ఫేస్బుక్ను ప్రశ్నించిన ఉద్యోగులు
ముస్లిం వ్యతిరేక వైఖరిపై జవాబివ్వాలని బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, బెంగళూరు : బూటకపు వార్తలు, విద్వేష ప్రసంగాలు, ముస్లిం వ్యతిరేక ధోరణి తదితర అంశాల్లో ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరిపై 11మంది సంస్థ ఉద్యోగులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు వారు ఫేస్బుక్ నాయకత్వానికి బహిరంగంగా ఒక లేఖ రాశారు. సంస్థ అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని తీవ్రంగా విమర్శించారు. సంస్థ విధానాలు మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫేస్బుక్లో రాజకీయ సమాచారాన్ని ఏ విధంగా నియంత్రిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నామని వారు ఆ లేఖలో యాజమాన్యాన్ని, భారత్లో ఫేస్బుక్ లాబీయింగ్ అధికారి అంఖి దాస్ను ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన సోషల్ నెట్వర్క్ కలిగిన ఫేస్బుక్ భారత్లో ప్రజా సంబంధాలు, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పాలక పార్టీ బిజెపికి చెందిన రాజకీయ నేత ఒకరు ముస్లింలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ చేసిన పోస్టులకు విద్వేష ప్రసంగాలకు సంబంధించిన నిబంధనలను వర్తింపచేయడాన్ని అంఖి దాస్ వ్యతిరేకించారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో, సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భారత్లోని ఫేస్బుక్ టీమ్ సరైన పద్ధతులను, సమాచార నియంత్రణ విధానాలను పాటిస్తోందా లేదా తెలుసుకోవాలని అనుకుంటున్నామంటూ అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
భారత్కు సంబంధించిన ఫేస్బుక్ టీమ్లో వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం వుండాలని ఆ లేఖలో వారు డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందకుండా, అసహనానికి గురి కాకుండా ఉండడం చాలా కష్టమని వారు పేర్కొన్నారు. కంపెనీకి చెందిన వివిధ దేశాల ఉద్యోగులు ఇవే అభిప్రాయాలు కలిగివున్నారని పేర్కొన్నారు. ఫేస్బుక్లో వున్న ముస్లిం సభ్యులందరూ కంపెనీ నాయకత్వం నుంచి సమాధానాలు వినాలనుకుంటున్నారని తెలిపింది. దీనిపై ఫేస్బుక్ గానీ, అంఖి దాస్ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. బూటకపు వార్తలు ప్రచారం కావడం, ప్రభుత్వ మద్దతుతోనే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, తమ వేదికల ద్వారా హింసాత్మక ధోరణులు పెచ్చరిల్లేలా ప్రచారాలు జరగడం వంటి పరిణామాలపై ఫేస్బుక్ తీవ్ర విమర్శలకు గురవుతోంది.
బిజెపికి సన్నిహితులైన రాజకీయ నేతలు మాట్లాడేదానికి విద్వేష ప్రసంగాల నిబంధనలను వర్తింపచేస్తే భారత్లో కంపెనీ వ్యాపార అవకాశాలు దెబ్బతింటాయని దాస్ తన సిబ్బందికి చెప్పినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. భారత్లో 30 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారు. హింసాత్మక, విద్వేషపూరిత ప్రచారాలను అనుమతించడం లేదని, అందుకు సంబంధించిన కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఫేస్బుక్ యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. వాస్తవంగా చోటు చేసుకున్న వాటిపై తలెత్తిన ప్రశ్నలకు ఫేస్బుక్ నాయకత్వం సమాధానాలు ఇవ్వాల్సి ఉందని సంబంధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వాల్స్ట్రీట్లో కథనం వచ్చిన తర్వాత భారత్లో ఫేస్బుక్ అధిపతి అజిత్ మోహన్ అంఖి దాస్ను సమర్ధించినట్లు వార్తలు వెలువడ్డాయి.
Courtesy Prajashakti