– ప్రజారోగ్య సంరక్షణ బాధ్యత నుంచి తప్పుకునేందుకు మోడీ సర్కారు ఎత్తులు
– ఆ దిశగా తీసుకొచ్చిందే ఎన్డీహెచ్ఎం
– పౌరుల గోప్యతకు భంగం
– కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకే పాకులాట
న్యూఢిల్లీ : వైద్యరంగాన్ని క్రమంగా ప్రయివేటుపరం చేస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత నుంచి వైదొలిగేందుకు కేంద్రం ఎత్తుగడలు వేస్తుందా..? పౌరుల ఆరోగ్య, వ్యక్తిగత వివరాలను బడా కార్పొరేట్ కంపెనీల చేతిలో పెట్టి.. వారి గోప్యతకు చెల్లుచీటి పాడనుందా..? అంటే అవుననే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. అందుకు మార్గం సుగమం చేసేందుకే మోడీ సర్కారు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను తీసుకొస్తున్నదని ఆరోపిస్తున్నారు. దేశ ప్రజానీకానికి విధిగా వైద్య సేవలందించాల్సిన (సర్వీస్ ప్రొవైడర్) గురుతర బాధ్యత నుంచి తప్పుకుంటూ.. పౌరులకు ప్రయివేటు ఆస్పత్రులకు మధ్యవర్తి (బ్రోకర్)గా వ్యవహరించడానికి సిద్ధపడుతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీహెచ్ఎం ద్వారా పౌరులకు ఒనగూరే ప్రయోజనాలకంటే వారు నష్టపోయేదే ఎక్కువని ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. దేశంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్నంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తామనీ, తద్వారా దేశంలో ఎక్కడికి వెళ్లినా సగటు పౌరుడి ఆరోగ్య సమస్యలన్నీ తెలుసుకునే విధంగా ఒక ఐడీ కార్డు అందజేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఎన్డీహెచ్ఎంను ప్రారంభించారు. ఈ ఐడీతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధాని తెలిపారు. ఒక పౌరుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నా.. ఏ మందుల షాపులో మందులు కొన్నా ఆ సమాచారం ఐడీలోకి చేరిపోతుంది. వైద్యులు, ఫార్మసీ దుకాణదారులు, ఔషద కంపెనీలు ఆ సమాచారాన్ని చూసే వీలుంది. ఈ కార్డును ఆధార్కు అనుసంధానించే అవకాశం కూడా ఉన్నదని కేంద్రం తెలిపింది. ప్రయోగాత్మకంగా దీన్ని ముందుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పథకాన్ని మోడీ ప్రకటించిన వెంటనే బీజేపీ అనుకూల మీడియా టీవీల్లో గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. మోడీ తీసుకొచ్చే ఎన్డీహెచ్ఎం ద్వారా ఇకనుంచి దేశ ప్రజానీకానికి వైద్యం సత్వరంగా అందుతుందనే తీరులో కథనాలు ప్రసారం చేసింది. కానీ ఇది వైద్యరంగం నుంచి ప్రభుత్వం క్రమంగా పక్కకు తప్పుకునేలా ఉందని వైద్య, ఆర్థిక రంగ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. బడా కార్పొరేట్లు తీసుకొస్తున్న ఈ-ఫార్మసీ, టెలి మెడిసిన్, ఆన్లైన్ డయోగసిస్ లకు ఇది ఊతమిస్తుందని వారంటున్నారు. ఇది కార్పొరేట్లకే మేలు చేస్తుందని వాపోతున్నారు. పౌరుల వైద్య, వ్యక్తిగత చరిత్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నా.. ప్రయివేటు వైద్యులకు, బడా కార్పొరేట్ ఆస్పత్రులకు, ఔషదాలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఈ సమాచారం అందుబాటులో ఉంచుతున్న మూలానా అది మరింత ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔషద సంస్థలకు పౌరుల ఆరోగ్య వివరాలు ఉంచడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని వారు అంటున్నారు. ఆధార్ భద్రత మీదే అనుమానాలున్న నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చే ఎన్డీహెచ్ఎం ఐడీ ఎంతవరకు సేఫ్ అనేది ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ వైద్యం.. ప్రయివేటుపరం
రెండేండ్ల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోడీ ప్రకటించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనా (ఆయుష్మాన్ భారత్) వైద్యరంగం నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు ఉద్దేశించిన ప్రధాన నిర్ణయమని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇది ప్రయివేటు బీమా కంపెనీలకు మేలు చేసిందే తప్ప ప్రజలకు, ప్రభుత్వ వైద్యరంగానికి ప్రయోజనకరం కాదని వారు విశ్లేషిస్తున్నారు. ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) 1978లో ప్రకటించిన ‘2000 నాటికి అందరికీ వైద్యం’లో భాగంగా భారత్ తొలిసారి 1983లో నేషనల్ హెల్త్ పాలసీ (ఎన్హెచ్పీ)ని ప్రకటించింది. దాని స్థానంలో 2002 ఎన్హెచ్పీ వచ్చింది. 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), 2013లో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం)ను తీసుకొచ్చారు. 2013లో వీటన్నింటినీ ఎన్హెచ్ఎం కిందకు మార్చారు. వీటి అమలులో ఐసీడీఎస్, ఆశాలదే కీలకపాత్ర.
అయితే మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఎన్హెచ్పీ-2002 స్థానంలో ఎన్హెచ్పీ-2017 ను తీసుకొచ్చింది. దీని తర్వాతే మోడీ ఆయుష్మాన్ భారత్ ప్రకటించి.. వైద్యరంగాన్ని ప్రయివేటుకు ధారాదత్తం చేశారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-3 వివరాల ప్రకారం.. నగరాల్లో 70 శాతం మందికి గ్రామీణ భారతంలో 63 శాతం మందికి ప్రయివేటు వైద్యరంగమే దిక్కవుతుందంటే.. పౌరుల వైద్యసేవల బాధ్యత నుంచి ప్రభుత్వం ఏ విధంగా నిష్క్రమిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
రిలయన్స్ ఎంట్రీ..
మోడీ ఎన్డీహెచ్ఎంను ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత వచ్చిన ఒక వార్త పై ఆరోపణలన్నింటికీ ఆజ్యం పోస్తున్నది. ప్రధాని మిత్రుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్.. ఈ-ఫార్మసీ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘నెట్మెడ్స్’లో 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ. 620 కోట్ల విలువైన ఈ ఒప్పందంతో ఈ-ఫార్మసీ వ్యాపారంలోనూ అంబానీ ప్రవేశిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సందర్భంగా వ్యాపార రూపాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే కొద్దికాలం క్రితమే ఆయన జియోమార్ట్ను కూడా తీసుకొచ్చిన విషయం విదితమే. ఇప్పటికే మోడీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్, ప్రధాని ఫసల్ బీమా యోజనా ద్వారా దాని లబ్దిదారుల కంటే అంబానీ బీమా సంస్థలే అధికంగా లాభం పొందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
Courtesy: NT