ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వికారాబాద్ జిల్లాలో యువతి ఆత్మహత్య
గోదావరిఖని/బషీరాబాద్ : ప్రేమానురాగాలు పంచిన తండ్రి ఇక లేడని, తిరిగి రాడని తెలిసి ఆ కూతురి గుండె ద్రవించింది. నాన్న లేని జీవితం ఇక వ్యర్థమని భావించిన ఆమె నదిలోకి దూకింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన అరవెల్లి వసంతానికి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆయన సోమవారం రోడ్డు ప్రమాదానికి గురై.. మంగళవారం కన్నుమూశారు. కుటుంబీకులంతా వసంతం భౌతికకాయంతో వాహనాల్లో చెన్నూరుకు బయలుదేరారు.
గోదావరిఖని వద్ద గోదావరి వంతెన పైకి రాగానే.. వసంతం కూతుళ్లలో ఒకరైన సాయిప్రియ(25) వాంతి వచ్చేలా ఉందని చెప్పి తాము ప్రయాణిస్తున్న కారును ఆపించింది. ఆ వెంటనే ఆమె దిగి నదిలోకి దూకేసింది. జాలర్లు గాలించినా.. సాయిప్రియ ఆచూకీ లభించలేదు. సాయిప్రియ రెండేళ్లుగా కోటపల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కాగా, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాల్గ గ్రామంలో అనుష(17) కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Courtesy Andhrajyothi