నది ఒకటే కథ.. అదే స్క్రీన్ ప్లే..అదే దర్శకత్వం. అందులో పాత్రాదారులు మారుతున్నారేమో కానీ కథలన్నీ హక్కుల కార్యకర్తల చుట్టే తిరుగుతున్నాయి..!
అయితే ఏ హక్కుల కార్యకర్తల నిర్బంధం వెనుకైనా ఉండేది ముగ్గురే ముగ్గురు. ఒకటి పోలీసు వ్యవస్థ. రెండవది మీడియా.. మూడవది ఏబీవీపీ లాంటి ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు మాత్రమే (మన రాష్ట్ర అనుభవం కాస్త భిన్నం ఇక్కడ నయుం ముఠాలు, కోబ్రాలు అంటూ కొన్ని ప్రత్యేక ముఠాలు ఉన్నాయి)..
మీరు గమనించారో లేదో ఈ మధ్య అర్బన్ మావోయిస్టులు లేదా యాంటీ నేషనల్స్ పేరిట మేధావులు, హక్కుల కార్యకర్తలు, రచయితలు అరెస్ట్ కావడానికి పతక రచన చేసింది..ఒక అసత్య ఆరోపణలు చేసి పోలీసులకు కావాల్సిన భూమికను క్రియేట్ చేసింది మీడియా, ఏబీవీపీ లు మాత్రమే.
JNU లో దేశ ద్రోహం ఆరోపణల వెనుక ఏబీవీపీ ఉంటే బీమాకోరేగావ్ అరెస్టుల వెనుక ఆర్నాబ్ గోస్వామి నడుపుతున్న రిపబ్లికన్ ఛానల్ కీలకంగా పనిచేసింది…
ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడుగా ఉంటూ అదే యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో నివసిస్తున్న ప్రొ.సాయిబాబా ఇంటిపై రాళ్లతో డాడీ చేసి యూనివర్సిటీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఇల్లు కాలి చేసేలా చేసింది కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘమే. ఇప్పుడు ఆ సంఘం ప్రొ. సూరేపల్లి సుజాత పై దృష్టి సారించినట్లు గత కొంతకాలంగా తెలుస్తూనే ఉంది.
కారణం లేకపోలేదు.. ప్రొ. సూరేపల్లి సుజాత గారు గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గాలకు, మతోన్మాదులకు కంటిమీద నిద్రపోకుండా చేస్తుంది కాబట్టి. అభివృద్ధి పేరిట ఆదివాసులని నిర్వాసితులను చేస్తున్నా, ఓపెన్ కాస్ట్ పేరిట గుట్టలను తొలగిస్తున్నా, కుల గౌరవం పేరిట దళితులపై దాడులు చేస్తున్నా, మత ఉన్మాదం పేరిట మైనారిటీలను ఊచకోత కొస్తున్నా బాధితులకు అండగా నిలబడే వ్యక్తుల్లో ముందువరుసల్లో ఉండే వ్యక్తి ప్రొ. సూరేపల్లి సుజాత గారు. నాకు తెలిసి, బాలగోపాల్ మరణం తర్వాత బాధితుల పట్ల ఇంతలా కన్సర్న్ ఉండే వ్యక్తి ఈ తరంలో సుజాత గారే కనిపిస్తారు..అందుకే కాబోలు గద్దర్ గారు ఆమెకు ‘గుట్టలక్క’అని పేరు పెట్టారు.
చాలా సార్లు అనుకునే వాళ్ళం అసలు ఈమెకు అలుపన్నది రాదా..ఉదయం కాలేజీలో కనిపిస్తే సాయంత్రం అయ్యే సరికి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో బాధితుల కుటుంబాల దగ్గర కనిపిస్తుందని..అలా కనిపించడమే కాదు అవకాశం దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలెక్కి పీడిత వర్గాల తరపున తన గొంతును వినిపిస్తుంది కూడా..! అందుకే ఆమె అంటే అటు పాలక వర్గాలకు, ఇటు మతోన్మాద విద్యార్థులకు వ్యతిరేకత.
పై రెండు వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న ఆమెను అడ్డు తొలగించు కునేందుకే, అసత్య ప్రచారాలు చేస్తూ యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) లాంటి సంఘాలను ప్రోత్సహిస్తూ, నక్సలైట్లో క్యాడర్ ను నింపే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.. దీని ద్వారా ఆ వర్గాలకు రెండు లాభాలున్నాయి ఒకటి ఆమె అడ్డును తొలగించుకోవడం అయితే రెండవది విద్యార్థుల్లో ఆ సంఘం పట్ల వ్యతిరేక భావాజాలాన్ని నింపడం. అందుకే ‘ఒక రాయికి రెండు పిట్టలు అన్నట్లు’ ఒక అసత్య ఆరోపణకు తెర లేపారు.
దేశ చరిత్రలో ఏబీవీపీ దాని మాతృ సంస్థఅయిన అరెస్సెస్ వంటివి ఎంతో మంది మీదా ఇలాంటి ఆరోపణలు చేసి భౌతిక దాడులకు దిగినా అసత్యాన్ని సత్యంగా నిరూపించలేకపోయారు కానీ సమాజంలో గందరగోళం సృష్టించడంలో, ఒక వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడంలో మాత్రం విజయం సాధించారు.
ప్రజాస్వామిక వాదులుగా మనం ముందే ఈ కుట్రలను పసిగట్టగలిగితే మన కళ్లముందున్న పిడికెడు మంది బుద్ధిజీవులను రక్షించుకోవచ్చు.
Stand_With_SujathSurepally, SA David.