– కోవిడ్ ఆస్పత్రుల్లో అనధికారికంగా డెలివరీలు
ఒక్కొక్కరి వద్ద 4 లక్షల ఫీజు
– వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా చికిత్స
– అనుమానాలున్నాయని ఐసోలేషన్లో ఉంచి ఆపరేషన్లు?
– ప్రయివేటు దవాఖానాల వ్యాపారం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో అనధికారికంగా ప్రసవాలు నిర్వహిస్తున్నారు. వైద్యాధికారులకు సమాచారం అందించకుండానే గుట్టుగా డెలివరీలు చేస్తున్నారు. ప్యాకేజీల పేరిట బాధితుల నుంచి లక్షలు వసూలు చేస్తూ కండ్లు బైర్లుకమ్మేలా ఫీజులు దండుకుంటున్నారు. దీంతో డెలివరీలకు వెళ్లాలనుకునే గర్భిణులు ఎంత ఫీజు కట్టాల్సి వస్తుందోనని జంకుతున్నారు. ఇటీవల అనుమానం ఉందనే సాకుతో ఓ బాధిత కుటుంబం నుంచి లక్షలకు బేరసారాలు చేసిన వైనం వెలుగులోకి రాగా.. మూడ్రోజుల క్రితం అదే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్ ప్యాకేజీ కింద రెండు డెలివరీలు చేయడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఏడు ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో కొన్ని ఆస్పత్రులు అనుమతుల్లేకున్నా ప్రసవాలు నిర్వహిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజులపై రాతపూర్వక ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులంటున్నా.. ఈ సమయంలో వైద్యం అందితేనే చాలన్నట్టు బాధితులు భావిస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలో కోవిడ్ వైద్యంపై ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. రోగులకు వైద్య చికిత్స ఖర్చులు ముందుగానే తెలియజేయాలనీ, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల వివరాలు డిస్ప్లే చేయాలనీ స్వయంగా జిల్లా కలెక్టర్ సూచించినప్పటికీ.. కొన్ని ఆస్పత్రులు పెడచెవిన పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన చార్జీలను అమలు చేయడం లేదు. సాధారణ ఐసోలేషన్కు ప్రతిరోజూ రూ.4 వేలు, ఐసీయూ చార్జీలు రూ.7,500, వెంటిలేటర్ రూ.9వేల చొప్పున వసూలు చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అందులోనే బెడ్, భోజనంతో పాటు పర్యవేక్షణ చార్జీలను కలిపి నిర్ధారించింది. దేశవ్యాప్తంగానూ వెంటిలేటర్ల వినియోగం చాలా తక్కువని కేంద్రమూ తెలిపింది. ఒకవేళ ప్రయివేటు ఆస్పత్రులకు రోగి సీరియస్ స్థితిలో చేరారని భావించినా ప్రతిరోజూ రూ.9వేల చొప్పున 14 రోజులకు లక్షా 26 వేలు మాత్రమే బిల్లవుతుంది. కానీ జిల్లాలో పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒక్కో రోగి నుంచి రూ.3 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నారు.
‘ప్యాకేజీ’ కడితే ఎలాగైనా చికిత్స..
కరోనా పాజిటివ్, అనుమానిత గర్భిణులకు అధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు చికిత్స అందించడం లేదు. అనుమానితులను, పాజిటివ్ రోగులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి లేదా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రం ప్యాకేజీలతో ప్రసవాలు కొనసాగిస్తోంది. కరోనా సోకిన గర్భిణి సాధారణ కాన్పు జరిగితే రూ.3.5 లక్షలు, ఆపరేషన్ చేస్తే రూ.4 లక్షల వరకు ఫీజు తీసుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఓ నిండు గర్భిణి ఆ దవాఖానాకు వెళ్లగా.. కోవిడ్ లేకున్నా మూడున్నర లక్షలు కడితేనే వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అసలు అనుమానిత కేసులు, పాజిటివ్ వస్తే ప్రయివేటులో ఎక్కడా వైద్యం చేయడం లేదనీ, ప్రభుత్వ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నామనీ సదరు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కానీ ఈ నెల 21న అదే ఆస్పత్రిలో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ప్యాకేజీ కింద ఇద్దరు గర్భిణులకు ఆపరేషన్ చేయడం గమనార్హం. అయితే కోవిడ్ చికిత్సకు అనుమతి పొందిన ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రసవాలతో పాటు అన్ని చికిత్సలు చేసుకునే అవకాశం ఉంది. కానీ అనుమతుల సమయంలో ప్రసవాల నిర్వహణకు సంబంధిత ఆస్పత్రులేవీ ముందుకు రాలేదు. ఒకవేళ ప్రసవాలు నిర్వహించినా వివరాలను జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయానికి అందజేయాలి. ఇవేవీ జరగకుండా లక్షలు తీసుకుని, ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది.
ప్రసవాలు చేస్తున్నట్టు సమాచారం లేదు : రమేష్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ నిజామాబాద్
కోవిడ్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు పలువురు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఆస్పత్రిలో ఎంత వసూలు చేశారనే దానిపై రాతపూర్వక ఫిర్యాదులైతే అందలేదు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తే సంబంధిత ఆస్పత్రులను సీజ్ చేస్తాం. ఇక కరోనా బాధితులకు ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసినట్టు ఎలాంటి సమాచారమూ లేదు. జిల్లాలో ఒక ఆస్పత్రి మాత్రమే ప్రసవాలకు సుముఖత చూపినా, ఇప్పటివరకు ఆ ఆస్పత్రి నుంచి ప్రసవాలు చేసిన వివరాలైతే మాకు రాలేదు.
Courtesy Navatelangana