- మేనల్లుడు అజిత్ పవార్, ఇతరులపై కూడా
- మహారాష్ట్ర ఎన్నికల ముందు కీలక పరిణామం
- సహకార స్కాంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ, : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటైన ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్పై ఉచ్చు బిగిసింది. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు రూ.25,000 కోట్ల విలువైన మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణానికి సంబంధించినది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద పవార్ ద్వయంతో పాటు ఇతరులపై ఈసీఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మూడు వారాల ముందు ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రధాన ప్రతిపక్షం శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీయే. ఎన్సీపీ ఇటీవల కాంగ్రె్సతో చేతులు కలిపింది. పవార్ స్టేట్మెంట్ నమోదు చేయడానికి త్వరలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేస్తుందని భావిస్తున్నారు. బొంబాయి హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఫిర్యాదు చేయడంతో ఆగస్టులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా పవార్ తదితరులపై ఈడీ మనీ లాండరింగ్ అభియోగం మోపింది. ఈడీ చర్య తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్య లేకపోతే ఆశ్చర్యపోయేవాడినని అన్నారు.
మాయావతి మాజీ కార్యదర్శి ఆస్తుల జప్తు
విశ్రాంత ఐఏఎస్ అధికారి, యూపీ మాజీ సీఎం మాయావతి మాజీ కార్యదర్శి నేత్రాం బినామీ ఆస్తులను ఆదాయ పన్ను(ఐటీ) శాఖ మంగళవారం జప్తు చేసింది. రూ.230 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఎస్పీ ప్రభుత్వ హయాంలో నేత్రాం పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Courtesy AndhraJyothy..