- 300 మందికి గాయాలు.. 100 మంది విషమం
- 5.8గా నమోదైన తీవ్రత..
- భారీగా ఆస్తి నష్టం
- పాక్తో పాటు భారత్లోనూ భూప్రకంపనలు
- ఢిల్లీ, చండీగఢ్ సహా పలు చోట్ల భూప్రకంపనలు
ఇస్లామాబాద్, సెప్టెంబరు 24: పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు ఈశాన్య పాకిస్థాన్లోని పలు నగరాలను భూకంపం కుదిపేసింది. పీవోకేలోని న్యూమిర్పూర్ (శ్రీనగర్కు 140 కిలోమీటర్ల దూరం) కేంద్రంగా మంగళవారం సాయంత్రం 4:02 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం కారణంగా నలుగురు పిల్లలు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో 100 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూప్రకంపనలు ఎనిమిది నుంచి పది సెకన్లపాటు కొనసాగినట్టు సమాచారం. భూకంప కేంద్రం భూమిలో 10 కిలోమీటర్ల లోతున ఉందని పాక్ వాతావరణ నిపుణుడు ముహ్మద్ రియాజ్ తెలిపారు. దాని ప్రభావం పంజాబ్ ప్రావిన్సుపైన, ఖైబర్ ఫక్తూన్ఖ్వా కనుమల్లోని కొన్ని ప్రాంతాలపైనా ఉందని.. పీవోకేలోని మిర్పూర్లో తీవ్ర విధ్వంసం జరిగిందని ఆయన వెల్లడించారు. భూకంపం ధాటికి పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్, సియాల్కోట్, ముల్తాన్, షాంగ్లా తదితర ప్రధాన నగరాలతోపాటు మనదేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), చండీగఢ్, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం భూప్రకంపనలు వచ్చాయి. రాగల 24 గంటల నుంచి 48 గంటలపాటు ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని.. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పాక్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
విధ్వంసం.. తీవ్ర నష్టం..
పీవోకేను కుదిపేసిన ఈ భూకంపంలో ప్రాణనష్టమే కాదు.. ఆస్తి నష్టమూ సంభవించింది. భారీగా పగుళ్లిచ్చిన రోడ్లు.. ఆ పగుళ్లలో పడి ధ్వంసమైపోయిన కార్లు.. కూలిన ఇళ్లు, గోడలతో మిర్పూర్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి భీతావహంగా ఉంది. జీలం నది ఎగువ భాగంలోని రహదారి భూకంపానికి దెబ్బ తినడంతో జీలం నది నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. కాగా, నష్టం అంచనా వేయడానికి పాక్ సైన్యం ఏరియల్ సర్వే నిర్వహించింది.
Couertesy AndhraJyothy..