మహబూబ్ నగర్: తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు పోరుబాట పట్టారు. ఉద్యోగ భద్రత కరువడంతో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకుంటే మార్చి 12 నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. ప్రతీ కార్మికుడికి 40 రోజుల పని కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చింది.
ప్రతి పంచాయతీ పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేయించిన పని దినాల ఆధారంగా వారిని మెరిట్ లిస్టు ఒకటి, రెండు, మూడు విభాగాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రెండో జాబితాలోని వారి కాంట్రాక్టులు పునరుద్ధరించకుండా సీనియర్ మేట్లుగా కొనసాగిస్తూ, మూడో జాబితాలో ఉన్న వారిని తొలగించాలని నిర్ణయించింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలోని 263 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వలసలు నివారించడానికి ప్రతిఒక్కరికి స్థానికంగా పని కల్పించాలని 2005లో కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు జాబ్ కార్డులు ఇచ్చింది. గ్రామాల్లో పనులు గుర్తించి కోరిన వారికి పని కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. అయితే ఇటీవల ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మార్చి 11న ఛలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.