అమెరికాలో తలకిందుల వ్యవహారం సాగుతున్నట్టు అనిపిస్తోంది. కరోనా వైరస్ అక్కడ స్వైరవిహారం చేస్తోంది. అది ఇప్పుడిప్పుడే అదుపులోకి వచ్చేట్టు కనపడడం లేదు. ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయింది. ఏకంగా 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. సమాజంలో పురివిప్పిన జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాదిమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. చైనాతో సంబంధాలు పూర్తిగా దిగజారాయి. తత్వవేత్త కార్నెల్ వెస్ట్ చెప్పినట్టు అమెరికా ఒక విఫలమైన సామాజిక ప్రయోగానికి ప్రతీకగా ఉండే అన్ని లక్షణాలనూ కనపరుస్తున్నది. అయినప్పటికీ అమెరికన్ స్టాక్ మార్కెట్లో కనపడుతున్న స్టాక్మార్కెట్ వృద్ధి ఒక వాస్తవం. అమెరికన్ స్టాక్మార్కెట్ సూచిక ‘నాస్డాక్’ మార్చి 23 నుంచి 40 శాతం పైగా పెరుగుదలను నమోదు చేసింది. ఒక వ్యాఖ్యాత ”ఆల్ టైం రికార్డు పెరుగుదలకు చేరువలో ఉన్నాం” అని అన్నాడు.
వాస్తవ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఒక కొలమానంగా స్టాక్ మార్కెట్ ఉంటుందన్న భ్రమ దీంతో మొత్తానికి కరిగిపోయింది. కొంతమంది ఇప్పటికీ ఇందుకు ఒప్పుకోకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ ఒక పక్క దిగజా రుతూ వుంటే ఇంకొక పక్క స్టాక్మార్కెట్ సూచీ పెరగడం తాత్కాలికంగా కనిపించే ఒక పెడలక్షణం మాత్రమేనని, త్వరలో గనుక వాస్తవ ఆర్థిక వ్యవస్థ కోలుకుని పెరగనట్టైతే ఈ స్టాక్ మార్కెట్ బుడగ పేలిపోవడం ఖాయమని వారంటారు. అయితే మనం ప్రస్తుతం నయా ఉడారవాద కాలంలో ఉన్నామని, ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం చెలాయించడం ఈ కాలపు ప్రధాన లక్షణమని వారు గుర్తించడంలేదు.
నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ ద్రవ్యలోటును అదుపులో ఉంచుతారు. మరోవైపు పెట్టుబడ ిదారులపై విధించే పన్నులనూ పెరగకుండా కట్టడి చేస్తారు. అంతకు ముందునాటి కార్పొరేట్ పన్నులను సైతం తగ్గి స్తారు. మాంద్యం గనుక ఏర్పడితే దానిని అధిగమించే ద్రవ్య విధానం అంటూ ఏదీ ఉండదు (అంటే అదనంగా సంపన్నులపై పన్నులు వేసి అదనపు ఆదాయాన్ని రాబట్టడం వంటివి). దాంతో ఆ మాంద్యం నుండి బైట పడడానికి డబ్బు చెలామణీ విధానమే పాలకులకు మార్గాంతరం అవుతుంది. పైగా ఆ డబ్బు చెలామణీ విధానాన్ని ఒక వింతైన కొత్త పద్ధతిలో అమలు చేస్తారు.
మన అర్థశాస్త్ర పాఠ్య పుస్తకాలలో ఈ మాంద్యం పరిస్థితులలో ద్రవ్య చెలామణీ విధానం ఎలా ఉండాలని చెప్తారు? మాంద్యం సమయంలో దానిని అధిగమించడానికి సాధారణంగా అనుసరించే డబ్బు చెలామణీ విధానంలో వివిధ పద్ధతుల ద్వారా పరిశ్రమలకు అప్పు తక్కువ వడ్డీకి దొరికేటట్టు చూస్తారు. అంతవరకూ అధిక వడ్డీల కారణంగా నష్టాలు వస్తాయని పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని వారంతా వడ్డీలు తగ్గాయి గనుక ఇప్పుడు పెట్టుబడులు పెడతారు. పరికరాలు కొనుగోలు చేస్తారు. నిర్మాణాలు చేపడతారు. మరోవైపు తక్కువ వడ్డీకి రుణాలు దొరుకుతున్నందున వినిమయ వస్తువులను కొనుగోలు చేసేవారు మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఒకవైపు పెట్టుబడులు పెరిగినందున ఉపాధీ పెరుగుతుంది, మరోవైపు కొనుగోలు పెరిగి డిమాండూ పెరుగుతుంది. ఫలితంగా మాంద్యం నుండి బైట పడవచ్చు. మన అర్థశాస్త్ర పాఠ్య గ్రంథాలలో చెప్పేది ఇదే.
అయితే, మాంద్యం ఏర్పడడానికి ప్రధాన కారణం ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండు లేకపోవడం. కొనుగోలుదారుల వద్ద సరుకులను కొనే శక్తి లేకపోతే చౌకగా రుణాలను ఇచ్చినంత మాత్రాన సరుకులను కొనడానికి అందరూ ముందుకు రారు. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నప్పుడు వారంతా ఈ చౌక రుణాలను పొందనూ లేరు, మార్కెట్లో నెలకొన్న మాంద్యం తగ్గనూ తగ్గదు. అందుచేత పాఠ్యపుస్తకాలలో చెప్పేదానికి, వాస్తవంగా జరిగేదానికి పొంతన లేదు.
అయితే నయా ఉదారవాద దశలో జరిగేది వేరు. ఇక్కడ రిజర్వు బ్యాంకు అమలు చేసే డబ్బు చెలామణీ విధానం పాఠ్య పుస్తకాల్లో చెప్పినట్టు మార్కెట్ లోకి డబ్బును ఏ విధంగా పంపాలన్న అంశంపై దృష్టి పెట్టదు. షేర్ల ధరలను నిలబెట్ట డానికి, అవి నిరంతరం పెరుగతూ వుండేలా చూడడానికి ప్రాధాన్యతనిస్తుంది.
‘అమెరికన్ ఫెడరల్ రిజర్వు’కు అధ్యక్షుడిగా అలన్ గ్రీన్స్పాన్ ఉన్న కాలంలో సాఫ్ట్వేర్ రంగ కంపెనీల షేర్ల విలువలు పతనం అయినప్పుడు (దీనినే ‘డాట్ కామ్ బబుల్’ అంటారు) వడ్డీ రేట్లు తగ్గించారు. ఆ కాలంలో అనుసరించిన డబ్బు చెలామణీ విధానం ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుదల మొదలైంది (హౌసింగ్ బబుల్). అంతే తప్ప మాంద్యానికి మూల కారణం మాత్రం పరిష్కారం కాలేదు. ఆ మాంద్యం పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు రిజర్వుబ్యాంకులు అనుసరించే డబ్బు చెలామణీ విధానం స్టాక్ మార్కెట్ పతనం కాకుండా చూడడానికే ప్రాధాన్యతనిస్తుంది. ఆయా కంపెనీలు వాస్తవంగా మార్కెట్లో లాభాలను ఆర్జించగలుగుతున్నాయా లేవా అన్నదానితో నిమిత్తం లేకుండానే వాటి షేర్లు పెరుగుతూ వుండేలా చూస్తుంది. అంటే వాస్తవ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల లేదా తరుగుదలతో నిమిత్తం లేకుండా ద్రవ్య పెట్టుబడి వృద్ధి చెందుతూపోయేలా డబ్బు చెలామణీ విధానం ఉంటుంది (మన ఆర్థిక మంత్రి ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలేవీ లేకుండా అత్యధిక భాగం కార్పొరేట్లకే కట్టబెట్టడం చూస్తే పై విషయం స్పష్టం అవుతుంది).
ద్రవ్య పెట్టుబడి పూర్తిగా పైచేయి సాధించిందన్న వాస్తవం దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను దాదాపు సున్నాకు తెచ్చింది. గవర్నమెంటు బాండ్లను కొనడమే గాక కార్పొరేట్లకు నేరుగా రుణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే ఆ కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాల్లో నిలదొక్కుకుంటున్నాయా లేక దెబ్బ తింటున్నాయా అన్నదానితో నిమిత్తం లేకుండానే వాటికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు రుణం పేరుతో రిజర్వుబ్యాంకు మద్దతు ఇస్తూ వుంటుందన్న మాట. అటువంటప్పుడు ఆ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉంటుంది? ఆ విధంగా రిజర్వుబ్యాంకు వాస్తవ ఆర్థిక వ్యవస్థ ఉత్థాన, పతనాలతో నిమిత్తం లేకుండా స్టాక్ మార్కెట్లో షేర్లు మాత్రం ఒక స్థాయికి దిగువకు పడిపోకుండా గ్యారంటీ చేస్తోంది.
దీని పర్యవసానాలేమిటి? మొదటిది-షేర్ మార్కెట్లో పెరుగుదలను గ్యారంటీ చేసినందువలన వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పెరుగుదలా ఉండదు. కార్పొరేట్లకు ఎంత చౌకగా రుణాలిచ్చినా అవి ఆ డబ్బును పెట్టి ఉత్పత్తిని పెంచేందుకు ముందుకు రావు. ప్రజల కొనుగోలుశక్తి పెరగకుండా ఉత్పత్తి పెంచితే అవి అమ్ముడుపోవు. పైగా తమ అప్పుల వాయిదాలను చెల్లించడానికి మరింత అప్పు చేసే సంస్థలు పెట్టుబడినెలా పెంచగలవు?
అదే విధంగా, ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయివున్న వినిమయదారులు చౌక రుణాలు లభించినంత మాత్రాన తమ వినిమయాన్ని అదనంగా పెంచివేయరు. మహా అయితే ప్రస్తుతం ఏ మోతాదులో ఖర్చు చేస్తున్నారో, అదే స్థాయిని కొనసాగిస్తారు. దానివలన మార్కెట్లో డిమాండ్ అదనంగా ఏమీ పెరగదు. అందువలన మాంద్యం లోకి ఆర్థిక వ్యవస్థ కూరుకుపోతూనే వుంటుంది. ప్రస్తుతం కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఈ సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థకు కొద్దిపాటి ఊరటనివ్వడం జరుగుతుంది. కాని ఆ తర్వాత కూడా మొత్తంగా డిమాండ్ ను పెంచే దిశగా ప్రభుత్వం ఆర్థిక చర్యలను తీసుకోవాలి.
రెండవ పర్యవసానం-ఒకసారి అమెరికన్ ఫెడరల్ రిజర్వు ఈ విధంగా తన దేశ స్టాక్ మార్కెట్ లో పెరుగుదలను గ్యారంటీ చేశాక ఇక తక్కిన అన్ని దేశాలూ అదే మార్గాన నడవక తప్పదు. ఒకవేళ భారతదేశంలో గనుక ప్రభుత్వం స్టాక్ మార్కెట్ను పట్టించుకోకపోతే, ఇక్కడ షేర్ల విలువలు గనుక పడిపోవడం మొదలుబెడితే, ఇక్కడి నుంచి ద్రవ్య పెట్టుబడి బైటకు వెంటనే పారిపోతుంది. ఇక ఈ తర్వాత మన విదేశీ చెల్లింపుల లోటు పెరిగిపోయి మన ఆర్థిక వ్యవస్థ మరింతగా ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. అంటే మన రిజర్వుబ్యాంకు విదేశీ నిల్వలను తగ్గిపోకుండా చూసుకొవడం, రూపాయి విలువ పడిపోకుండా చూసుకోవడం మాత్రమే కాదు, మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలి.
అంటే వాస్తవంగా దేవ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నా, దానిని సరిచేసేందుకు జోక్యం కల్పించుకోవడం బదులు, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, దాని తాబేదార్లుగా ఉన్న దేశీయ కార్పొరేట్లు దెబ్బతినకుండా చూసుకోవడమే మన రిజర్వు బ్యాంకు ప్రథమ, ప్రధాన కర్తవ్యంగా ఉంటుందన్న మాట. ఈ వైఖరి వలన అతి దారుణంగా దెబ్బ తినేది శ్రామిక ప్రజలే. నిరుద్యోగం మరింతగా పెరిగిపోయి, పేదరికమూ పెరిగిపోతుంది. దీనిని నివారించేలా ప్రభుత్వం చర్యలను తీసుకోవాలని, మరింత ఎక్కువగా సంక్షేమ చర్యలను తీసుకోవాలని శ్రామిక వర్గం డిమాండు చేయాలి. అందుకోసం ఉద్యమించాలి. అమెరికా లోను, ఇతర దేశాలలోను ఇప్పటికే ప్రజలు సమానత్వాన్ని కోరుతూ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. మన దేశంలో కూడా అటువంటి పోరాటాలు మొదలవడానికి ఎంతోకాలం పట్టదు. ఇలాగే కార్పొరేట్ల సేవలో ఎల్లకాలమూ తరించవచ్చని గనుక మోడీ ప్రభుత్వం అనుకుంటూ వుంటే అది దాని వెర్రితనమే అవుతుంది.
ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)
Courtesy Prajasakti