– 525మంది ఎగవేసిన సొమ్ము 2.17లక్షల కోట్లు మాఫీ !
– మోడీ సర్కార్ మొదటి ఐదేండ్లలో 5 లక్షల కోట్లకుపైగా ‘రైట్ ఆఫ్’
న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులకు వందల కోట్లు ఎగవేసిన మొండి బకాయిదారులకు, బ్యాంకుల్ని నిండాముంచే బడా కార్పొరేట్లకు మనదేశంలో మంచికాలం నడుస్తోంది. మోడీ సర్కార్-1 వచ్చీరాగానే బడా పెట్టుబడిదారులకు చెందిన వందలకోట్ల రూపాయల మొండిబకాయిలు ‘రైట్ ఆఫ్’ (రుణ ఖాతా కొట్టేయటం) అయ్యాయి. మొదటి నాలుగేండ్లలో 525 మంది బడా పెట్టుబడిదారుల రూ.2.17 లక్షలకోట్లుగా రైట్ ఆఫ్ కాగా, మొత్తం ఐదేండ్లలో రైట్ ఆఫ్ అయిన మొండి బకాయిల విలువ రూ.5.56 లక్షలకోట్లుగా ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తాజాగా వెలువరించిన వార్తా కథనం ఇలా ఉంది, మోడీ సర్కార్ మొదటి నాలుగేండ్లలో 525 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.2.17 లక్షల కోట్లు ‘రైట్ ఆఫ్’ చేసినట్టుగా (సెప్టెంబరు 2014-మార్చి 2018) తేలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రైట్ ఆఫ్లు మరింత పెరిగిన సంగతి సమాచార హక్కు దరఖాస్తుకు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టంగా ఉంది. ఐదో ఏడాది (మార్చి 2018-మార్చి 2019)లో రైట్ ఆఫ్ చేసిన మొండి బకాయిల విలువ రూ.2.54 లక్షల కోట్లుగా ఉంది. దీంతో ఐదేండ్ల పాలనాకాలంలో రైట్ ఆఫ్ అయిన మొండి బకాయిల విలువ రూ.5.56లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిల విలువ రూ.11లక్షలు దాటింది.
రూ.100కోట్లు ఎగవేసినవారు 109 మంది
రైట్ ఆఫ్ అయినవారిలో, ప్రభుత్వ బ్యాంకులకు రూ.100కోట్లు ఆపైన ఎగవేసిన మొండి బకాయిదార్లు 109 మంది ఉన్నారు. రూ.40,798కోట్లు రుణాల్ని మాఫీ చేశారు. మార్చి, 2016 ఈ కేటగిరి ఎగవేతదారుల సంఖ్య 199కి పెరిగింది. రైట్ ఆఫ్ మొత్తం రూ.69,976కోట్లకు చేరింది. నోట్లరద్దు జరిగిన 2016-17 ఏడాదిలో రూ.100కోట్లు ఎగవేసిన 343 మందికి చెందిన రుణ ఖాతాల్ని మాఫీ చేశారు. ఇలా మార్చి 31, 2018నాటికి మొత్తం 525మంది రుణ ఖాతాలు రైట్ ఆఫ్ అయ్యాయి. వీటి మొత్తం రూ.2.17 లక్షల కోట్లుగా ఉందని లెక్కతేలింది.
95 శాతం బకాయిలు ప్రభుత్వ బ్యాంకులవే
లక్షల కోట్ల రూపాయల రుణ ఖాతాల కొట్టివేతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీసీ బ్యాంకులున్నాయి. మొండి బకాయిల్లో రూ.500కోట్లకు పైగా ఎగవేసినవారు 88 మంది ఉన్నారు. వీరు ఎగవేసిన మొత్తం రూ.లక్షా ఏడు వేల కోట్లు ఉందని తేలింది. సగటున ఒక్కో డిఫాల్టర్ ఎగవేసిన మొత్తం రూ.1220 కోట్లు. రూ.100కోట్లకుపైగా ఎగవేసిన వారు 220 మంది ఉన్నారనీ, వీరు ఎగవేసిన మొత్తం రూ.76,600కోట్లు ఉందని సమాచారం.
Courtesy NavaTelangana..