– 10 రాష్ట్రాల్లో రైతులకిచ్చిన వాగ్దానం విలువ రూ.2.36లక్షల కోట్లు
– బడ్జెట్లో కేటాయింపులు రూ.1.12 లక్షల కోట్లు : ఆర్బీఐ
– సగం కూడా దాటని పాలకుల హామీలు
– వాస్తవ కేటాయింపులు 47శాతమే..
ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి పలు రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక తూతూమంత్రంగా హడావిడి చేసి చేతులు దులుపుకుంటు న్నాయి. ఇందుకు రైతు రుణమాఫీ పథకమే ప్రత్యక్ష ఉదాహరణ. 2014 తర్వాత 10 రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు ఆయా పార్టీలు చేసిన రైతు రుణమాఫీ వాగ్దానం విలువ రూ.2,36,460కోట్లు. అధికారంలోకి వచ్చాక పథకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిపిన బడ్జెట్ వాస్తవ కేటాయింపులు రూ.1,12,890కోట్లు మాత్రమే. అంటే 47శాతం మంది రైతులకు సరిపోయే నిధులు కేటాయించారని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‘ గణాంకాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ : రైతు రుణ మాఫీ ప్రకటనతో అధికారంలోకి వచ్చాం కాబట్టి, ఎంతో కొంత ఇవ్వకతప్పదన్న ధోరణిని ఆయా రాష్ట్రాల్లో పాలకులు వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఒకమాట, తర్వాత మరోమాట చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయి. రైతు రుణమాఫీపై ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలే ఇందుకు సాక్ష్యం. 2014 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ 10 రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ (బడ్జెట్ వాస్తవ అంచనాలు) కోసం రూ. 1,12,890కోట్లు కేటాయించారని లెక్కతేల్చింది. దీనినిబట్టి పథకానికి అవసరమయ్యే మొత్తంలో 47శాతం మాత్రమే బడ్జెట్ వాస్తవ కేటాయింపులు జరిగినట్టు కాగితాలపై కనపడుతోంది. ఈఏడాది రుణమాఫీకి కేటాయించినమొత్తం (రైతులకు ఇస్తామని చెబుతున్నవి) కలుపుకుంటేనే అది రూ.1,49,790కోట్లు అయ్యింది. దీనిని పరిగణనలోకి తీసుకున్నా పథకం అమలు 63శాతంగా ఉండబోతోంది. మొత్తం రూ.2,36,460కోట్లలో సగం నిధులు వ్యయం చేసిన దాఖలాలు కనపడటం లేదు. ఆయా రాష్ట్రాల వాస్తవ వ్యయాలు లెక్కలోకి తీసుకొని ఆర్బీఐ ఈ నివేదిక విడుదలచేసింది. అయితే కేటాయించిన నిధులన్నీ పథకం కోసం వ్యయం చేసినట్టు అర్థం చేసుకోరాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు ఈ ఏడాది కర్నాటకలో రైతు రుణ మాఫీకి కేటాయించాల్సిన నిధులు రూ.15,880కోట్లు. కానీ సీఎం కుమారస్వామి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.5450 కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ కేటాయింపులు, వాస్తవ
లెక్కలు ఇదేమాదిరిగా ఉన్నాయి.
– అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణమాఫీ అమలుజేస్తామని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది.
– మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఇస్తామన్న మొత్తం రూ.54,500కోట్లు. కానీ ఇప్పటివరకూ బడ్జెట్లో కేటాయించినది 19,240కోట్లు. అంటే 35శాతం అన్నమాట.
– కర్నాటకలో చేసిన ఎన్నికల వాగ్దానం విలువ (2018 ఏడాది) రూ.44వేల కోట్లు. గత రెండు బడ్జెట్లలో కలిపి చేసిన కేటాయింపులు రూ.28,530 కోట్లు.
– పంజాబ్లో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి, రూ.7620కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
– యూపీలో బీజేపీ రూ.36,360 కోట్లు రైతు రుణమాఫీలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ పథకం కోసం చేసిన కేటాయింపులు రూ.27,200కోట్లు.
Tags-india, Govt, 10, States, Farmers, Debt, relief, budget,allocation, only, half, agriculture, distress, Farmers, suicides
రాష్ట్రాలవారీగా 2014 నుంచి రైతు రుణమాఫీ మొత్తం
రాష్ట్రం ప్రకటించిన ఏడాది ఎన్నికల వాగ్దానం బడ్జెట్లో
(రూ.కోట్లలో) కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ 2014-15 24,000 53శాతం
తెలంగాణ 2014-15 17,000 85శాతం
తమిళనాడు 2016-17 5,280 99శాతం
మహారాష్ట్ర 2017-18 34,020 75శాతం
ఉత్తరప్రదేశ్ 2017-18 36,360 75శాతం
పంజాబ్ 2017-18 10,000 76శాతం
కర్నాటక 2018-19 44,000 65శాతం
రాజస్థాన్ 2018-19 18,000 35శాతం
మధ్యప్రదేశ్ 2018-19 36,500 36శాతం
ఛత్తీస్గఢ్ 2018-19 6,100 151శాతం
మొత్తం 236,460 సగటు 63శాతం
Courtesy Nava telangana…