- విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లుపై
- విపక్షాలు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
- గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో సేవ చేసే సంస్థలు,
- మైనారిటీ సంస్థలే ఈ బిల్లు లక్ష్యమని ధ్వజం
- లోక్సభలో ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుకు ఆమోదం
- భద్రత, ఆత్మనిర్భర్కే ఈ సవరణలు: మంత్రి నిత్యానంద్రాయ్
బిల్లులో కొన్ని ముఖ్యాంశాలు
పబ్లిక్ సర్వెంట్లు (ప్రభుత్వ అధికారులు, జడ్జిలు, వర్సిటీ ఉద్యోగులు, ఎంపీలు, మంత్రులు తదితరులు) ఎలాంటి విదేశీ విరాళాలను పొందరాదు.
ఎఫ్సీఆర్ఏ కింద విదేశీ విరాళాలు పొందే సంస్థలు.. ఆ సొమ్మును వేరే సంస్థలకు (సబ్ గ్రాంట్) మళ్లించడానికి వీల్లేదు. సదరు సంస్థలకు కూడా విదేశీ విరాళాలను పొందే అనుమతులు ఉన్నా.. ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు నిధులు మళ్లించకూడదు. ఎవరి లెక్క వారిదే.
న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2020’ సోమవారం లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష సభ్యుల నిరసనల నడుమ.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడానికే మోదీ సర్కారు ఈ బిల్లును ప్రవేశపెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలపై వినిపించే నిరసన గళాలను నొక్కేయడానికి, అధికారమంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకోవడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టారని విపక్ష సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ నిధులతో జరిగే సేవా కార్యక్రమాలకు ఈ బిల్లుతో విఘాతం కలుగుతుందని.. వాటిపై ప్రభుత్వానికి అధికారం పెరుగుతుందని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఈ బిల్లు అవసరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సోమవారం ఈ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా తెలిపారు. ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్నా ఈ బిల్లులో ఆధార్ను ఎందుకు తప్పనిసరి చేశారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించగా.. ‘కొన్ని సందర్భాల్లో ఆధార్ తప్పనిసరి’ అని నిత్యానంద్రాయ్ బదులిచ్చారు. ఈ బిల్లు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తెచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ఆంటోనీ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీల నేతలు ఈ బిల్లును వ్యతిరేకించగా.. శివసేన, వైసీపీ తదితర పార్టీల సభ్యులు మద్దతిచ్చారు.
బిల్లులో ఏముందంటే..
కొత్తగా ప్రవేశ పెట్టిన బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం..
- విదేశాల నుంచి వచ్చే నిధుల్లో 50ు దాకా నిర్వహణ ఖర్చుల కింద వినియోగించుకునే వీలు ప్రస్తుతం ఉంది. దాన్ని 20ు కు తగ్గించాలని ప్రతిపాదించారు.
- విదేశీ విరాళాలు అందుకునే ఎన్జీవోలు, ఇతర సంస్థల్లోని ఆఫీసు బేరర్లు, డైరెక్టర్లు తదితర కీలకవ్యక్తుల ఆధార్ నంబర్ను.. వారు విదేశీయులైతే పాస్పోర్ట్ ప్రతిని సమర్పించడం తప్పనిసరి.
- విదేశీ విరాళాలు పొందడానికి అనుమతి ఉన్న వ్యక్తిగానీ, సంస్థగానీ నిబంధనలను ఉల్లంఘించినట్టు సమాచారం లేదా నివేదిక ఏదైనా అందినా, విచారణలో తేలినా.. సదరు వ్యక్తి/సంస్థ అప్పటికే వాడగా మిగిలిన నిధులను వాడకుండా, కొత్తగా విరాళాలను విదేశాల నుంచి అందుకోకుండా నిలిపివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే.. ఎఫ్సీఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల రిజిస్ట్రేషన్ను ప్రస్తుత చట్టం ప్రకారం 180 రోజులకు మించి సస్పెండ్ చేయడానికి వీల్లేదు. దాన్ని మరో ఆర్నెల్లకు పెంచారు.
- ప్రస్తుత చట్టంప్రకారం.. విదేశీ విరాళాలు పొందే సంస్థలు స్వచ్ఛందంగా తమ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను స్వాధీనపరచే అవకాశం లేదు. కొత్తగా ఆ అవకాశాన్ని కల్పించే ప్రతిపాదన చేశారు. ఒకవేళ సదరు సంస్థ అప్పటికే విదేశీ నిధులతో ఏవైనా ఆస్తులు (పాఠశాలలు, ఆస్పత్రులు, శిక్షణ కేంద్రాల వంటివి) సమకూర్చుకుని ఉంటే రిజిస్ట్రేషన్తోపాటు వాటిని కూడా ప్రభుత్వానికి స్వాధీనపర్చాల్సి ఉంటుంది.
- ఎఫ్సీఆర్ఏ నిబంధనలను పాటిస్తూ, ఏటా వార్షిక రిటర్నులను ఆన్లైన్లో సమర్పించే సంస్థల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ప్రస్తుతం చాలా సులభం. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ముందు ఆ సంస్థలపై విచారణ జరిపే హక్కు కేంద్రానికి ఉంటుంది.
ఇవీ అభ్యంతరాలు..
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ సవరణలన్నీ..‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నవారిని లక్ష్యంగా చేసుకున్నవే’ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, మైనారిటీలకు చెందిన సంస్థలను, గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో సామాజిక సేవ చేసే సంస్థలను లక్ష్యంగా చేసుకునే ఈ సవరణలను చేస్తున్నారని టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ తదితరులు ధ్వజమెత్తుతున్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా ఈడీ విరాజ్ పట్నాయక్ వంటి స్వచ్ఛంద సేవకులు, పౌర సమాజ నేతలు కూడా ఈ బిల్లుల ప్రతిపాదించిన సవరణలు సామాజిక సేవకు తీవ్ర విఘాతం కలిగించేవేనని మండిపడుతున్నారు. ఇక.. మానవ హక్కుల కోసం పాటుపడే ఇందిరా జైసింగ్ వంటి వారిని టార్గెట్ చేసేందుకే.. పబ్లిక్ సర్వెం ట్లు విదేశీ విరాళాలు పొందకూడదనే సవరణ తెచ్చినట్టు పీపుల్స్ వాచ్ వ్యవస్థాపకుడు హెన్రీ టిఫగ్నే మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 22,447 ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్లు అమల్లో ఉన్నాయి. 2018-19లో వాటిలో 21,915 సంస్థలు వార్షిక రిటర్నులు దాఖలు చేశాయి. అంటే, దాదాపుగా అన్ని సంస్థలూ నిబంధనలను పాటిస్తున్నాయని, వాటి గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ సవరణలు తెచ్చిందని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. బడా కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను.. ప్రజా సంక్షేమం ముసుగులో తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యల గుట్టును.. ప్రజాస్వామిక కోణంలో ఆలోచించే స్వచ్ఛంద సంస్థలే రట్టు చేస్తాయని, వాటి అడ్డు తొలగించుకునేందుకే ప్రభుత్వం ఈ సవరణలు తెచ్చిందని మండిపడ్డారు.
Courtesy Andhrajyothi