కేంద్ర ప్రభుత్వం రూపొందించి… ప్రజాభిప్రాయానికి పెట్టిన…83 పేజీల పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ (ఇఐఎ)-2020 ముసాయిదాపై తీవ్ర వ్యతిరేకత వక్తమవుతున్నది. ‘ఇఐఎ నోటిఫికేషన్-2006’ స్థానంలో తీసుకు వస్తున్న ‘ఇఐఎ 2020’లో ప్రతిపాదించిన మార్పులే ఈ వ్యతిరేకతకు కారణం. ఒకటి-పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణ ఉల్లంఘనలకు పూనుకోవడానికి ఇంతవరకు ఉన్న నియంత్రణ ప్రక్రియను ఎత్తివేసి ఎనలేని స్వేచ్ఛనివ్వడం. రెండు-పర్యావరణం, పరిశ్రమలు, ప్రాజెక్టులకు సంబంధించిన ఒక పబ్లిక్ పాలసీ రూపకల్పనలో ఇంతవరకు అరకొరగానైనా ఉన్న ప్రజా భాగస్వామ్యాన్ని లేకుండా చేయడం వల్ల ఇఐఎ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి సామాజిక నియంత్రణలో ఉన్న సహజ వనరులను బలవంతంగా పరిశ్రమాధిపతులు, ప్రాజెక్టుల ప్రతిపాదకుల చేతులలో పెట్టి…దాని ప్రభావానికి గురయ్యే ప్రజల జీవించే హక్కును కాలరాయడానికి ఒక మంచి పరికరం ‘ఇఐఎ 2020’. ఈ ప్రతిపాదనలు అమలైతే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు మరింత పెరిగి…మానవాళి కరోనా వంటి మరిన్ని విపత్తుల పాలుకావడం ఖాయం.
ముఖ్యమైన మార్పులు
గనులు, ఆనకట్టలు, పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులకు భూమి, నీరు, అడవులు ఇతర సహజ వనరులను అందించే చట్టబద్ధమైన ప్రక్రియే ఇఐఎ. ఇది మన దేశంలో 1994లో ప్రారంభమై కొన్ని మార్పులతో 2006 ఇఐఎ నోటిఫికేషన్ ఇచ్చారు. 2006 నుండి నేటి వరకు ఆ నోటిఫి కేషన్కు జరిగిన సవరణలు, కోర్టు ఉత్తర్వులను పరిగణ లోకి తీసుకొని ‘ఇఐఎ-2020’ రూపొందిం చామని మంత్రిత్వశాఖ చెప్పింది. అయితే చేసిన మార్పులు చూస్తే పర్యావరణాన్ని ధ్వంసం చేసే సవరణలను పొందుపర్చారే తప్ప, పర్యావరణానికి అనుకూలమైన కోర్టు తీర్పులు, గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులను పరిగణ లోకి తీసుకోలేదు.
ప్రస్తుతం ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు ఇఐఎ ద్వారా ముందస్తు పర్యావరణ అనుమతి పొందాలి. ఇప్పుడు చేసిన మార్పు ప్రకారం రెండు రకాల అనుమతులు ఉంటాయి. నిపుణుల కమిటీ నివేదికతో ముందస్తు అనుమతి లేకుండా ప్రాజెక్టులు పెట్టవచ్చు. నిపుణుల కమిటీ అనుమతి లేకపోయినా ముందస్తు అనుమతి ఇవ్వవచ్చు. అంటే నిపుణుల కమిటీ నివేదిక లేకుండానే ముందస్తు అనుమతి పొందవచ్చు. ఇది నియంత్ర ణను బలహీనపర్చడమే కదా! ప్రాజెక్టులను కేటగిరీలుగా విభజించే పని ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధి లోని దానిని పూర్తిగా సాంకేతిక నిపుణుల కమిటీకి అప్పగించి బ్యూరోక్రసీకి అపరిమితమైన అధికారాలు ఇచ్చారు. ప్రతి ప్రాజెక్టును పరిశీలించి దాని కేటగిరిని నిర్ణయించే పద్ధతి నుండి ఇఐఎ ఏకంగా 40 ప్రాజెక్టులను బి2 కింద నిర్ణయం చేసింది.
ముందస్తు అనుమతి లేకుండా ప్రారంభించే ప్రాజెక్టులను క్రమబద్ధీకరించడానికి లైఫ్లైన్ పేరుతో సవివరమైన ప్రోటోకాల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతుల వ్యవధి కూడా మార్చారు. పారిశ్రామికవేత్తల డిమాండ్తో గనుల ప్రాజెక్టులకు 30 నుండి 50 ఏళ్ళకు, నదీ పరీవాహక ప్రాజెక్టులకు 10-15 ఏళ్ళకు మిగిలిన వాటిని 7-10 ఏళ్ళకు పెంచారు. ప్రస్తుతం ప్రతి ప్రాజెక్టు సంవత్సరానికి రెండుసార్లు పర్యావరణ సంరక్షణ నివేదిక ఇవ్వవలసి ఉండగా దానిని ఒకసారికి కుదించారు.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి 1 లక్షా 50 వేల చ.మీ వరకు నిర్మాణాలకు ముందస్తు అనుమతి నుండి మినహాయించారు. ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టును వ్యూహాత్మకమైనదిగా భావిస్తే అది పర్యావరణ అంచనా నుండి మినహాయించబడుతుంది. జాతీయ రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే ఇంతవరకు వ్యూహాత్మక ప్రాజెక్టులుగా ఉండేవి. ఇపుడు ప్రభుత్వం వేటినైనా వ్యూహాత్మకంగా పరిగణించే అవకాశం ఉంది.
2006 ఇఐఎ నోటిఫికేషన్లో ప్రజాభిప్రాయానికి, వ్యక్తులు, సంస్థలు అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పబ్లిక్ కన్సల్టెన్సీ నుండి చాలా కార్యక్రమాలు తొలగించారు.
అన్ని లోతట్టు జల మార్గాల ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ, అడవుల గుండా రోడ్లు, ప్రధాన నదుల పూడికలు తీయడం, 1,50,000 చ.మీ వరకు భవన నిర్మాణాలు, బి2 కేటగిరి కింది చేర్చిన 40 రకాల ఇసుక, మట్టి, తవ్వకం, బొగ్గు, సౌరశక్తి, పివిఎస్ లకు పబ్లిక్ హియరింగ్ నుండి మినహాయింపులు ఇచ్చింది.
మరో ముఖ్యమైన మార్పు ప్రకారం… పర్యావరణ చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిపై బహిరంగంగా పౌరులు, సంస్థలు ఫిర్యాదు చేయడానికి వీలు లేదు. ఉల్లంఘించిన పరిశ్రమలు లేదా ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయాలి. పెట్టుబడిదారుల పట్ల ఇఐఎ మక్కువకు ఇది పరాకాష్ట. ప్రజా సంప్రదింపులు లేకుండా చేసి పెట్టుబడిదారుల అక్రమాలను చట్టబద్ధం చేయడం, అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం లక్ష్యంగా ఉంది. ప్రజాభిప్రాయానికి ఇచ్చే సమయాన్ని 30 రోజుల నుండి 20 రోజులకు కుదించారు.
రాష్ట్ర స్థాయి రెగ్యులేటరీ అథారిటీ, నిపుణుల కమిటీలను రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే. రాష్ట్రాలు కేవలం నామినేషన్ పంపుకోవడానికే పరిమితమవుతాయి. జిల్లా స్థాయి కమిటీలకు ఇచ్చిన నిర్ణయాధికారాలు కూడా ఆహార భద్రత, ఆరోగ్యం, కార్మికులు, సామాజిక ఆర్థిక విషయాలకు సంబంధించినవి. ఇందులో బాధ్యతలే తప్ప హక్కులు ఉండవు.
మన దేశం స్టాకహేోం డిక్లరేషన్పై (1972)పై సంతకం చేసింది. నీరు, గాలి కాలుష్యం నియంత్రిత చట్టాలను చేసింది. 1984 భోపాల్ దుర్ఘటన అనంతరం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసింది. 1994 ఇఐఎ నోటిఫికేషన్తో…దాని స్వభావం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ఆధారంగా రూపొందిన ‘ఇఐఎ 1994, ఇఐఎ 2006, ఇఐఎ 2020’…ఆ చట్టాన్ని బలహీనపరుస్తూ చివరకు విరుద్ధంగా మారాయి.
ఇఐఎ అనేది 1970లో మొదటిసారి అమెరికా ప్రారంభించింది. అమెరికా సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఆరంభంలోనే పర్యావరణాన్ని మార్కెట్కు అప్పగించే పని మొదలెట్టింది. అయితే దానివల్ల నష్టపోయే తరగతులకు ఎంతో కొంత మేలు చేయక తప్పని ఒక చారిత్రక ఆర్థిక సందర్భంలో ఇఐఎ ఏర్పడింది. అమెరికా తరువాత 80, 90 దశకాలలో నూతన సరళీకృత ఆర్థిక విధానాలను ప్రారంభించిన అన్ని దేశాలు దాదాపు ఇఐఎ ను అమలు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు దేశాలకు ఇచ్చే గ్రాంట్లు, లోన్లుకు దీని అమలు ఒక నిబంధనగా మారింది. అందులో భాగంగానే మన దేశంలో 1994 నుండి అమలు లోకి వచ్చింది. ఇఐఎ పర్మిట్ రాజ్ వంటిదని, నామమాత్రపు పర్యావరణ రక్షణలు కూడా పరిశ్రమాధిపతులు సహించలేక దాన్ని నీరుగారుస్తూ వస్తున్నారు. మరోవైపు ఇఐఎ రబ్బర్ స్టాంపు లాంటిదని, కేవలం మంత్రిత్వ ప్రకటన లేదా న్యాయ ప్రతినిధి లాగా మాత్రమేనని, బలమైన చట్టం కాదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఇఐఎ ఒక్క ప్రాజెక్టును కూడా తిరస్కరించలేదు. ఇది భూములు, అడవులపై ఆధారపడిన వారిని వెళ్ళగొట్టింది. నీటి వనరులను ప్రజలకు కాక పరిశ్రమలకు కట్టబెట్టింది. ఫలితంగానే పతనం అంచున రాష్ట్రాలు, ప్రజలు ఉంటే వనరులన్నీ కొద్దిమంది పెట్టుబడిదారులకు చేరుతున్నాయి.
ఇఐఎ లో వున్న సానుకూల అంశాలను తూట్లు పొడవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చింది. 2007లోనే రీ ఇంజనీరింగ్ పేరుతో ఆ పని చేయాలని చూసింది. అయితే ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. 2017లో ఉల్లంఘనలను క్రమబద్ధీకరించడానికి ఆయా పరిశ్రమలలో 31 సార్లు సమావేశాలు నిర్వహించారు. 2016లో 1,50,000 చ.కి పరిధి లోపు నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదన్న ప్రభుత్వ సవరణను గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసింది.
గుజరాత్ లో అలెంబిక్ ఫార్మా, యుపిఎల్, యూనిక్ కెమికల్స్కు ప్రభుత్వం పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వగా…ప్రభుత్వ చర్యలు పర్యావరణ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా…ఇఐఎ ను బలహీనపర్చే విధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ‘ఇఐఎ-2020’ను తిరస్కరించి ‘1986 పర్యావరణ పరిరక్షణ చట్టం’ పూర్తి స్థాయి అమలుకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
– కె. శేషగిరి
( వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి )