ప్రశాంత్ భూషణ్
కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గురువారం నాడు సుప్రీం కోర్టులో చేసిన లిఖిత పూర్వక ప్రకటన పూర్తి పాఠం ఇది.
భారత సర్వోన్నత న్యాయస్థానం గౌరవనీయ న్యాయ మూర్తులు ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా చదివాను. నేను కోర్టు ధిక్కారానికి పాల్పడ్డానన్న నిర్ధారణకు గౌరవనీయ న్యాయమూర్తులు రావడం నన్ను చాలా బాధించింది. ఈ సమున్నత న్యాయస్థానం గౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వ భృత్యుడు లేదా మద్దతుదారుగా కాకుండా, ఒక విధేయుడైన రక్షకుడుగా మూడు దశాబ్దాలకు పైగా చిత్తశుద్ధితో, నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నష్టపోవలసివచ్చినప్పటికీ ఆ విధ్యుక్త ధర్మ నిర్వహణను నేను విస్మరించలేదు. గౌరవనీయ న్యాయస్థానం నన్ను శిక్షించనున్నదని కాక, నన్ను పూర్తిగా అపార్థం చేసుకోవడం వల్లే నా విషయంలో వెలువరించిన తీర్పుకు నేను బాధపడ్డాను.
న్యాయ పాలనా సంస్థపై ‘ద్రోహచింతతో, అశ్లీల, ఉద్దేశపూర్వకమైన దాడి’కి పాల్పడ్డానని న్యాయస్థానం నన్ను తప్పుపట్టడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి దాడి చేసేందుకు నన్ను పురిగొల్పిన కారణాలకు ఎలాంటి సాక్ష్యాధారాలను సమకూర్చకుండా నా గురించి కోర్టు అటువంటి అభిప్రాయానికి రావడం నన్ను చాలా వ్యాకులపరిచింది. సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా నాకు నోటీసు జారీ చేసేందుకు కారణమైన ఫిర్యాదు ప్రతినొకదాన్ని నాకు సమకూర్చవలసిన అవసరాన్ని కోర్టు గుర్తించక పోవడం పట్ల నేను ఎంతైనా అసంతృప్తి చెందాను. కోర్టు నోటీసుకు సమాధానంగా నేను దాఖలు చేసిన అఫిడవిట్లో నేను దృఢంగా ప్రస్తావించిన నిర్దిష్ట వాదనలు లేదా నా న్యాయవాది విన్నపాలకు తప్పనిసరిగా ప్రతిస్పందించాలన్న విషయాన్ని గుర్తించక పోవడమూ నన్ను బాగా కలవరపెట్టింది.
నా ట్వీట్ ‘భారత ప్రజాస్వామ్యపు అతి ముఖ్య మూలస్తంభపు పునాదిని అస్థిరపరిచే ప్రభావాన్ని కలిగివున్నదని’ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడడాన్ని నేను విశ్వ సించలేకపోతున్నాను. ఆ రెండు ట్వీట్లు నా వాస్తవిక విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, వాటిని వ్యక్తం చేయడమనేది ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా అనుమతించి తీరాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను. నిజానికి న్యాయవ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేసేందుకు దాని తీరుతెన్నులను ప్రజలు నిశితంగా పరిశీలించడం అభిలషణీయం. రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఏ సంస్థనైనా బహిరంగంగా విమర్శించడం చాలా ముఖ్యమని నేను విశ్వసిస్తున్నాను. మన జాతి చరిత్రలో ఇది ఒక ప్రత్యేక సందర్భం-. రోజువారీ బాధ్యతల కంటే ఉన్నతసూత్రాలకు ప్రాధాన్యమివ్వాల్సిన ఆవశ్యకతలో మనం ఉన్నాం. వ్యక్తిగత, వృత్తిపరమైన సభ్యతల కంటే రాజ్యాంగ వ్యవస్థను సంరక్షించాల్సిన సందర్భమిది. భవిష్యత్తు పట్ల మన బాధ్యతను నెరవేర్చడంలో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు అడ్డురాకూడదు. జాతి విశాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడకుండా ఉండడమంటే విధ్యుక్త ధర్మనిర్వహణను ఉపేక్షించడమే అవుతుంది.
మన గణతంత్ర రాజ్య చరిత్ర ప్రస్తుత దశలో నా అత్యున్నత కర్తవ్యంగా నేను భావిస్తున్న దాన్ని నిర్వహించే ప్రయత్నంలో భాగమే నా ట్వీట్లు. అన్యమనస్కంగా నేనేమీ ట్వీట్ చేయలేదు.అప్పుడూ, ఇప్పుడూ నా విశ్వాసాలుగా ఉన్న వాటినే నా ట్వీట్లు నిజాయితీగా వ్యక్తం చేశాయి. అందుకు నేను సంజాయిషీ ఇవ్వను, క్షమాపణ చెప్పబోను. అలా చేయడమంటే నేను చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడమే గాక ధిక్కారానికి పాల్పడడం కూడా అవుతుంది. కనుక జాతి పిత మహాత్మా గాంధీ తనపై ఒక కేసు విచారణలో చెప్పిన మాటలనే నేను వినయపూర్వకంగా పునరుద్ఘాటిస్తున్నాను: దయ చూపమని నేను అడగను. నా పట్ల ఔదార్యం చూపమని నేను విజ్ఞప్తి చేయను. కోర్టు నేరంగా పరిగణించినదానికి, నేను ఒక పౌరునిగా అత్యున్నత కర్తవ్యంగా భావించిన దానికి న్యాయబద్ధంగా విధించే ఎటువంటి శిక్షనైనా సంతోషంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను.
Courtesy Andhrajyothi