న్యూఢిల్లీ : వరదలు, కరువుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు సాయం అందించడంలోనూ మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోంది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు సాయం అందించే విషయంలో ఆంక్షలు పెడుతోంది. ఇటీవల కేరళ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు వరదలు, కరువుతో అతలాకుతలమయ్యాయి. కేరళ, కర్ణాటకలకు సాయం అందించే విషయంలో కేంద్రం అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు రూ.4,432 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఫొని తుఫానును ఎదుర్కొన్న ఒడిశాకు రూ.3,338.22 కోట్లు అదనపు సహాయాన్ని అందించేందుకు ఆమోదించినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. 2018-19లో కర్ణాటకలో తలెత్తిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.1,029.39 కోట్లు, హిమాచల్ ప్రదేశ్లో వడగళ్లవాన, హిమపాతం వల్ల జరిగిన నష్టాన్ని ఎదుర్కొనేందుకు రూ.64.49 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ పాలిత ప్రాంతమైన కేరళ పట్ల కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ఉచిత బియ్యం సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కేజీ బియ్యం 3 రూపాయలకు సరఫరా చేయాలని కోరింది. ఈ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. దీనికి బదులుగా కనీస మద్దతు ధర కింద కేజి రూ.26 చొప్పున సరఫరా చేయాలని కేంద్రం పేర్కొంది. వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు 15 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించినా, అదీ అందలేదు. దీంతో 4.68 లక్షల కుటుంబాలు ఆహార ఉత్పత్తుల సరఫరా కోసం ఎదురు చూస్తున్నాయి. కేంద్రం నుండి వివక్షను ఎదుర్కొ వడం కేరళ రాష్ట్రానికి ఇదే మొదటిసారికాదు. గత ఏడాది వరదల సమయం లోనూ కేరళకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు కేంద్రం నిరాకరించింది. కనీస మద్దతు ధరపై కేజి రూ. 25 చొప్పున సరఫరా చేయాలని, ఒకవేళ ఈ నగదును చెల్లించని పక్షంలో కేంద్రం అందించే రూ.500 కోట్ల వరదసాయంలో ఆ మొత్తాన్ని తగ్గిస్తామని పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చర్యను ఖండిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
కర్ణాటకలో సర్కారు మారగానే నిధుల కేటాయింపు 2019 కర్ణాటకలో సంభవించిన వరదలతో 22 జిల్లాల్లోని 103 తాలూకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 6.9 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 75,317 గృహాలు దెబ్బతిన్నాయి. కేంద్రం నుంచి నిధుల కేటాయింపుపై ‘శుభవార్త’ వింటామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. అదే రాష్ట్రం అంతకుముందు కరువుతో అల్లాడింది. రాష్ట్రంలో 176 జిల్లాలకు గాను 156 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. పంట నష్టం రూ.11,384.7 కోట్లుగా అంచనా వేయడంతో రబీ సీజన్కు కరువు సహాయక నిధి కింద రూ.2,064.30 కోట్లు కోరుతూ అప్పట్లో జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి హెచ్డి.కుమారస్వామి కేంద్రానికి మెమొరాండం సమర్పించారు. ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మోడీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) కింద ఇవ్వాల్సిన వాటినీ తగ్గించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించాల్సి వచ్చింది. గతంలో నష్టాల పై పట్టించుకోని కేంద్రం ప్రస్తుతం కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటంతో కరువు సహాయక నిధి కింద రూ.1,209.39 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. సహాయనిధి కేటాయింపుల్లో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. తమకు కరువు పరిహారం ఇవ్వాలని యాదూర్ గ్రామానికి చెందిన స్థానికులు కర్ణాటక గ్రామీణ, పంచాయతీరాజ్ మంత్రి కెఎస్.ఈశ్వరప్పను ప్రశ్నించగా, ఇప్పటికే పదివేలు ఇచ్చామని, అదే ఎక్కువని సమాధానమిచ్చారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Courtesy Prajashakthi..