చివరి సెమిస్టర్ పరీక్షలు జరపాల్సిందే
విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం
యూజీసీ మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీం
న్యూఢిల్లీ, ఆగస్టు 28 : వివిధ కోర్సుల్లో చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన తరువాతే పైతరగతులకు పంపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు 30 నుంచి చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరపాలన్న యూజీసీ మార్గదర్శకాలను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ సమర్థించింది.
‘పరీక్షలు రాయకుండా డిగ్రీ ఇవ్వరాదు. జేఈఈ, నీట్ లాంటి పరీక్షలు సైతం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. కొవిడ్ ఉధృతి కారణంగా యూజీసీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాకే జూలైలో సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని మేం సమర్థిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు అన్నింటినీ అందులో పరిగణనలోకి తీసుకున్నారు. ఆఖరి సెమిస్టర్ పరీక్ష రాశాకే డిగ్రీ. అంతకుముందు బ్యాక్లాగ్ ఉన్నవారి విషయంలో యూజీసీ నిర్ణయించిన ప్రకారం విడిగా పరీక్షలు జరపాలి. ఒకవేళ పరీక్షల నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉన్నపుడు రాష్ట్రాల విపత్తు నిర్వహణ అధికారుల సూచనల మేరకు వెళ్లాలి. అవసరమైతే రాష్ట్రాలు – ఈ పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా యూజీసీని సంప్రదించవచ్చు.