రిజర్వు బ్యాంకు నుండి బదిలీచేసుకుంటున్న రిజర్వు నిల్వలు సంక్షోభ కాలంలో ప్రజల ప్రయోజనాలకు కాక, కార్పొరేట్లకు బదిలీ అవుతున్నాయి. కార్పొరేట్ పన్ను తగ్గించడం వల్ల దేశం ఆర్థిక మాంద్యం నుండి బయట పడకపోగా
కేంద్ర ప్రభుత్వం పన్ను ఆదాయాన్ని భారీగా కోల్పోతుంది. 2019–20 బడ్జెట్లో నిర్దేశించుకున్న పన్ను ఆదాయం లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమవుతుంది. గత ఐదేళ్ళుగా సంపన్నుల నుండి వసూలు చేసే ప్రత్యక్ష పన్నుల వాటా దిగజారుతూ, ప్రజలపై పరోక్ష పన్నులు పెరుగుతున్నాయి.
కార్పొరేటు పన్ను తగ్గించి పారిశ్రామిక వేత్తలకు మోదీ ప్రభుత్వం లక్షా 45 వేల కోట్లు లాభం చేకూర్చింది. ప్రస్తుతం సర్ఛార్జీ, సెస్లతో కలిపి 34.94 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 25.17 శాతానికి, ఏ విధమైన ప్రోత్సాహాలు పొందని కంపెనీలకు 22 శాతానికి కుదించారు. ఆక్టోబర్ ఒకటి తరువాత నెలకొల్పే వస్తుతయారీ పరిశ్రమలకు కార్పొరేట్ పన్నును 15 శాతానికి తగ్గించారు. స్టాక్మార్కెట్లో షేర్లు తిరిగి కొనుగోలు (బైబ్యాక్) ప్రకటించిన సంస్థల లావాదేవీలపై పన్ను రద్దు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి దారులకు డెరివేటివ్స్తో పాటు సెక్యూరిటీల్ని విక్రయించగా వచ్చే మూలధన లాభాలపై సర్చార్జీలను కూడా రద్దు చేశారు. అలాగే ప్రత్యమ్నాయ పన్నులో కూడా 3 శాతం మినహాయించారు. వారం క్రితం ఎగుమతి రంగానికి, గృహ, రియల్ ఎస్టేట్ రంగాలకు సుమారు 70 వేల కోట్ల మేర రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
గడిచిన 120 రోజుల్లో మోదీ-2 ప్రభుత్వం గత ఏడాది కన్నా 33 శాతం అదనంగా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు కొరత పేరిట బ్యాంకేతర ద్రవ్య సంస్థలను ఆదుకోవడం కోసం రూ.70 వేల కోట్లు మూలధన నిధులను బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చింది. తొమ్మిది నెలల కాలంలో వడ్డీ రేటును ఒకశాతం తగ్గించింది. 2014 నుండి నేటి వరకు ఐదు బడ్జెట్లలో సుమారు రూ.5.-76 లక్షల కోట్లు సంపన్నులకు ప్రభుత్వం రాయితీలిచ్చింది. అలాగే ప్రభుత్వ బ్యాంకులకు బడాబాబులు ఎగ్గొట్టిన మరో ఐదు లక్షల కోట్లను కూడా రద్దు చేసి ప్రభుత్వ బ్యాంకులను నష్టాల పాల్జేసింది. మరోవైపు విలీనాల పేర ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు తెరదీయబోతున్నారు. రిజర్వు బ్యాంకు నుండి బదిలీచేసుకుంటున్న రూ.1,76,000 వేల కోట్ల రిజర్వు నిల్వలు సంక్షోభ కాలంలో ప్రజల ప్రయోజనాలకు కాక, కార్పొరేట్లకు బదిలీ అవుతున్నాయి. కార్పొరేట్లకు ఇస్తున్న ఈ రాయితీలపై ప్రభుత్వం విచిత్రమైన వాదన చేస్తున్నది. వీటివల్ల ప్రయోజనం పొందిన సంస్థలు తిరిగి ఈ నిధులను ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల రూపంలో పెడతాయనీ, దీనివల్ల వస్తువులకు డిమాండ్ పెరిగి కొనుగోళ్ళు పెరుగుతాయనీ, తద్వారా ప్రస్తుత ఆర్థిక మాంద్యాన్ని నివారించవచ్చునని ప్రభుత్వం అంటున్నది. కొనుగోళ్లు పెరగడం ద్వారా ప్రభుత్వం పన్ను రాయితీల రూపంలో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి ప్రత్యామ్నాయ పన్ను రూపేణా పొందుతుందని అంటున్నారు. ఇది కుట్రతో కూడిన వాదన. ఆర్థిక మాంద్యాన్ని ఉపయోగించుకొని సంపన్నులకు లక్షల కోట్లు దోచిపెట్టడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. కార్పొరేట్ పన్ను భారీగా తగ్గించడం వల్ల దేశం ఆర్థిక మాంద్యం నుండి బయట పడకపోగా కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను ఆదాయం కోల్పోతుంది. రూ. 27.86 లక్షల కోట్లతో ప్రకటించిన 2019–-20 కేంద్ర బడ్జెట్లో రూ. 16.5 లక్షల కోట్లు పన్నుల ఆదాయంగా పేర్కొన్నారు. ప్రతినెలా కనీసం రూ. లక్షన్నర కోట్ల పన్నులు వసూలు అయితేనే బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకోగలం. గత రెండు నెలల్లో రూ.90,000కోట్లు చొప్పున మాత్రమే పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. ఆర్థిక మందగమనం రోజు రోజుకి పెరగడంతో పన్ను ఆదాయం కూడా పడిపోతున్నది. ఇప్పుడు కార్పొరేట్లకు భారీగా పన్ను రాయితీలివ్వడంతో పన్ను ఆదాయానికి మరింత కోత పడుతుంది.
మోదీ ఐదేళ్ళ పాలనలో సంపన్నుల నుండి వసూలు చేసే ప్రత్యక్ష పన్నుల వాటా బాగా దిగజారుతూ, ప్రజలపై పరోక్ష పన్నులు పెరుగుతున్నాయి. 2013-–14కి పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 56.-26 శాతం. అది 2018–-19కి 53.37 శాతానికి పడిపోయింది. 2016-–17లో అయితే 49.65 శాతానికి పరిమితమయ్యింది. అలాగే జిడిపిలో కస్టమ్స్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం 1.5 శాతం ఉంటే 2018-–19కి 0.6 శాతానికి కోతపడింది. కార్పోరేట్ పన్ను అయితే 1997లో 38.05 శాతంగా ఉండేది. అది నేడు ఏకంగా 25 శాతానికి తగ్గింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడం వల్ల ద్రవ్యలోటు పెరుగుతుంది. కార్పోరేట్ రాయితీల వల్ల ద్రవ్యలోటు సుమారు 4.1 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఆదాయం పడిపోయే కొద్దీ ద్రవ్యలోటు పెరుగుతుంది. పన్నుల ద్వారా కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం రెండుమార్గాల ద్వారా పూడ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. మొదటిది– అప్పుల ద్వారా అదనంగా నిధులు సమకూర్చుకోవడం. ఈ బడ్జెట్లో సుమారు రూ. 7 లక్షల కోట్లు అప్పు తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఇది సాధ్యం కాదు. ద్రవ్యలోటు 3 శాతం వరకే ఉండాలనే నిబంధన ఉంది కనుక అదనపు అప్పుకు ఎఫ్ఆర్బిఎమ్ చట్టం అంగీకరించదు. రెండో మార్గం: ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం లేదా వాటి షేర్లను ఉపసంహరించడం. 2019–-20 బడ్జెట్లో ఈ అమ్మకాల ద్వారా లక్షా 5 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఈ ఐదేళ్ళలో సుమారు రూ.3.05 లక్షల కోట్లు షేర్ల అమ్మి బడ్జెట్ లోటును పూడ్చుకున్నారు. ఇప్పుడు మరిన్ని ప్రభుత్వరంగ సంస్థల షేర్ల అమ్మకాలకు ప్రభుత్వం పాల్పడుతుందనడంలో అనుమానం లేదు. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం. ద్రవ్యలోటును తగ్గించుకోవటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మరొక మార్గం ప్రభుత్వ వ్యయాన్ని కుదించడం. అభివృద్ధికి, సామాన్యుల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో భారీగా కోత పెడతారు. ఇది ప్రజలను మరింత కష్టాల పాలు జేస్తుంది. నేడు దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కడానికి తీసుకుంటున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగతీస్తాయి. ప్రజల జీవనోపాధులను ధ్వంసం చేస్తాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, ఆదాయాలు పడిపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, వ్యవసాయరంగం క్షీణించటం వల్ల మన దేశంలో నేడు ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. శ్రమ జీవులకు ఆదాయాలు పెరిగే చర్యలు తీసుకుంటేనే దీనికి పరిష్కారం సాధ్యమవుతుంది.
ఆర్థిక వేత్తలు సూచిస్తున్న ప్రత్యమ్నాయ విధానాలను ప్రభుత్వం అమలుచేయాలి. ప్రజలను ఆకలి బాధల నుండి విముక్తి చెయ్యాలి. వీరికి కొనుగోలు శక్తి కల్పించాలి. గోదాముల్లో మూలుగుతున్న 713లక్షల టన్నుల ఆహార ధాన్యాలను కుటుంబానికి 35 కిలోలు చొప్పున పంచాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చెయ్యాలి. రైతుల ఉత్పత్తి వ్యయానికి 50శాతం పెంచి కనీస మద్దతు ధర పంటకు కల్పించాలి. ఉపాధి హామీని 200రోజులకి పెంచడం, కార్మికుల కనీస వేతనం నెలకి 18వేలు పెంచడం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలు విరమించడం, విద్య, వైద్య రంగానికి నిధులు పెంచడం, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు పెంచడం వంటి చర్యలు చేపట్టినప్పుడే నేటి ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని రక్షించగలం.
డా. బి గంగారావ్