- కేబీసీ ప్రైజీమనీ రూ.5 కోట్లలో పైసా మిగల్లేదు
- ప్రస్తుతం టీచర్ కొలువు.. నెలకు రూ.18వేల జీతం
- 2011 సీజన్ విజేత సుశీల్ కుమార్ స్టోరీ ఇది
న్యూఢిల్లీ : సక్సెస్ సాధించడం ఒకెత్తు.. దాన్ని నిలబెట్టుకోవడం ఒకెత్తు. విజయం మత్తులో పడి జీవితంలో ట్రాక్ తప్పితే సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తన అనుభవ పూర్వకంగా చెబుతున్నారు ‘కౌన్ బనేగా కరోడ్పతి-2011’’లో విజేతగా నిలిచి, రూ.5కోట్ల ప్రైజ్మనీ గెల్చుకున్న బిహార్ వాస్తవ్యుడు సుశీల్ కుమార్. ప్రముఖ వ్యక్తిగా ఉండే కన్నా.. మంచి మనిషిగా ఉండటం వెయ్యి రెట్లు మేలు అని లెంపలు వేసుకుంటున్నారాయన.
కేబీసీలో విజేతగా నిలిచిన తర్వాత జీవితంలో చాలా సవాళ్లను, దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అనసవర పె ట్టుబడులు, దానాలతో డబ్బంతా పో గొట్టుకున్నానని సుశీల్ చెప్పారు. ప్రస్తుతం ఆయన నెలకు రూ.18వేల జీతంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరి.. రూ.5 కోట్లను ఏం చేశారు? అనంటే.. ప్రైజ్మనీ గెలుచుకున్న తర్వాత తన జీవితం గాడితప్పిన విధానాన్ని వివరించారు.
2015-16లో అత్యంత కష్టంగా గడిచిందని వాపోయారు. నెలకు రూ.6వేల జీతంతో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సుశీల్కు కేబీసీ ద్వారా రూ5 కోట్ల జాక్పాట్ తగలడంతో ఆయన జీవితం మారిపోయింది. స్నేహితులు పెరిగారు. అప్పటి దాకా ఎన్నడూ ముట్టని మద్యం, సిగరెట్ అలవాటయ్యాయి. మందు గ్లాసు, చేతిలో సిగరెట్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు వెళ్లడం మామూలైపోయింది. ఓ ప్రముఖుడి హోదాలో నెలలో 15 రోజులు పార్టీలకు హాజరయ్యేవారు. దురలవాట్లతో చదువు అటకెక్కింది. కొన్ని వ్యాపార సంస్థల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టారు. ఇదంతా ఏం పని చేస్తున్నారంటూ మీడియా అడిగే ప్రశ్నలకు ‘ఫలానా వ్యాపారం చేస్తున్నాను’ అని చెప్పేందుకే చేశారు.
దాదాపు అన్నిచోట్ల నష్టాలే మిగిలాయి. నెలకు రూ.50 వేల దాకా దానం చేసేవాడు. సినిమాలు తెగ చూసేవాడు. ఈ అలవాటు.. తానే ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చేస్థాయి దాకా ఆయన్ను తీసుకెళ్లింది. అంతే సొంతూరు మొతిహరి నుంచి ముంబైకి మకాం మార్చి దర్శకుడిగా ప్రయత్నాలు చేశారు. ఓ సినిమాకు స్ర్కిప్ట్ రాస్తే రూ.20వేలొచ్చాయి. అవకాశాలు రావడం లేదని అసంతృప్తితో రోజుల తరబడి గదికే పరిమితమై అదేపనిగా సిగరెట్లు కాల్చేవాడు.
చివరికి భార్యతోనూ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకదశలో వ్యవహారం విడాకుల దాకా వెళ్లింది. అయితే 2016 తర్వాత ఆయన జీవితంలో సానుకూల మార్పులొచ్చాయి. ముంబై నుంచి స్వస్థలానికి చేరుకున్నారు. నాలుగేళ్ల క్రితమే మద్యం, ఏడాది క్రితం సిగరెట్ అలవాటును మానుకున్నారు.
Courtesy Andhrajyothi